బళ్లారిఅర్బన్: కౌల్బజార్ ఫిర్కాలో బీజేపీ బలోపేతానికి మండల కమిటీతో పాటు 7 మోర్చాలకు కొత్త కార్యవర్గాలను నియమించారు. మండల అధ్యక్షుడు ఏ.నాగరాజరెడ్డి సంతకంతో సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. మహిళా మోర్ఛా అధ్యక్షురాలిగా లత, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా సుంకన్న, ఎస్టీ మోర్ఛా అధ్యక్షుడిగా రాజశేఖర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఆర్.శేఖన్న, రైతు మోర్చా అధ్యక్షుడిగా వెంకటేష్, యువమోర్ఛా అధ్యక్షుడిగా బట్టి గాదిలింగ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా మహమ్మద్ గౌస్ నియమితులయ్యారు. ఇదే సమయంలో మండల కమిటీకి కూడా కార్యవర్గాన్ని నియమించారు. మండల అధ్యక్షుడిగా ఏ.నాగరాజరెడ్డి కొనసాగుతుండగా, కొండి మల్లికార్జున, వెంకటేష్ గురురాజ్, రామచంద్ర, హనుమంతరావు, మహమ్మద్ ఖదీర్లను ఉపాధ్యక్షులుగా నియమించారు. ఎంపీ రాజేష్, జీ.అవినాష్ నాయుడు ప్రధాన కార్యదర్శులుగా, ఈ.మూర్తి, వి.శ్రీధర్, యేసు, నీలకంఠ ఆచార్య, మల్లేష్, అన్నక్లర్ కార్యదర్శులుగా నియమితులయ్యారు. అలాగే జీ.అభిలాష్ నాయుడు కోశాధికారిగా, వీజే జోసెఫ్ కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
ఉద్యోగాలను భర్తీ చేయండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కన్నడ సేనె డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు బసవరాజ్ మాట్లాడారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరక్ష్యం వహించకుండా వెంటనే భర్తీలకు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. జిల్లాలో 1,454 ప్రాథమిక, 239 హైస్కూళ్లున్నాయని, వాటిని త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడ నామఫలకాలు, నేమ్ బోర్డులు అలవరించేలా చూడాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గోవిందప్ప, నాగప్ప, అమరేష్, మంజునాథ్, శివరాజ్, వీరనగౌడ, రామప్ప, పరశురామ్లున్నారు.
నాయకత్వ లక్షణాలు పెంచాలి
చెళ్లకెరె రూరల్: వ్యాయామ ఉపాధ్యాయులు కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని తాలూకా విద్యా శాఖ అధికారి కేఎస్.సురేష్ తెలిపారు. ఆయన మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులదేనన్నారు.


