సైబర్ కేటుగాళ్లకు అకౌంట్ల దళారీ
శివమొగ్గ: డబ్బు ఆశ చూపి ప్రజల బ్యాంకు ఖాతాలను సైబర్ వంచకులకు అందిస్తున్న శివమొగ్గకు చెందిన శరత్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గుండ శరత్ కుమార్ శివమొగ్గ నగరంలోని తుంగానగర నివాసి. డ్రైవర్గా పనిచేస్తాడు. సైబర్ నేరగాళ్లకు దళారీగా ఉన్నాడు, టీ అంగడి పెట్టుకున్న స్నేహితుడు అమిత్ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నాడు. బదులుగా 15 రోజులకు ఒకసారి కమీషన్ ఇస్తానని ఆశపెట్టాడు. కొన్నాళ్లకు నీ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందని చెప్పాడు. అమిత్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి తన ఖాతా గురించి విచారణ చేశాడు. నీ ఖాతాపై 51 సైబర్ నేరాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆందోళనకు గురైన అమిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రూ.55 కోట్ల మోసాలు?
దీంతో శివమొగ్గలోని సీఈఎన్ పోలీసులు శరత్కుమార్ను బంధించి అతని నుంచి వివిధ బ్యాంకుల 18 పాసు పుస్తకాలు, 25 ఏటీఎం కార్డులు, 7 చెక్బుక్కులు, 2 మొబైల్ఫోన్లను, 2 క్యూఆర్ కోడ్లను స్వాధీనపరచుకున్నారు. అతని వద్ద ఉన్న 19 అద్దె బ్యాంకు ఖాతాలపై దేశ వ్యాప్తంగా 96కు పైగా వంచన కేసులు నమోదయ్యాయి. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.55.43 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ 19 ఖాతాల నుంచి రూ.11.48 కోట్లు బదిలీ అయ్యింది. జిల్లా ఎస్పీ బీ.నిఖిల్ మార్గదర్శనంలో ఏఎస్పీలు కార్యప్ప, రమేష్, శివమొగ్గ సైబర్ క్రైం డీఎస్పీ కృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ మంజునాథ్ దర్యాప్తు చేపట్టారు.
రూ.లక్షకు
5 వేలు
ఖాతాలో పడే ప్రతి లక్ష రూపాయలకు రూ.5 వేల వరకు ఖాతాదారుకు కమీషన్ ఇస్తారని తెలిసింది. దీనినే ఒక లాభదాయక వృత్తిగా చేసుకుని సైబర్ నేరాల్లో పాల్పంచుకుంటున్నట్లు బట్టబయలైంది.
అమాయకుల ఖాతాల్లోకి మోసాల డబ్బు
శివమొగ్గలో బడా కేటుగాడు అరెస్టు
సైబర్ కేటుగాళ్లకు అకౌంట్ల దళారీ


