హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఉదయం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. మటన్ మార్కెట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులు, స్థానిక మహిళలపై అకస్మాత్తుగా దాడి చేయడంతో 14 మంది గాయపడ్డారు. భవ్య శ్రీ , ద్రాక్షాయణి అనే ఇద్దరు చిన్నారుల ముఖం, గొంతు, కాళ్లు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు పలు మహిళలు కూడా గాయపడ్డారు. భయంతో వీరు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి చేరుకుని కుక్కను తరిమికొట్టారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, ఇద్దరు చిన్నారులకు ముఖంపై తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామాల్లో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలు, సంతల వద్ద పిచ్చి కుక్కలు గుంపులుగా తిరుగుతూ అకస్మాత్తుగా దాడి చేస్తున్నాయని చెబుతున్నారు. అధికారులు స్పందించి కుక్కలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
గాయపడిన బాధితులు


