సాక్షి,బళ్లారి: మాదక ద్రవ్యాలు వాడటం కేవలం వ్యక్తిగత సమస్య కాదని, కుటుంబాలను దెబ్బతీయడమే కాకుండా, సమాజంలో అశాంతి, నేరాలను పెంచుతాయని, వాటి నిర్మూలన ఒక జాతీయ సవాల్ అని, దుర్మార్గమైన వ్యసనమని, అలాంటి వాటికి నేటి యువత దూరంగా ఉండాలని గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఆయన బుధవారం నగరంలోని జిల్లా క్రీడా మైదానంలో రాజీవ్గాంధీ విశ్వవిద్యాలయం, దిశాబోధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నషాముక్త భారత్–యువశుద్ధి అభియాన్ వాకథాన్ను ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటక విశ్వగురు బసవణ్ణ వంటి మహానుభావులు జన్మించిన పుణ్యభూమి. సమృద్ధమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలను కలిగి ఉందన్నారు. కర్ణాటక శాంతి, సౌహార్ధతకు, విద్యానిలయాలకు మారుపేరుగా నిలిచిందన్నారు.
మాదక ద్రవ్యాల వాడకం ఆందోళనకరం
అలాంటి పుణ్యభూమిలో ఏటా యువత కాకుండా అన్ని వర్గాలకు చెందిన వారు మాదక ద్రవ్యాలు వాడటం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువ శక్తి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా తీర్చిదిద్దగలదన్నారు. కమ్మరచేడు కళ్యాణస్వామి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో విజ్ఞానం పెరిగే కొద్దీ మనుషుల్లో అహంకారం పెరిగిపోవడమే కాకుండా, చెడు అలవాట్లకు కూడా రోజు రోజుకు దగ్గర అవుతారన్నారు. ఈ మహమ్మారిని దూరం చేయాలని సూచించారు. రాజీవ్గాంధీ ఆరోగ్య వర్సిటీ వీసీ బీ.సీ.భగవాన్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు లోనుకాకుండా, ఆరోగ్యవంతమైన భారత్కు నాంది పలకాలన్నారు. చిన్న వయస్సులోనే గుండెపోటు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
లక్ష్యసాధనే ముఖ్యం: బిషప్ హెన్రీ డిసౌజా
బళ్లారి ధర్మగురువు బిషప్ హెన్రీ డిసౌజా మాట్లాడుతూ మనం ఎక్కడ జన్మించామన్నది కాదు అని, మన జీవితంలో ఏ లక్ష్యాన్ని చేరుకున్నామనేది ముఖ్యం అన్నారు. యువత వ్యవసనాలకు దూరంగా ఉంటూ, మంచి లక్ష్యాలను సాధించినప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందన్నారు. దిశాబోధి ఫౌండేషన్ డైరెక్టర్ కే.శివనాగిరెడ్డి, మేయర్ గాదెప్ప, ప్రముఖులు చిదానంద, జానెకుంటె బసవరాజు, కర్ణాటక క్రిస్టియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ జీజే.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నషాముక్త భారత్ అభియాన్ ర్యాలీ నగరంలోని సుధా సర్కిల్, ఇన్ఫ్యాంట్రీ రోడ్డు, ఎస్పీ సర్కిల్, కిత్తూరు రాణిచెన్నమ్మ స్కూల్ రోడ్డు తదితర ప్రముఖ రోడ్లలో సాగుతూ చూపరులను ఆకట్టుకుంది.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్


