హుబ్లీ: స్థానిక కేశ్వాపుర రైల్వే గాల్ఫ్ మైదానం ఆవరణలోని స్వామి వివేకానంద విగ్రహం, బన్ని మహంకాళి గుడి తొలగింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ మంగళవారం మార్నింగ్ వాకర్స్ ఆకస్మిక నిరసన చేపట్టారు. ఈనెల 14 లోగా రైల్వే శాఖ విగ్రహం పునః ప్రతిష్టాపనతో పాటు గుడిని నిర్మించి ఇవ్వాలని గడువును ఇచ్చారు. ఆలయం తొలగించిన అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గడువులోగా ఆలయ నిర్మాణం జరగక పోతే తీవ్ర పోరాటం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. సదరు గాల్ఫ్ మైదానం రైల్వే అధికారుల వసతి గృహం వద్ద బన్ని వృక్షం కింద ఉన్న మహంకాళి గుడి, అక్కడికి కొంత దూరంలో ప్రతిష్టించిన 5 అడుగుల ఎత్తు ఉన్న వివేకానంద విగ్రహాన్ని సోమవారం తొలగించారు. మంగళవారం ఉదయం షికారుకు వచ్చిన స్థానికులు దాన్ని గమనించి రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రైల్వే అధికారులు తక్షణమే ఘటన స్థలానికి రావాలి. బన్ని మహంకాళి గుడి, స్వామి వివేకానంద విగ్రహాన్ని మూలస్థలంలోనే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేకుంటే తామే కాంపౌండ్ కూల్చి గుడిని నిర్మిస్తామని గాల్ఫ్ లేక్ ఆఫీసర్స్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ హబీబా నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. ప్రభు చిదానంద, శేఖర్, శివకుమార్ తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.


