దొడ్డబళ్లాపురం: పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదనే కోపంతో ఓ దుండగుడు యువతి కళ్లల్లో కారం చల్లి దాడి చేసిన సంఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా జోడకురుళి గ్రామంలో జరిగింది. భీరప్ప రామప్ప అనే వ్యక్తి విద్యాశ్రీ అనే యువతితో పాటు ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు. విద్యాశ్రీతో వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులను చాలాకాలంగా కోరుతున్నాడు. అయితే మంచివాడు కాదనే కారణంతో విద్యాశ్రీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కక్ష పెంచుకున్న దుండగుడు మంగళవారం రాత్రి విద్యాశ్రీ ఇంట్లోకి జొరబడి వాళ్ల కళ్లల్లో కారం చల్లి కట్టెలతో చితకబాది పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురినీ గ్రామస్తులు చిక్కోడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాగల్ ప్రేమి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బెళగావి మేయర్గా కన్నడిగ
దొడ్డబళ్లాపురం: మరాఠాల ఆధిపత్యం ఉండే బెళగావి నగర పాలికె మొట్టమొదటిసారి కన్నడిగులు మేయర్, ఉప మేయర్లుగా ఎన్నికయ్యారు. బుధవారంనాడు జరిగిన ఈ ఎన్నికలో మేయర్గా ప్రీతి కామకర, ఉప మేయర్గా హనుమంత కొంగాలి ఎన్నికయ్యారు. 65 మంది కార్పొరేటర్లు ఉండగా ఎన్నిక సమయంలో 59 మంది హాజరయ్యారు. ప్రీతికి 39 మంది మద్దతు తెలుపగా 18 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రీతి కామకర 21వ వార్డు బీజేపీ కార్పొరేటర్ కాగా, హనుమంత 46వ వార్డు బీజేపీ కార్పొరేటర్. హనుమంతకి మద్దతుగా 39 మంది ఓటేశారు. కన్నడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.


