సాక్షి, బళ్లారి: గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో దోమల బెడద అధికమైంది. ప్రజలు అనార్యోగానికి గురవుతున్నారని ఏఐకేకేఎంఎస్ రైతు సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని కురుగోడు తాలూకా ముష్టిగట్టి గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గురళ్లి నాగరాజు మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్తా, చెదారం పేరుకుపోతోందని తెలిపారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. పంచాయతీల స్వచ్ఛతకు నడుం బిగించాల్సిన అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో స్వచ్ఛత గురించి ఆలోచించే వారు లేరని తెలిపారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.


