రెండు కార్ల ఢీ: ఒకరు మృతి
● నలుగురికి తీవ్ర గాయాలు
సాక్షి బళ్లారి: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దావణగెర జిల్లా చెన్నగిరి తాలూకా ఉన్నేభాగి సమీపంలో చోటు చేసుకుంది. చెన్నగిరి తాలూకా నల్లూరు నుంచి వక్కల వ్యాపారం కోసం వెళ్తున్న వారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు దూరంగా పడిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడి వారిని చికిత్స నిమిత్తం దావణగెర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సిరి ధాన్యాలతో ఆరోగ్యం
రాయచూరు రూరల్: దేశంలో మిల్లెట్స్ (సిరి ధాన్యాల) వినియోగంతో అరోగ్యంగా ఉండవచ్చని వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ తెలిపారు. గురువారం రాత్రి వ్యవసాయ విశ్వ విద్యాలయంలో వ్యవసాయ మేళా–2026 నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కళ్యాణ కర్నాటకలోని ఏడు జిల్లాల్లో జొన్న, కొర్ర, సజ్జ, మినుములు, నువ్యులు, రాగి, గోధుమ పంటలు పండించేందుకు వ్యవసాయ విశ్వ విద్యాలయానికి రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని తెలిపారు. శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ, విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ హనుమంతప్ప, సిండికేట్ సభ్యులు బసన గౌడ, మల్లేష, మధుసూదన రెడ్డి, డీసీ నీతిష్, ఎస్పీ అరుణాంగ్శు గిరి మాదయ్య, దేశాయి, నాయక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
11, 12 తేదీల్లో ప్రార్థన కూడికలు
సాక్షి బళ్లారి: సమాజంలో అనేక మందిని సన్మార్గంలో నడిపించిన పీ.సీ.పరమానంద జ్ఞాపకార్థం ఈనెల 11, 12 తేదీల్లో బళ్లారి పట్ణణంలో ప్రార్థన కూడికలు ఏర్పాట్లు చేస్తున్నట్లు విక్టర్ ఇమ్మానియేల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశ విదేశాల్లో దైవ వర్తమానాన్ని వినిపిస్తున్న ఇవాంజలిస్ట్ డాక్టర్ పీ.ఎస్.రాంబాబు పాల్గొని ‘డూనామిస్–దేవుని రాజ్యపు శక్తి’ కూటమి ఏర్పాటు చేస్తారన్నారు. బళ్లారి సీఎస్ఐ తెలుగు చర్చీ ఆవరణలో రెండు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సభల్లో అన్నిక రాంబాబు పాల్గొని దైవ వర్తమానాన్ని వినిపిస్తారని వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో అద్భుతమైన ఆరాధన జరిపేందుకు బెంగళూరు నుంచి ప్రార్థన బృందం వస్తుందన్నారు. యువత కోసం 12న ప్రత్యేక దైవ వాక్య సందేశం, ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు.
ఆలయంలో
మాంసపు సంచులు
బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని నాగలకెరె ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసంతో కూడిన ప్లాస్టిక్ సంచులు లభ్యం కావడం కలకలం రేపింది. ఇటీవల ప్రారంభమైన పిస్తా హౌస్ రెస్టారెంట్ వెనుక భాగంలో ఉన్న ఆలయ పరిసరాల్లో సంచులు లభించాయి. ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకుడు మహేష్.. దీనిని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాంసపు సంచులను తొలగించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన వెనుక కిడిగాళ్ల చర్య ఉందా? లేదా కుక్కలు తీసుకొచ్చాయా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. బళ్లారి వలయ ఐజీ డాక్టర్ హర్ష, ఏఎస్పీ రవికుమార్ ఆలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు. వాస్తవాలు తేలిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా ఆలయాన్ని సందర్శించారు.
రెండు కార్ల ఢీ: ఒకరు మృతి


