సాక్షి,బళ్లారి: పంచపీఠాలలో ఒకటైన, మహిమాన్విత పుణ్యక్షేత్రంగా భాసిల్లుతూ, సాక్షాత్తు శివుడు లింగరూపంలో అవతరించిన కేదారనాథుడు కొలువు దీరిన కేదార పీఠానికి శ్రీశ్రీశ్రీ నాల్వడి శాంతలింగ శివాచార్య పీఠాధికారిగా ఎంపికవడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకాలోని శాఖ మఠంలో స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శాంతలింగ శివాచార్య కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కావడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు సుపరిచుతులన్నారు. ఎంతో ఆధ్యాత్మికతతో భక్తి మార్గంలో నడుస్తూ లక్షలాది మంది భక్తులను కూడగట్టుకున్నారన్నారు.
మహిమాన్వితుడు శాంతలింగ
సన్మార్గంలో నడుస్తూ, సమాజాన్ని ఉత్తమ మార్గంలో తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, జీవితాన్ని అంకితం చేసిన మహిమాన్వితుడని కొనియాడారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాన్ని పోగొట్టుకునేందుకు హిమాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకోవాలని శ్రీకృష్ణుడు సూచించిన నేపథ్యంలో పంచ పాండవులు హిమాలయాలకు వెళ్లారన్నారు. అక్కడ శివుడి కోసం పాండవులు గాలిస్తున్న సమయంలో ఒక ఎద్దు(నంది) అక్కడ వెళుతున్న సమయంలో ఇంత నిర్జన ప్రాంతంలో ఎద్దు వెళుతుండటం ఏమిటని భావించిన పాండవులు వెంటనే నంది దగ్గరకు వెళ్లగా నంది భూమిలోకి వెళ్లగా భీముడు గోపురాన్ని పట్టుకోవడంతో అదే లింగరూపంలో అవతరించిందన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రంగా కేదారనాథ్
ఈ క్షేత్రం ఉత్తరాఖండ్లోని కేదారనాథ్ ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదైవంగా కేదారలింగేశ్వరుడు దర్శనం ఇస్తున్నారని, సాక్షాత్తు లింగరూపంలో గోపురం తరహాలో కొలువుదీరిన కేదారనాథ్కు మన ప్రాంతానికి చెందిన నాల్వడి శాంతలింగ శివాచార్య పీఠాధికారిగా ఎంపిక కావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భారత దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంప వ్యాప్తంగా కేదారనాథ దర్శనానికి వెళుతున్నారంటే ఎంత మహిమాన్విత పుణ్యక్షేత్రమో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈసందర్భంగా పలువురు బళ్లారి వాసులు కూడా స్వామీజీని దర్శించుకున్నారు.
కేదారనాథ పీఠాధికారిగా నాల్వడి
శాంతలింగ శివాచార్య స్వామీజీ ఎంపిక


