హొసపేటె: చింత పండు సాగులో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుతం చింతపండు రైతులకు బంపర్ లాభాలను తెచ్చిపెడుతోంది. భారతీయ వంటల్లో చింతపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఉప్పు తర్వాత ప్రత్యేక స్థానం ఉన్న పదార్థం చింతపండు అని చెప్పవచ్చు. ఇప్పుడు గత రెండేళ్లుగా చింతపండు ధర బాగా పెరిగింది. గత సంవత్సరం కిలో చింతపండు ధర రూ.100–రూ.120 మధ్య ఉండేది. అదే ధర ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్లో కిలోకు రూ.200 నుంచి రూ.220కి పెరిగింది. దేశంలో చింతపండు చెట్ల సంఖ్య తగ్గడం, ఉత్పత్తి క్షీణించడం, కూలీల కొరత, అధిక డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల చింతపండు ధర ఆకాశాన్నంటింది. చింతపండు పంటను ప్రధానంగా కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో పండిస్తారు. చింతపండు ధర పెరుగుదల, సాగులో రెండు ప్రధాన సవాళ్లు పెంపకందారులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
ప్రధానంగా పండించే జిల్లాలు ఇవే..
చింతపండును ప్రధానంగా కోలారు, తుమకూరు, బళ్లారి, విజయపుర, బెళగావి, రాయచూరు, విజయనగర, ధార్వాడ జిల్లాల్లో పండిస్తారు. చింతపండు సాగు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. చింతపండు చెట్లు ఎక్కి కోసే వారి సంఖ్య తగ్గింది. అలాగే చింతపండు ప్రాసెసింగ్ కోసం కొత్త సాంకేతికత, యంత్రాలను అభివృద్ధి చేయలేదు. చింతపండు సేకరణ పరంగా చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ కారణాలన్నింటి వల్ల చింతపండు పెంపకం ఇబ్బందుల్లో ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ చింతపండుకు డిమాండ్ ఏటేటా పెరుగుతోంది. చింతపండు ధర కూడా పెరిగింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం చింతపండుకు అసాధారణ డిమాండ్ ఉంది. తక్కువ సరఫరా కూడా ధర పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. కర్ణాటకలో చింతపండు ప్రధాన పంటకోత కాలం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఎండాకాలం పండ్లను కోయడానికి, ప్రాసెస్ చేయడానికి, ఎండబెట్టడానికి ఉత్తమ సమయం. సరఫరా పెరిగితే ఏప్రిల్ వరకు పంట కొనసాగే అవకాశం ఉన్నందున ధరలు తగ్గవచ్చని అంచనా.
కోల్డ్ స్టోరేజీలు అవసరం
చింతపండు సేకరణలో ప్రధాన సమస్య కోల్డ్ స్టోరేజీలు, వర్షం పడినప్పుడు ఈ పంట రంగుపోతుంది. చింతపండు పండించే రైతులకు సురక్షితమైన నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు అవసరమని రైతులు డిమాండ్ చేశారు. తుమకూరు హోల్సేల్ మార్కెట్లో మంచి నాణ్యత గల చింతపండు క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల ధర వరకు అమ్ముడవుతోంది. కానీ నాణ్యత లేని ఉత్పత్తులతో ధర తగ్గుముఖం పట్టింది.
మార్కెట్లో చింతపండు ధరకు రెక్కలు
ధరల పెరుగుదలతో రైతులకు లాభాలు
చింతపండు సాగుకు ప్రాధాన్యత మెండు
కరువు కాలంలో కూడా పేదలకు ఉగాది పండుగను అందించే పంట చింతపండు అని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నానుడి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చింతపండు సాగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చింతపండు సాగు వేలాది మంది రైతుల జీవితాలను తీర్చిదిద్దింది. మారుతున్న కాలంలో, చింతపండు పండించే రైతులకు సహాయ సహకారాలు, మార్గదర్శనం అవసరం. వర్షధార పంటల్లో చింతపండు ఒక ముఖ్యమైన వాణిజ్య పంటగా కూడా ఉద్భవించింది. వ్యవసాయ కూలీలు, యంత్రాల కొరత చింతపండు పంట సాగులో ప్రధాన సమస్యగా ఉంది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


