శివాజీనగర: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల ఏర్పడిన వంట గ్యాస్ సిలిండర్ల కొరత బెంగళూరుతో పాటు పలు జిల్లాల్లో 7వ రోజుకు చేరింది. కమర్షియల్, గృహ అవసరాల సిలిండర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో రాష్ట్రంలోని హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే హోటళ్ల యజమానులు గ్యాస్ కరువై వారే ఆకలితో ఖాళీ కడుపుతో ఉంటున్నారు. గత ఐదు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా నష్టం జరిగిందని హోటల్ యజమానుల సంఘం సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 40 వేలకు పైగా హోటల్లు పనిచేస్తున్నాయి. గ్యాస్ లభించక వ్యాపారం తగ్గి ఆదాయం పడిపోయంది. కాబట్టి హోటల్ పరిశ్రమకు ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరారు. 20 శాతం గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా హోటళ్లు పూర్తిగా దారిలో పడడానికి చాలా సమయం పడుతుందన్నారు. అనేక హోటళ్లు, క్యాంటీన్లలో కట్టెల పొయ్యిలు వెలిశాయి.
శీతల పానీయంపై గ్యాస్ పన్ను
గ్యాస్ కొరత వల్ల బెంగళూరులో అనేక హోటళ్లు మూతపడగా, ఉన్న హోటళ్లలో గ్యాస్ ఫీజును కస్టమర్లపై బాదుతున్నారని ఆరోపణలున్నాయి. శీతల పానీయంపై కూడా గ్యాస్ పన్ను వేయడం వివాదాస్పదమైంది. పుదీన– నిమ్మరసం పానీయంపై 5 శాతం గ్యాస్ క్రైసిస్ చార్జ్ అని డబ్బులు వసూలు చేశారు. ఆ కస్టమర్ ఈ బిల్లును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒక్కొక్కరికి రూ.179 ధరతో రెండు పుదీన నిమ్మ పానీయాలను ఇచ్చారు. ఇందులో గ్యాస్ చార్జీ కూడా ఉండడంతో ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఆ పానీయం తయారీకి గ్యాస్ మంటతో పని లేదని, చార్జీ ఎందుకు వేశారని ప్రశ్నించారు.
ఇప్పటికీ సరఫరా అంతంతే
రూ.100 కోట్లు నష్టమంటున్న
యజమానులు
గృహ సిలిండర్లకూ రద్దీ


