హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా హిరేహొన్నళ్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను శుక్రవారం వేళ కంటే ముందే ఇంటికి పంపించి సదరు పాఠశాలకు తాళం వేసిన ఘటన వెలుగు చూసింది. విద్యాశాఖ అదనపు కమిషనర్ ఈశ్వర్ ఉళ్లాగడ్డి సదరు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇతర ఉపాధ్యాయ బృందానికి కారణాలు కోరుతూ నోటీసులు జారీ చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల మెరుగుదల, వార్షిక పరీక్షల సన్నద్ధత పరిశీలనకు కమిషనర్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల సందర్శనకు వెళ్లగా తాళం వేసిన దృశ్యం కనిపించింది. వాస్తవంగా పాఠశాల సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. అలానే ఈనెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని కూడా సూచించారు. అయితే విద్యార్థులను ఇంటికి పంపించి విధుల్లో లోపానికి పాల్పడినట్లుగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 17 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేకుంటే నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన ఆ నోటీసుల్లో హెచ్చరించారు.
విద్యాశాఖ ఉన్నతాధికారి
పరిశీలనలో వెలుగులోకి
హెచ్ఎంతో సహా ఉపాధ్యాయులకు విద్యా శాఖ నోటీసులు


