హొసపేటె: జిల్లాలో హొసపేటె, హరపనహళ్లి ఉపవిభాగాల్లో రౌడీషీటర్ల పరేడ్ను బుధవారం జిల్లా డీఏఆర్ పోలీసు మైదానంలో నిర్వహించారు. రౌడీల గత కార్యకలాపాల నేపథ్యం ఆధారంగా సుదీర్ఘ విచారణ జరిపారు. కొన్ని సందర్భాల్లో వారు తమ నేర కార్యకలాపాలను విరమించుకున్నా వారిపై ఉన్న పాత కేసుల దృష్ట్యా వారిపై నిఘా ఉంచామని ఎస్పీ జాహ్నవి తెలిపారు. ప్రస్తుతం తీవ్రమైన నేరాల్లో పాల్గొంటున్న వారిని తాము విచారించి, తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము వారి ప్రస్తుత కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. తాము వారిపై నిశిత నిఘా ఉంచడంతో పాటు వారి ఆర్థిక లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తామన్నారు. పోలీసు శాఖ రౌడీల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. తమ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకుండా నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్న 15 మందికి పైగా రౌడీలను జిల్లా నుంచి బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా పరేడ్లో అదనపు ఎస్పీ మంజునాథ్, సుమారు 220 మంది రౌడీలు పాల్గొన్నారు.


