హుబ్లీ: మైనర్ బాలికను గర్భిణి చేసిన ఆరోపణలపై పాత హుబ్లీ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. సదరు బాలికకు జన్మించిన శిశువును ఆమెకు ఇవ్వకుండా అలాగే తల్లి పేరు నమోదు చేసే కాలంలో నిందితుడు తన పెద్దమ్మ పేరు రాయించి జనన ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. అనంతరం సదరు బాలికతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తల్లి పాలు అందక సదరు శిశువు మృతి చెందింది. శిశువు మృతికి కారకుడైన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విడాకులకు వచ్చి ఒక్కటయ్యారు..
హుబ్లీ: దావణగెరెలో జరిగిన లోక్ అదాలత్లో విడాకుల కోసం వచ్చిన 37 జంటలు పూలదండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ఈ కీలక ప్రక్రియ దావణగెరె ప్రధాన జిల్లా సెక్షన్ కోర్టు న్యాయమూర్తి డీకే.వేళ ఆ జంటలను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న న్యాయాంగ అధికారి ఈ జిల్లాలో జరిగిన వివిధ జాతీయ లోక్ అదాలత్ బాధ్యతలను చక్కగా నిర్వహించి ఆ మేరకు 500 వ్యాజ్య పూర్వ కేసులను పరిష్కరించడంపై హర్షం వ్యక్తం అవుతోంది.
శరవేగంగా అభివృద్ధి పనులు
కెజీఎఫ్: నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తాను ఎమ్మెల్యే అయిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు శరవేంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. ఆదివారం నగరంలోని గాంధీ నగర వార్డులో రూ.4 కోట్ల వ్యయంతో విద్యుత్ చితాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎవరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృధ్ది కార్యక్రమాలను నిర్వహించలేదన్నారు, 12 నెలల్లో శాంతి ధామాన్ని పూర్తి చేయనున్నామని తెలిపారు. అన్ని వార్డుల్లో మౌళిక సౌలభ్యాలను కల్పించాలని నగరసభ అధికారులకు సూచించానని తెలిపారు.. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంజునాథ్, ప్రసన్న, మురళి , నగరసభ మాజీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉచితంగా చీరల పంపిణీ
కోలారు: ఉగాది పండుగను పురస్కరించుకుని నగర సభ మాజీ సభ్యుడు ముక్కడ్ వెంకటేష్, ఆయన కుమారుడు నగరంలోని పలు ప్రాంతాల్లోని పేదలకు చీరలు, పండుగ సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. వీరు గత 15 సంవత్సరాల నుంచి దీపావళి, ఉగాది పండుగ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


