మామిడి పూతతో కళకళ
చింతామణి: కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాలు మామిడి తోటల నిలయంగా పేరుపొందాయి. ఇక్కడ పండే మేలిరకం మామిడి పండ్లు దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయి. వేసవి వస్తుండడంతో మామిడి తోటలు పూతతో కళకళలాడుతున్నాయి. దీంతో పంట బాగా వస్తుందని మాలపల్లికి చెందిన మామిడి రైతు శివారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాలూకాలోని మామిడి తోటలు నిండుగా పూతతో దర్శనమిస్తున్నాయి.
గాలిపటం దారానికి నరం కట్
యశవంతపుర: గాలిపటం దారం తగిలి జనం తీవ్రంగా గాయపడిన సంఘటనలు హైదరాబాద్లోనే కాదు.. బెంగళూరులోనూ జరుగుతున్నాయి. బెంగళూరు ఆర్టీనగరలో జనవరి 31న బైకుపై వెళుతున్న వ్యక్తికి గాలిపటం దారం తగిలింది, అతడు దానిని విడిపించుకొన్నాడు. వెనుక నడిచి వెళుతున్న నాగరాజు అనే వ్యక్తి కాలికి చుట్టుకొని నరం కట్ అయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతనిని ఆస్పత్రిలో చేర్పించారు. అది నైలాన్ దారమని, అందుకే తీవ్ర గాయమైందని తెలిసింది. నగరంలో వంతెనలపై వెళ్లే బైకిస్టులు గాలిపటాల దారం నుంచి జాగ్రత్తగా ఉండాలని, వీలైతే రక్షణ కవచం ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై పడిన దారాలను ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పారు.
గ్యాస్ ప్రమాదంలో
కుటుంబం బలి
దొడ్డబళ్లాపురం: ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన సంఘటన కనకపురలో జరిగింది. దంపతులు సిద్ధరాజు (55), చంద్రమ్మ (50), కుమారుడు ప్రశాంత్ (22) మృతులు. అమర నారాయణ కాలనీలో రెండు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగి ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు, వారిని బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పలించక సోమవారంనాడు మరణించారు.
మహిళాధికారుల రౌద్రరూపం
● దావణగెరె, బెళగావిలో వైరల్
దొడ్డబళ్లాపురం: దావణగెరె జిల్లా చిగటేరి జిల్లా ఆస్పత్రి ఆవరణలో కొందరు ఆకతాయిల మధ్య గొడవలు జరిగాయి, దీంతో పోకిరీలను అరెస్టు చేయడానికి మహిళా సీఐ మొండిపట్టుతో ప్రయత్నించడం జిల్లాలోనే చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నాయకుల కుమారులు హసేన్, హుసేన్ అనుచరులతో కలిసి కానిస్టేబుళ్లు హరీష్, కెంచప్పపై దాడి చేశారు. ఇది తెలిసి నిందితులను అరెస్టు చేయడానికి సీఐ గాయత్రి వెళ్లారు. కానీ అధికార పార్టీ వారమని ఎదురుతిరిగారు. వారిని అరెస్టు చేసి గానీ ఇక్కడి నుంచి కదలను అని ఆమె భీష్మించారు. చివరకు నలుగురు ఆకతాయిలను అరెస్టు చేసి తరలించారు.
మైనింగ్కు చెక్
అక్రమంగా గని తవ్వుతున్న వారి మీద మహిళా అధికారి ఉగ్రరూపం దాల్చారు. బెళగావి వద్ద అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు తెలిసి గనులశాఖ జిల్లా అధికారి బిందన్ పాటిల్ అక్కడకు చేరుకుని ఏయ్.. అపండి అని గట్టిగా ఆదేశించారు. ఎంత ధైర్యం ఉంటే ఇంత దర్జాగా అక్రమ మైనింగ్ చేస్తారు అంటూ మండిపడ్డారు. ఆగ్రహం పట్టలేక రాళ్లు తీసుకుని జేసీబీ డ్రైవర్ మీదకు విసిరారు. జేసీబీలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మహిళా అధికారులు సత్తా చూపిన ఈ వీడియోలు బాగా వ్యాప్తి చెందాయి.
మామిడి పూతతో కళకళ
మామిడి పూతతో కళకళ


