పండుటాకుల పడిగాపులు
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రం రాయచూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పెన్షన్ కోసం వృద్ధులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. సోమవారం వితంతు, వృద్ధాప్య, సంధ్యా సురక్ష, మాతృవందన వంటి పెన్షన్ల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పెన్షనర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద బైటాయించారు. గత రెండు రోజుల నుంచి కార్యాలయాల చుట్టూ తాము తిరిగినా ఎవరూ తమను పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని వారు వాపోయారు.
మధ్యాహ్న భోజనంలో పురుగులు
హుబ్లీ: హుబ్లీ తాలూకా తారిహాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం సాంబారులో పురుగులు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వేడి అన్నంలో సాంబారు పోశారు. ఆ సాంబారులో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చారు. కాగా భోజనం సరఫరా చేసే సంస్థ కాంట్రాక్టర్పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏప్రిల్ 20న
సామూహిక వివాహాలు
హుబ్లీ: ధార్వాడ జిల్లా నాగరికర హితరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే దంపతుల వివాహ వార్షికోత్సవ శుభవేళ ఏప్రిల్ 20న మధ్యాహ్నం 12.15 గంటలకు స్థానిక నెహ్రు మైదానంలో 101 జంటలకు సామూహిక వివాహాలు ఏర్పాటు చేసినట్లు ఆ కమిటీ అధ్యక్షుడు సుభాష్ తెగ్గి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వరుడికి దుస్తులు, వధువుకు మాంగల్య సరం, కాళ్లకు మెట్టెలు, దుస్తులు ఇస్తామన్నారు. హిందూ మతానికి చెందిన అన్ని కులాల వారు ఈ సామూహిక వివాహాల లబ్ధిని పొందవచ్చన్నారు. ప్రతి జంటకు రూ.10 లక్షల విలువ చేసే ఎల్ఐసీ పాలసీ చేయిస్తామన్నారు. ఈ వేడుకల్లో బాల్య వివాహాలకు గాని, రెండవ వివాహానికి కాని అవకాశం లేదని తెలిపారు. పేర్ల నమోదుకు మార్చి 21 ఆఖరు తేదీ. పూర్తి వివరాలకు తమను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. పరశురామ తెగ్గి, పరశురామ పూజారి, ఈశ్వరి తెగ్గి, మహంతేష్ కట్టిమని, మోహన్ తెగ్గి పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని మస్కిలో వెలసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల జాతర, రథోత్సవం వైభవంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని వర రుద్రమని, సోమనాథ, చెన్న బసవ, అమరగుండ శివాచార్య మహాస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు. శాసన సభ్యుడు బసన గౌడ, ప్రతాప్ గౌడ పాటిల్, మంజునాథ్, అమరేష్, సురేష్, వీరనగౌడలున్నారు. లింగసూగూరు, సింధనూరు, మాన్వి, బళ్లారిల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్థికసాయం
బళ్లారిఅర్బన్: తలస్సేమియా బాధిత చిన్నారి కుటుంబానికి ఎంజీ కనక ఆర్థిక సహాయం అందించారు. స్థానిక తాళూరు రోడ్డు గుడార నగరకు చెందిన పుష్ప అనే 5 ఏళ్ల చిన్నారి గత కొంత కాలంగా తలస్సేమియా వ్యాధితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ధృవ ఆసరె ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంజీ.కనక బాధిత చిన్నారి తండ్రి కుమార బాదగి, తల్లి అంబికలకు రూ.10 వేల సహాయం అందించారు.
ఇది దూరదృష్టి బడ్జెట్
హుబ్లీ: మౌలిక సదుపాయాల వృద్ధి, యువత ఎదుగుదలతో కూడిన దూరదృష్టి బడ్జెట్ అని ప్రవాసాంధ్ర ప్రముఖుడు, పారిశ్రామికవేత్త డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. కేంద్ర తాజా ఆర్థిక బడ్జెట్పై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2025–26 బడ్జెట్తో పోలిస్తే తాజా బడ్జెట్ పెట్టుబడుల్లో 10 శాతం పెరిగింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా కనీస సౌకర్యాల వృద్ధికి దోహదపడనుంది. ఫలితంగా యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రధాని మోదీ దూరదృష్టితో తక్కువ సమయంలో మూడవ స్థానం చేరడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. క్యాన్సర్ రోగులకు, ఇతర తీవ్ర సంబంధిత 17 ఔషధాలపై సుంకాలలో రాయితీ ప్రకటించడం ప్రశంసనీయం అన్నారు. 7 హైస్పీడ్ రైళ్ల కారిడార్లతో పర్యావరణం, ఆర్థిక, ప్రాంతీయ ఎదుగుదలకు ఉత్తేజం లభిస్తుందన్నారు. ప్రకటించని ముంబై–బెంగళూరు కారిడార్ వచ్చే బడ్జెట్లోనైనా సాకారం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పండుటాకుల పడిగాపులు


