వెంకన్న రథోత్సవం
కోలారు: బంగారుపేట తాలూకా బంగారు తిరుపతిలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయ రథోత్సవం సోమవారం సంబరంగా జరిగింది. దేవాలయంలో స్వామి వారికి విశేష పూజలు జరిపారు. ఉత్సవ విగ్రహాలను తేరులో ప్రతిష్టించి ఊరేగించారు. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
జనం ముందే
రూ.31 లక్షల దోపిడీ
బనశంకరి: బన్నేరుఘట్టలో పట్టపగలే బైకిస్టును అడ్డుకున్న దోపిడీదారులు రూ.31.88 లక్షల్ని దోచేశారు. సోమవారం సకలవార రోడ్డులో బైకులో వెళుతున్న వ్యక్తిని అడ్డగించిన దుండగులు కత్తులతో అతనిని బెదిరించారు. బ్యాగులో తీసుకెళ్తున్న రూ.31.38 లక్షల నగదుతో పాటు అతని బైక్ని లాక్కుని ఉడాయించారు. ఆ సమయంలో అక్కడ జనం ఉన్నా అడ్డుకోలేకపోయారు. భయాందోళనకు గురైన బాధితుడు బన్నేరుఘట్ట ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ బాగుంది: విజయేంద్ర
శివమొగ్గ: కేంద్ర బడ్జెట్ స్వావలంబ భారతదేశం దిశగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అన్నారు. సోమవారం శివమొగ్గలో మాట్లాడుతూ, ప్రజాదరణ కోసం కాకుండా, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ను రూపొందించామని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అస్థిరత ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతి భారతం లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టారని ఆయన అన్నారు. చైన్నె–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు పెద్దపీట వేశారన్నారు. సీఎం సిద్దరామయ్య రాష్ట్ర వైఫల్యాలను కప్పిపుచ్చడానికి కేంద్రం వైపు వేలు చూపడం దినచర్య అని ఆరోపించారు. పార్టీ నేతలు జగదీష్ ఎన్.కె., రఘు కౌటిల్య, ఎస్.రుద్రేగౌడ్రు, అశోక్ నాయక్, మాలతేష్, సుధాకర్ పాల్గొన్నారు.


