మృత్యురూపమైన లారీ
● ఇద్దరు దుర్మరణం
మైసూరు: లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొనడంతో స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. నంజనగూడు తాలూకా హనుమనపుర గేట్ వద్ద శనివారం ఉదయం జరిగింది. మైసూరులోని జేపీ నగర నివాసి చంద్రు (38), మహిళ శీలా (35) మృతులు. చంద్రు, శీలా బైక్లో సంతేమరహళ్లి వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఎరువు లోడ్ లారీ ఢీకొంది. దీంతో అదుపు తప్పి కింద పడటంతో అదే వేగంలో లారీ వారిద్దరి తలలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడే మరణించారు. విషయం తెలియగానే స్థలానికి డీఎస్పీ రఘు, సీఐ చంద్రశేఖర్, కవలందె పోలీసు స్టేషన్ ఎస్ఐ బసవరాజు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను నంజనగూడులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
అనుమానిత ఉగ్రవాది మృతి
బనశంకరి: బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న అనుమానిత ఉగ్రవాది ఆస్పత్రిలో చనిపోయాడు. వివరాలు... నిందితుడు సాదిక్ పాషా (47)ని నగరంలో సుద్దగుంటెపాళ్యలో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కేసులో 2020లో పోలీసులు అరెస్టు చేసి సెంట్రల్ జైలులో ఉంచారు. అతనితో పాటు మరో 6 మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారించి రిమాండుకు తరలించారు. అప్పటినుంచి చెరసాలలోనే ఉంటున్నాడు. ఆరునెలలుగా లో బీపి, హై సుగర్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు జైలు సిబ్బంది తెలిపారు. దీంతో ఇటీవల విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి అతడు మరణించాడని చెప్పారు.
బీఎంటీసీ బస్సు ఢీకొని
మణిపూర్ యువతి బలి
బనశంకరి: ఉపాధి కోసం మరో రాష్ట్రం నుంచి వలస వచ్చి జీవిస్తుంటే, కిల్లర్ బీఎంటీసీ బస్ డీకొని మణిపూర్ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలో కృష్ణరాజపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. హెన్నా ఇనకా (20) అనే యువతి నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ మారతహళ్లిలో నివాసం ఉండేది. శుక్రవారం ఉదయం 9:30 సమయంలో ఆమె మరొకరితో కలిసి బైక్లో వెనుక కూర్చుని వెళ్తోంది. సిల్క్బోర్డు నుంచి టిన్ ఫ్యాక్టరీకి వెళుతున్న బీఎంటీసీ బ్యాటరీ బస్సు , కృష్ణరాజపురం రైల్వేస్టేషన్ రోడ్డులో వారికి తగిలింది, దీంతో బైక్ కిందపడగా, హెన్నాఇనకా తల మీద నుంచి ఆ బస్సు ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొంతసేపటికి చనిపోయింది. కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దుబాయ్కి తీసుకెళ్లి.. రూ.1.80 కోట్ల వసూలు
మైసూరు: కేరళకు చెందిన ఇద్దరు దుండగులు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మైసూరుకు చెందిన ఓ విద్యార్థి నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మోసగించారు. వివరాలు.. మైసూరులోని కువెంపునగర నివాసి ప్రశాంత్ బాధితుడు. ఇతడు పీయూసీ చదువుతున్నప్పుడు కేరళకు చెందిన విశ్వనాథన్, స్నేహ మరియా అనే ఇద్దరితో పరిచయమైంది. వారు తాము చదువు ముగించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రశాంత్ను నమ్మించారు. నీకూ విదేశంలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. తర్వాత అతనిని బెంగళూరు మీదుగా హాంకాంగ్, దుబాయ్కు తీసుకెళ్లారు. ఇక్కడ మంచి ఉద్యోగం చేస్తున్నాడని అతని తల్లిదండ్రులకు చెప్పి నమ్మకం కలిగించారు. అతనిని దుబాయ్లో ఉంచి దశల వారీగా రూ.1.80 కోట్లను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. డబ్బులు రాగానే దుబాయ్లో ప్రశాంత్ ను వదిలేసి ఎక్కడికో ఉడాయించారు. తర్వాత స్నేహితులు, బంధువుల సాయంతో ప్రశాంత్ దుబాయ్ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. కువెంపునగర పోలీసు స్టేషన్లో మోసగాళ్లపై ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
మృత్యురూపమైన లారీ
మృత్యురూపమైన లారీ


