కొత్త రోడ్డు వంతెనకు మోక్షం
బళ్లారిఅర్బన్: గత 25 ఏళ్ల నుంచి స్థానికులకు తీరని సమస్యగా పరిణమించిన ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కంప్లి, కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని జంతకల్ మధ్య ప్రవహించే తుంగభద్ర నదిపై కొత్త రోడ్డు వంతెన నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుతం కంప్లి కోట వద్ద నుంచి కొప్పళ జిల్లా గంగావతి వైపునకు ఉన్న వంతెనను 1961లో ప్రజాపనుల శాఖ నిర్మించింది. అప్పుడప్పుడు నదిలో వరద పోటెత్తి వంతెనపై నుంచి ప్రవహించడంతో వాహనాలతో పాటు జనసంచారం స్తంభించి పోయేది. దీంతో జిందాల్, బీటీపీఎస్, మైనింగ్ కంపెనీల భారీ వాహనాల సంచారానికి గత 25 ఏళ్ల నుంచి వర్షాకాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వంతెన అక్కడక్కడ శిథిలం అయింది. మరమ్మతులు చేసినా కూడా ప్రయోజనం కలగలేదు. వర్షాకాలంలో తుంగభద్ర డ్యాం నుంచి నదికి లక్ష క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తే వంతెనపై ప్రజలతో పాటు వాహనాల సంచారం నిలిచిపోతుంది. దీంతో ఇక్కడ కొత్త వంతెనను చాలా ఎత్తులో నిర్మించాలని చాలా ఏళ్ల నుంచి స్థానికులు కోరుతున్నారు.
రూ.100 కోట్లతో నిర్మాణానికి సర్కారు అనుమతి
ఈ విషయంలో అనేక సార్లు ప్రభుత్వ పాలకులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తే ఎప్పటికప్పుడు కొత్త వంతెన నిర్మిస్తామని హామీలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఆచరణ రూపం దాల్చలేదు. తాజాగా ప్రస్తుతం ఉన్న వంతెన కింది భాగం అంటే సిరుగుప్ప వైపు అర కిలోమీటర్ అంతరంలో కొత్త వంతెన నిర్మాణం చేయడానికి మట్టి పరీక్ష ప్రక్రియ ప్రారంభం అయింది. అటు వైపు జంతకల్ శివారు నుంచి ఇటు కంప్లి, ఇటిగి మార్గం మీదుగా సిరుగుప్ప రోడ్డుకు అనుసంధానం చేస్తూ వంతెన నిర్మాణం చేపడతారు. కాగా గతంలో కన్నా అర్థ కిలోమీటర్కు పైగా దూరం కానుంది. మొత్తం రూ.100 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం మట్టి పరీక్ష చేశాక డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని బళ్లారిలోని ప్రజా పనుల శాఖ ఏఈఈ గంజి బసవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
కంప్లి వద్ద తుంగభద్ర నదిపై
త్వరలో నిర్మాణం
కార్యరూపం దాల్చనున్న
ప్రజల చిరకాల వాంఛ
కొత్త రోడ్డు వంతెనకు మోక్షం


