పొంచి ఉన్న విద్యుత్ షాక్
● నియంత్రణ కమిషన్కు
ఎస్కాంల ప్రతిపాదన
● త్వరలో విద్యుచ్ఛక్తి చార్జీలు
పెరిగే అవకాశం
శివాజీనగర: నిత్యవసర వస్తువుల ధర పెరుగుదల రోజురోజుకు అధికమవుతున్న తరుణంలో ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్ ఎదురు కానుంది. త్వరలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేసే అనేక కంపెనీలు నష్టాల్లో కొనసాగుతుండగా, ఆదాయాన్ని సరిచేయటానికి విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుచ్చక్తి నియంత్రణ కమిషన్కు బెస్కాం ప్రతిపాదన సమర్పించింది. ప్రతి యూనిట్కు రూ.1 చొప్పున విద్యుత్ చార్జీ పెంచాలని బెస్కాం విన్నవించింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలు, వాణిజ్య, గృహోపయోగ కనెక్షన్లపై ప్రభావం చూపవచ్చు. కర్ణాటకలో విద్యుత్ సరఫరా కంపెనీ(ఎస్కాం)లు రూ.4,900 కోట్లకు పైగా ఆదాయ కొరతను సరిచేసేందుకు 2026 ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలను మళ్లీ పెంచే అవకాశం అధికంగా ఉంది. కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్కు ఎస్కాంలు ప్రతిపాదనలు సమర్పించగా, ప్రజల విచారణ తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పెంపుదల ప్రతి యూనిట్కు 8–10 పైసల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఎస్కాంలు ఆదాయ కొరతను సరిచేసేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థకు విన్నవించారు. 2025 మార్చిలో కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్ ప్రతి యూనిట్కు 36 పైసల వరకు విద్యుత్ ధరను పెంచింది. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులపై విద్యుత్ చార్జీలను పెంచటం ద్వారా తమ రూ.4,620 కోట్ల ఆదాయ తారతమ్యాన్ని సరిచేయాలని విద్యుత్ సరఫరా మండలి కర్ణాటక విద్యుత్ నియంత్రణ కమిషన్ను కోరిందని తెలిసింది. గత సంవత్సరం మార్చిలో ధర పెంచినపుడు కేఈఆర్సీ వేసిన అంచనాల్లో ఖర్చు అధికం కాగా ఆదాయంలో కోత పడింది.
మెట్రో ధరల పెంపుపై నిరసన
బనశంకరి: నమ్మమెట్రో టికెట్ ధరల పెంపును ఖండిస్తూ ఉప్పు, పప్పు, బెల్లం, టూత్పేస్ట్ తదితర వాటితో కర్ణాటక రక్షణావేదిక కార్యకర్తలు, కన్నడపర సంఘాల కార్యకర్తలు శుక్రవారం వినూత్నరీతిలో ధర్నా చేపట్టారు. సోపు, టూత్పేస్ట్, టూత్బ్రష్, బియ్యం, కందిపప్పుతో శాంతినగర బీఎంఆర్సీఎల్ కార్యాలయానికి చేరుకున్నారు. మెట్రో టికెట్ కొనడానికి తమ వద్ద డబ్బు లేదని, అందుకే ఈ వస్తువులను తీసుకొని టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. మెట్రో టికెట్ల ధర పెంపుతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణికులపై పెను భారం పడుతుందన్నారు. తక్షణం మెట్రో టికెట్ ధర తగ్గించాలని, లేనిపక్షంలో పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
విమానాశ్రయంలో
బంగారం చోరీ
యశవంతపుర: బెంగళూరు దేవనహళ్లిలోని కెంపేగౌడ విమానాశ్రయంలో కొద్ది రోజుల క్రితం బంగారం, వజ్రాల చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా ప్రయాణికురాలు ఒకరి బ్యాగ్ నుంచి లక్షల విలువగల ఆభరణాలు మాయమయ్యాయి. బెంగళూరు దేవనహళ్లి విమానాశ్రయం నుంచి దుబైకి వెళుతున్న హుబ్లీకి చెందిన మహిళకు చెందిన 790 గ్రాముల బంగారం, రూ.8 లక్షల విలువగల వజ్రాలు మాయమైనట్లు తెలిసింది. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో ఆభరణాలున్నట్లు గుర్తించి సిబ్బంది తనిఖీ చేసి బ్యాగ్కు ట్యాగ్ వేశారు. దుబైకి వెళ్లి మహిళ చూసుకోగా బంగారం, వజ్రాలు మాయం అయ్యాయి. చోరీలో విమానాశ్రయం సిబ్బంది చేతివాటం ఉన్నట్లు మహిళ అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలు బెంగళూరు దేవనహళ్లి విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


