కెజీఎఫ్: రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి, ఇంకా గాయాలతో బాధపడుతున్న టెన్త్ విద్యార్థినిని అంబులెన్స్లోనే పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. అతి కష్టమ్మీద పరీక్షను రాసి ధైర్యాన్ని చాటుకుంది. వివరాలు.. కేజీఎఫ్ పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో చదువుతున్న చిన్నాగనహళ్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కుసుమ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ కాలును కోల్పోయింది. త్వరలో మరో సర్జరీ కూడా చేయాల్సి ఉంది. ఇంతలో పరీక్షలు వచ్చాయి. ఆమె కూర్చోరాదని, స్ట్రెచర్పైన పడుకునే పరీక్ష రాయవచ్చని వైద్యులు సూచించారు. బుధవారం తొలి పరీక్షకు సెయింట్ జోసెఫ్లోని పరీక్షా కేంద్రానికి అంబులెన్స్లో వచ్చింది. బీఈఓ నారాయణస్వామి కుసుమ పరీక్ష రాయడానికి ప్రత్యేక ఏర్పాటు చేయించారు. పరీక్షలకు బాగా సిద్ధమైనట్లు ఆమె తెలిపింది. కుసుమ కష్టాన్ని చూసి చాలామంది కంటతడి పెట్టారు.


