● సోషల్ మీడియాలో గగ్గోలు
శివాజీనగర: గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల బెంగళూరులో అనేక చిన్నా, మధ్యస్థాయి హోటళ్లు మూతపడుతుండగా, కొన్ని హోటళ్లలో మాత్రం అదనంగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. టిఫిన్లు, భోజనాల మీద అదనంగా వసూలు చేయడమే దీనికి నిదర్శనం. రూ.30 నుంచి 50 దాకా గ్యాస్ బిల్లును విధిస్తున్నట్లు నగరవాసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ దీని మీద రభస సాగుతోంది. పీజీ హాస్టల్లో వంట వండకపోవడంతో హోటల్కు వెళ్లగా, అక్కడ విచిత్రమైన ఫీజు విధించారని కొందరు తెలిపారు. ఎల్పీజీ కొరత చాటున జరుగుతున్న దోపిడీ అని ఆరోపించారు. కొన్ని హోటళ్లు, వీధి బండ్ల ఆహారశాలల్లోనూ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. గత్యంతరం లేని యువకులు, ఉద్యోగులు ఎక్కువ ధరలను చెల్లించి ఆకలి తీర్చుకుంటున్నారు. దీనిపై పోలీసులు, ఆహార భద్రతా శాఖలు స్పందించాలని, దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్లు ఉన్నాయి. ఈ వివాదంపై బెంగళూరు హోటల్ యజమానుల సంఘం నాయకులు స్పందిస్తూ, ఇలాంటి పద్ధతులను విడనాడాలన్నారు. ఆ హోటల్ యజమానితో మాట్లాడుతామని తెలిపారు.


