లఘు విమాన పతనంపై అనుమానాలెన్నో?
హుబ్లీ: పరిశీలన, ధ్రువీకరణ తర్వాత శిక్షణ విమానంలో ఇంధనం ఖాళీ ఎలా అయిందన్న ప్రశ్న తలెత్తింది. విజయపుర జిల్లా బబలేశ్వర తాలూకా మంగళూరు గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం పైలెట్ శిక్షణ కోసం తీసుకెళ్లిన లఘు విమానం పతనం అయింది. ఆ జిల్లా ఎస్పీ లక్ష్మన్ నింబరిగితో కూడిన పోలీస్ బృందం ఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే ఆ సంస్థ ముఖ్యస్థులు ఘటన స్థలానికి విచ్చేసి పతనం గురించి వివరాలను సేకరించారు. పైలెట్ కునాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంధనం ఖాళీ అయినందు వల్లే విమానం పతనం అయిందన్నారు. ఏ విమానం అయినా ఎగరడానికి ముందు ఇంధన స్థితి పరిమాణాన్ని పరిశీలిస్తారు. విమానం ఎగిరే స్థలం నుంచి ల్యాడింగ్ అయ్యే స్థలం ఎంత దూరంలో ఉంది. ఆ స్థలానికి చేరుకోవడానికి ఇంధనం ఎంత ప్రమాణంలో కావాలన్న దాన్ని పరిశీలించి విమానం టేకాఫ్కు అనుమతి ఇస్తారు. అయితే ఈ విమానం కలబుర్గి నుంచి బెళగావికి వెళ్లే దారిలో కూలిపోయింది. ఈ నేపథ్యంలో విమానం టేకాఫ్ కావడానికి ముందే పరిశీలించలేదా? అన్న ప్రశ్న తలెత్తింది. ఒక వేళ పరిశీలించిన తర్వాత నిర్ధిష్ట ప్రమాణంలో ఇంధనం ఉంటే విమానం కూలిపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. విమానం రైతుల పొలంలో పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ జనవసతి ప్రాంతంపై కూలి పోయి ఉంటే మరణాలు సంభవించే అవకాశం ఉండేది. దీంతో ఇంధనం తక్కువైందన్న అనుమానాలు కనిపిస్తుండగా ఈ విషయంలో దర్యాప్తు తర్వాతే అసలు విషయం వెల్లడి కానుంది.


