సాక్షి, బళ్లారి: బళ్లారి జిల్లా సండూరు తాలూకా కుడితినిలో రైతులు భారీ ఆందోళన చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, లక్ష్మీ మిట్టల్ కంపెనీ కోసం స్వాధీనం చేసుకున్న భూమిని జిందాల్ సంస్థకు బదిలీ చేయరాదని పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కుడితిని పారిశ్రామిక ప్రాంతంలో భూముల విషయంలో రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. సీఐటీయూ, భూ సంరక్షణ పోరాట సమితి, కర్ణాటక ప్రాంత రైతు సంఘం, వివిధ కన్నడ పర సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
మట్టి పరీక్షలతో రగడ
సదరు భూముల్లో జిందాల్ సంస్థ ప్రతినిధులు మట్టి పరీక్షలు కోసం పోలీసు బందోబస్తుతో రావడం నిరసనకు కారణమైంది. వందలాది మంది రైతులు చేరి జిందాల్ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష్మీ మిట్టల్ కోసం స్వాధీనం చేసుకున్న తమ భూములను జిందాల్ సంస్థకు ఎందుకు అప్పగిస్తున్నారని, ఇందులో ఎవరి స్వార్థం ఉందని రైతులు ప్రశ్నించారు. ఒక కంపెనీ పేరు చెప్పి మరో కంపెనీకి బదిలీ చేయడం రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. పోలీసులు, అధికారులతో వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జిందాల్ సంస్థకు భూమిని ఇచ్చేది లేదన్నారు. రైతు నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
ఓ కంపెనీ పేరుతో భూముల్ని తీసుకుని,
మరో సంస్థకు అప్పగించారని ఆగ్రహం


