సాక్షి, బళ్లారి: గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మండపడ్డారు. శుక్రవారం జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ కొరత, ధరల పెంపుపై ఆందోళన చేపట్టారు. నగరంలో రాయల్ సర్కిల్ వద్ద కట్టెల పొయ్యిపై వంట చేశారు. గ్యాస్ ధరల పెంపుతో మహిళలు కట్టెల పొయ్యితో వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వగురు అంటే మోదీ కాదని.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అని తెలిపారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.450లకే సిలిండర్ వచ్చేదని.. ప్రస్తుతం సిలిండర్ రూ.1200లకు చేరిందన్నారు. ఇంకా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుకుంటూనే పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ దొరకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు, హోటళ్ల నిర్వహకులు, ఆటోలు నడిపే నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్యాస్ కొరతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధరలు తగ్గించాలి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని ఏఐసీసీటీయూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకుడు నాగరాజ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. గృహ వినియోగ సిలిండర్ రూ.60, వాణిజ్య సిలిండర్ను రూ.115 చొప్పున పెంచడం సరికాదన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం సమస్యలపై తహసీల్దార్ సురేష్ వర్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జగదీష్, భీమణ్ణ, యల్లప్ప, గురుస్వామి, ఈరణ్ణ, వీరేష్, మారణ్ణ, అజీజ్, నిషార్ తదితరులు పాల్గొన్నారు.


