శివాజీనగర: శాసనసభ సమావేశాల తరువాత సీఎం సిద్దరామయ్య ఢిల్లీకి వెళ్లి, మంత్రిమండలి పునర్విభజన కోసం హైకమాండ్ నాయకులతో చర్చించే అవకాశముంది. సాధారణంగా బడ్జెట్ను సమర్పించాక ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రిని, పార్టీ అగ్రనేతలను కలిసి సమాచారమివ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఆ దిశగా ఈ అసెంబ్లీ సమావేశాల తరువాత సిద్దరామయ్య ఢిల్లీకి వెళ్తారని తెలిసింది.
12 మందిని తప్పిస్తారా?
సుమారు 12 మందికి పైగా మంత్రులను తప్పించి, కొత్త వారికి చాన్సు ఇవ్వాలనుకుంటున్నారు, ఇందుకు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ఒప్పుకోలేదని తెలిసింది. సీఎం మార్పిడిని తేల్చేవరకు మంత్రివర్గ పునర్విభజన చేయరాదని డీకే పట్టుబట్టారు. దీంతో సీఎం సన్నిహిత వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యేక భేటీ జరిపి మంత్రిమండలి మార్పులకు గొంతెత్తారు. 3 సార్ల కంటే ఎక్కువగా గెలుపొందిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటివ్వాలని కోరుతున్నారు.
మంగళవారం డీకే టూర్
కానీ ఈసారి సారి మంత్రిమండలి మార్పులు జరిగితే ఇకముందు సీఎం మార్పిడి మరుగున పడుతుందని డీకే భావిస్తున్నారు. అలా జరగకుండా డీకే ప్రయత్నాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. హైకమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంది. ఇటు డీ.కే.శివకుమార్ తరపున జూనియర్ ఎమ్మెల్యేలు బ్యాటింగ్ చేస్తుండగా, సీఎం సిద్దుకు అండగా సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చారు. సిద్దరామయ్య ఢిల్లీ యాత్ర ఏ ఫలితమిస్తాయనేది ఉత్కంఠ కలిగిస్తోంది.
త్వరలో హస్తినకు సీఎం సిద్దు


