యూజీసీ నిబంధనలు అమలు చేయాలి
బళ్లారిఅర్బన్: విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థుల హక్కుల రక్షణకు యూజీసీ నిబంధనలను వెంటనే అమలు చేయాలని కర్ణాటక రాష్ట్ర దళిత సమితి డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఆధారిత వేధింపులు కొనసాగుతున్నాయని, దీని వల్ల అనేక మంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని సమితి పేర్కొంది. రోహిత్ వేముల, పాయల్, దర్శన్ సోలంకి వంటి ఘటనలు సంస్థాగత వివక్షకు ఉదాహరణలని పేర్కొంది. యూజీసీ రూపొందించిన 2025–28 నిబంధనలపై సుప్రీంకోర్టు విధించిన స్టేను తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సమితి కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోహిత్ వేముల చట్టంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టి, జిల్లాధికారి ద్వారా ప్రధాని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.


