కమనీయం.. రథోత్సవం
సాక్షి, బళ్లారి: నగరంలోని కోట వీధిలో ప్రసిద్ధి చెందిన కోట మల్లేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మోతీ సర్కిల్ నుంచి తేరు వీధి, కణేకల్లు బస్టాండ్ వరకూ జనసందోహంగా మారింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని తొలుత ఆలయంలో విశేష పూజలు చేపట్టారు. ఉదయం తేరువీధిలో సంప్రదాయబద్ధంగా రథానికి పూజలు చేసి, మడితేరును లాగారు. ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, నగర మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, తేరు వీధిలోని ప్రముఖులు, కోట మల్వేశ్వర ఆలయ నిర్వాహకులు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తేరును ముందుకు లాగారు. మడితేరును నగర వాసులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం మహారథోత్సవం నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు సమక్షంలో రథాన్ని ముందుకు లాగారు. బ్రూసుపేట పోలీసు స్టేషన్, పెద్ద మార్కెట్, కణేకల్లు బస్టాండు వరకూ రథోత్సవం కొనసాగింది. రథాన్ని లాగే సమయంలో ఓం నమఃశివాయ.. కోట మల్లేశ్వర స్వామి నమోనమః, హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు రథంపైకి అరటి పండ్లు, పూలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల కోలాహలం..
కోట ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన పరమశివుడు కోట మల్లేశ్వర స్వామిగా అవతరించారని భక్తులు విశ్వాసం. మాఘపౌర్ణమి రోజున శివలింగాన్ని దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోట ప్రాంతం నుంచి, మోతీ సర్కిల్, తేరు వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జనం భారీ ఎత్తున తరలి రావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
రథంపై ఊరేగిన కోట మల్లేశ్వర స్వామి
భక్తజన సంద్రంగా మారిన బళ్లారి
మార్మోగిన ఓ నమః శివాయ నామస్మరణ
ఆలయానికి పోటెత్తిన భక్తులు
కమనీయం.. రథోత్సవం
కమనీయం.. రథోత్సవం


