మైసూరు: మైసూరులో రెండుచోట్ల మహిళల బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. వివరాలు.. వృద్ధురాలి మెడలోని 40 గ్రాముల గొలుసు చోరీ చేసిన ఘటన ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నీలమ్మ (60) అనే మహిళ బెళ్లూరు క్రాస్ నుంచి మైసూరుకు వచ్చే బస్సులో ప్రయాణిస్తుండగా ఇద్దరు అపరిచిత మహిళలు శిశువుతో సహా శ్రీరంగపట్టణలో బస్సు ఎక్కారు. శిశువు వాంతులు చేసుకుంటోంది, కిటికీ పక్కన స్థలం ఇవ్వాలని నీలమ్మను అడిగితే తిరస్కరించింది. కొలంబియా ఆస్పత్రి వద్దకు బస్సు చేరుకోగానే మహిళలు బస్సు దిగబోతూ తమ లగేజీని తీస్తూ నీలమ్మపైకి చిల్లరను పడేశారు. చిల్లరను తీసిచ్చేందుకు నీలమ్మ వంగినప్పుడు ఆమె మెడలోని బంగారు గొలుసును కట్ చేసుకున్నారు. ఎల్ఐసీ స్టాప్ రాగానే మహిళలు బస్సు దిగి వెళ్లిపోయారు. నీలమ్మ ఇంటికి వెళ్లిన తరువాత చూసుకుంటే గొలుసు లేదు. చిల్లర డబ్బులు వంటిపై పడినప్పుడు ఏదో మైకం కమ్మినట్లయిందని నీలమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
టీవీ చూస్తుండగా చొరబడి...
మైసూరు చామరాజ మొహల్లా నివాసి ఇంద్రాణి సోమవారం రాత్రి 9.45 గంటల సమయంలో గాలి రావడం లేదని ఇంటి తలుపును తెరిచి ఉంచి టీవీ చూస్తోంది. ఆ సమయంలో దుండగుడు చొరబడి ఇంద్రాణి ముఖం, కళ్లపై స్ప్రే చేసి ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఆమె లక్ష్మీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.


