రాయచూరు రూరల్/ దొడ్డబళ్లాపురం: ప్రేమోన్మాది వేధింపుల వల్ల పసిమొగ్గ జీవితం ఛిద్రమైంది. పాఠశాల భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బీదర్ జిల్లాలో జరిగింది. వివరాలు.. చెటగుప్ప తాలూకా భేమల్ ఖేడ్లో మదియా (16) 10వ తరగతి విద్యార్థిని. త్వరలో పరీక్షలు కావడంతో శ్రద్ధగా చదువుకుంటోంది. కానీ ఓ సహ విద్యార్థి ప్రేమ పేరుతో ఆమెను సతాయిస్తున్నాడు. ఇంట్లో చెబితే గొడవ జరిగి చదువు మాన్పిస్తారని కుమిలిపోయింది. రోజు రోజుకూ వేధింపులు అధికం కావడంతో గురువారం తమ ప్రభుత్వ పాఠశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో ప్రాణాలు పోయాయి. ఆత్మహత్య దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. బాలిక మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


