రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలలు తగదని కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ సంచాలకుడు విరుపాక్షి పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా జరిగితే మాదిగ విద్యార్థులకు మరణ శాసనంగా మారుతుందన్నారు. రవీంద్ర, భీమన్న, ఆంజనేయ, నరసప్ప, మౌనేష్లున్నారు.
చిచ్చు రేపిన కులాంతర వివాహం
● రెండు వర్గాల మధ్య ఘర్షణ
● బాలగేరిలో ఉద్రిక్త వాతావరణం
హొసపేటె: కొప్పళ జిల్లా కుకనూరు తాలూకాలోని బాలగేరి గ్రామంలో కులాంతర వివాహం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒక గ్రామస్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గ్రామానికి చెందిన యువతీ యువకుడు పరస్పరం ప్రేమించుకుని ఇటీవల వివాహం చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే గదగ్ జిల్లా రోణ తాలూకాలోని శాంతగేరి ఇటగి గ్రామానికి చెందిన యువతి బంధువులు బాలగేర గ్రామానికి వచ్చి గొడవ సృష్టించారు. దీంతో గ్రామస్తుడు బసప్ప తళవార్ (69) తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స కోసం కుకనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతను సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే కుకనూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయక పోవడంతో సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


