బళ్లారి అర్బన్: చీటి వ్యాపారంలో మోసం చేసి పరారీలో ఉన్న నిందితుడిని బళ్లారి పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఎస్.నవీన్ కుమార్, బళ్లారి నగర ఉపవిభాగ డీఎస్పీ గోవిందరాజు నేతృత్వంలో బ్రూస్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని పట్టున్నారు. చీటి మోసం కేసు (బీఎన్ఎస్–2023 సెక్షన్లు 316 (2), 318 (4), బీయూడీఎస్ చట్టం–2019 సెక్షన్ 21 (3)లో పరారీలో ఉన్న వెంకటేష్ అనే వ్యక్తిని మార్చి 13 ఉదయం 7:30 గంటలకు చిత్రదుర్గలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోజు ఉదయం 11:30 గంటలకు బ్రూస్పేట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారణ జరిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు బళ్లారి నగరంలోని ముత్తూట్ ఫైనాన్స్లో సుమారు 310 గ్రాముల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది. అలాగే అతడి ఇంట్లో ఉన్న సుమారు 1.5 కిలోల వెండి వస్తువులు, చీటి వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా చీటి వ్యవహారాల్లో ఉపయోగించిన కేఏ–34/పీ–3307 నంబర్ గల జీ–ఎల్70 కారు, అలాగే కేఏ34/ఈఎస్–2152, కేఏ34/ఈఎస్–0427 నంబర్ల టీవీఎస్ ద్విచక్ర వాహనాలు పోలీసులు జప్తు చేశారు. నిందితుడిని మార్చి 14న సంబంధిత న్యాయస్థానంలో హాజరు పరచగా.. కోర్టు కస్టడీకి ఆదేశించింది.


