రైతు కుటుంబంపై చిరుత దాడి
మైసూరు: బైక్ పై పొలానికి వెళ్తున్న రైతు దంపతులు, చిన్నారిపై చిరుతపులి దాడి చేయడంతో గాయపడ్డారు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని చుంచనహళ్ళి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. రైతు నంజువాడస్వామి, భార్య, చిన్నారి కొడుకుతో కలిసి కోననూర్ రోడ్డులో బైక్ పై వెళ్తుండగా ఓ చిరుతపులి ఆకస్మికంగా వారి మీదకు లంఘించడంతో అందరూ కిందపడిపోయారు. వారిని పంజాలతో రక్కి కరిచింది, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో పరారైంది. వారికి తల, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు చూసి తగదూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి , అక్కడి నుంచి మైసూరులోని పెద్దాసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచూ చిరుతలు సంచరిస్తూ ఉన్నాయని, పట్టుకోవాలని కోరినా అటవీ సిబ్బంది పట్టించుకోవడం లేదని పరిసర గ్రామాల ప్రజలు తెలిపారు.
చిరుత బందీ
చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బరగి గ్రామంలో చాలా రోజులుగా గ్రామస్తులను సతాయిస్తున్న చిరుతను అటవీ సిబ్బంది బంధించారు. ఊరిబయట మేతకు వెళ్లే పశువులపై దాడులు చేస్తూ చంపి భక్షిస్తోంది. ఓంకార్ అటవీ రేంజ్ సిబ్బంది గాలింపు జరిపి చిరుతను గుర్తించారు. షూటర్ వసీం మీర్జా ద్వారా మత్తు మందును కొట్టి చిరుతను పట్టుకున్నారు. చిరుత వీపు మీద చిన్న గాయం ఉండడంతో చికిత్స కోసం బన్నేరుఘట్ట జూపార్క్ కి తరలించారు.
దంపతులు, పిల్లాడికి గాయాలు
మైసూరు జిల్లాలో ఘటన
రైతు కుటుంబంపై చిరుత దాడి


