హొసపేటె: ‘ఇటీవల జిల్లాలో గృహోపయోగ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తప్పుడు పుకార్లు వ్యాపించాయి. జిల్లాలో గ్యాస్ కొరత ఉండదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని జిల్లా మెజిస్ట్రేట్ కవితా ఎస్ మన్నికేరి స్పష్టం చేశారు. వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పాశ్చాత్య దేశాల్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ పంపిణీ సంస్థల ద్వారా యథావిధిగా సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లాలో ఎవరైన అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాకు సంబంధిత గ్యాస్ పంపిణి సంస్థలను వెంటనే సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లోను మధ్యవర్తులను ఆశ్రయించకూడదన్నారు. కార్యక్రమంలో ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్, వివిధ శాఖల అధికారులు, గ్యాస్ కంపెనీల నిర్వాహకులు పాల్గొన్నారు.


