పెళ్లిలో రగడ | - | Sakshi
Sakshi News home page

పెళ్లిలో రగడ

Mar 16 2026 7:24 AM | Updated on Mar 16 2026 7:24 AM

గాయపడిన పెళ్లి కుమార్తె తండ్రి మృతి

సాక్షి, బళ్లారి: సాధాణంగా సోదరుల కుమార్తె పెళ్లి జరిగితే అన్నదమ్ములు కలిసికట్టుగా జరిపించడం చూస్తుంటాం. అయితే గదగ్‌ జిల్లాలో కుమార్తె పెళ్లి విషయంలో అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ ఘటన పెళ్లి కుమార్తె తండ్రి మరణానికి దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల గదగ్‌ జిల్లాకు చెందిన గిరీషప్ప (47) తన కుమార్తె పవిత్ర పెళ్లి ఘనంగా జరిపించాడు. పవిత్ర పెళ్లిని గిరీషప్ప సోదరులు ఈరన్న, శివకుమార్‌ వ్యతిరేకించారు. బంధువులతో పెళ్లితో జరిపించడం సరికాదని వాదించారు. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిని కుమార్తె పవిత్ర చేసుకుంది. అయితే తమ మాటను పట్టించుకోలేదనో లేదా మంచి సంబంధం చూడలేదనో గిరీషప్పతో ఫిబ్రవరి 27వ తేదీన సోదరులు ఈరన్న, శివకుమార్‌ గొడవపడ్డారు. మాటల యుద్దం చినికి చినికి గాలివానగా మారి కర్రలతో దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఈ ఘర్షణలో గిరీషప్పకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గదగ్‌ ఆస్పత్రికి చేర్పించారు. 15 రోజులుగా చావుబతుకులు మధ్య పోరాడిన గిరీషప్ప ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై నలుగురిపై కేసు నమోదైంది.

భక్తిశ్రద్ధలతో

అడ్డ పల్లకీ ఉత్సవాలు

రాయచూరు రూరల్‌: భారతదేశంలో హిందూ ధర్మ సందేశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని రంబాపురి వీర సింహసనాదీశ్వర ప్రసన్న రేణుక వీర సోమేశ్వర రాజీదేశీ కేంద్ర శివాచార్య మహభ గవత్పాకుడు పేర్కొన్నారు. ఆదివారం దేవదుర్గ తాలుకా జాగటకల్‌ బసవేశ్వర స్వామి దేవాలయంలో రంబాపురి జగద్గురువుల అడ్డ పల్లకీ ఉత్సవాలు, సాముహిక వివాహాలు నిర్వహించారు. కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్య, సిద్ధ రామేశ్వర, రాచయ్యప్ప తాతా, బెట్టదయ్యప్ప, విరుపాక్షప్ప, సాంబయ్యప్ప, శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌, మాజీ శాసన సభ్యుడు శివన గౌడ నాయక్‌, బుడ్డన గౌడ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సహకారం అవసరం

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సహకారం ఉండాలని అదనపు ఎస్పీ కుమార స్వామి సూచించారు. శనివారం రాత్రి నగరంలోని జిల్లా జైళ్ల సుదారణ సేవా శాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేరాలు చేసి వచ్చిన ఖైదీలను చిన్నచూపు చూడకూడదన్నారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా వారికి సూచనలు ఇవ్వాలన్నారు. జైలు విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకోకుండా అందరూ సంతోషంగ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్రిష్ణ, మానసిక వైద్య నిపుణుడు మనోహర్‌ పత్తార్‌, జైళ్ల అధికారిణి అనితా హిరేమని ఉప జైలర్లు రాజ కుమార, వెంకటేష్‌ నాయక్‌, మారుతి, వీరన గౌడ, విరుపాక్షి పాల్గొన్నారు.

సమాజ సేవకు సహకరించాలి

రాయచూరు రూరల్‌: సమాజ సేవకు అందరూ సహకరించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్‌, సమాచార హక్కు చట్టం కమిషనర్‌ వెంకటసింగ్‌ సూచించారు. ఆదివారం పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగ మందిరంలో శరణప్పగోనాళు ప్రతిష్టాన ఆధ్వర్యంలో మహంత శ్రీ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో పేదవారిని మానవతా దృష్టితో చూడాలన్నారు. వీలైతే చేతనైన సహాయం చేయాలని కోరారు. సహాయం చేయడం మానవ ధర్మమనే విషయాన్ని ప్రస్తావించారు. సమాజంలో తనదైన రీతిలో సేవలందించిన శరణప్ప సేవలు అనన్యమని కొనియాడారు. కార్యక్రమంలో సిద్రామణ్ణ, బాలాజీ, అమరేస్‌, నరసింహులు, తిమ్మరాజ, సదాశివప్ప, నరసింహులు, నరస రెడ్డి, బసవంత రాయకురి, బసవరాజ్‌, శరణప్ప, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement