కర్ణాటక: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిందో భార్య. ఆమెతో పాటు నలుగురు నిందితులను శ్రీరంగపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తాలూకాలోని మారళగాల గ్రామ అర్చకుడు సిద్ధలింగప్ప తన అక్క కుమార్తె షాలినిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలినికి అదే ఊరికి చెందిన టిప్పర్ డ్రైవర్ హరీశ్తో వివాహేతర సంబంధం ఉంది. ఒకరోజు షాలిని, హరీశ్ ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తకు దొరికిపోయారు. ఇలాంటి పనులు చేయరాదని భార్యను మందలించడంతో ఆమె కక్ష పెంచుకుంది. తన భర్తను చంపేయమని హరీశ్కు సిఫార్సు చేసింది.
మార్చి 6న రాత్రి అర్చకుడు సిద్ధలింగప్ప.. కె.శెట్టిహళ్లి గణపతి దేవస్థానంలో పూజ ముగించుకుని ఇంటికి పయనమయ్యాడు. హరీశ్, మరో టిప్పర్ డ్రైవర్ సంతోష్ కుమార్తో కలసి గ్రామం వద్ద ఉన్న కాలువ ఏరియా నిర్మానుష్య ప్రాంతంలో అర్చకుడిని అడ్డగించారు. కట్టెలతో బాది చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అక్కడక్కడ అతని వస్తువులు వేసి, బైక్ను కాలువలోకి పడేశారు. 7న సీడీఎస్ కాలువలో సిద్ధలింగప్ప మృతదేహం లభించింది. ముఖానికి, తలకు గాయాలున్నాయి. ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపి ఉంటారని భావించి అతడి అన్న బాలసుందర్ శ్రీరంగపట్టణ గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి మార్చి 9న హరీశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. సిద్ధలింగప్ప భార్య షాలిని, సంతోష్ కుమార్, గణేశ్తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్లు అంగీకరించాడు. షాలిని , హరీశ్, సంతోష్ కుమార్, గణేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.


