సాక్షి,బళ్లారి: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మహిళాభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్క మహిళ వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని మోకా రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. బేటీ బచావో, బేటీ పడావో, ప్రధానమంత్రి మాతృ వందన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి, ప్రధానమంత్రి ముద్రా, మహిళా శక్తి కేంద్ర పథకం, ఉద్యోగం చేసే మహిళలకు సురక్షిత హాస్టల్ వసతి, స్వయం సహాయ సంఘాల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వంటివి ఎన్నో సంక్షేమ పథకాలను మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని తెలిపారు. వివిధ రంగాల్లో రాణించిన రజినీ లక్కా, కవిత, నళిని తదితరులను ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని కూడా మహిళలు ఘనంగా సన్మానించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా, మాజీ మేయర్, నగర బీజేపీ అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ, హంపీ రమణ, డాక్టర్ అరుణ, భారతీ, పుష్పలత, కార్పొరేటర్లు ఈరమ్మ, చేతన, కల్పనా వెంకటరామిరెడ్డి, డాక్టర్ రేణుకా మంజునాథ్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి


