హుబ్లీ: ఇద్దరు చిన్నారులు ఈత సరదాతో జలసమాధి అయిన ఘటన హుబ్లీలోని నవనగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. ఇద్దరు కళాశాల విద్యార్థులు తీవ్రమైన ఎండల నేపథ్యంలో స్నానానికి ఇంటి దగ్గరలోని నీటి గుంత దగ్గరకు వెళ్లారు. అయితే వారిద్దరికీ సరిగ్గా ఈత రాని కారణంగా ఇద్దరు స్నేహితులు జలసమాధి అయ్యారు. పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఆవేదనతో రగిలి పోయారు. నగరంలోని బైరిదేవరకొప్ప రేణుకా నగర్ నివాసులైన సమర్థ్(17), హరీష్(17) అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులు శవాలుగా లభ్యమయ్యారు. వీరిద్దరూ స్థానిక గోపనకొప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామర్స్ విభాగంలో ప్రథమ పీయూసీ చదివేవారు. ఇటీవల పరీక్షలు ముగియడంతో ఇంట్లోనే ఉండేవారు. బయట ఎండలు మండిపోతుండడంతో ఇంటి దగ్గరలోని నిర్మాణ దశలోని ఆర్ఎన్ఎస్ గాల్ఫ్ మైదానంలోని గుంత దగ్గరకు స్నానానికి వెళ్లారు.
సాయంత్రమైనా ఆచూకీ లేదు
మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన వారు సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆ మైదానంలోని కార్మికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈత రాకపోయినా ఈ ఇద్దరు వారి కుటుంబాల్లో ఏకై క సంతానాలైన తమ బిడ్డల శవాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువుల శోకం కట్టలు తెంచుకుంది. ఘటనపై ఏపీఎంసీ నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తమ పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, వేసవిలో తమ పిల్లలపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు పోలీసు అధికారులు సూచించారు.
నీటి కొలనులో ఇద్దరు బాలుర జల సమాధి


