బళ్లారిఅర్బన్: మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడగల శక్తికలిగిన వారని, ఇలాంటి మహిళలకు కుట్టు(టైలరింగ్) వృత్తి జీవనోపాధి కల్పిస్తుందని బీజేపీ మహిళా మోర్ఛా జిల్లా అధ్యక్షురాలు హంపీ రమణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింధిగి కాంపౌండ్లో ప్రతిభా మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు. కుట్టు శిక్షణ ద్వారా నైపుణ్యం పెంపొందించుకున్న మహిళలు తమ ప్రతిభతో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలరన్నారు. ఉన్నత విద్య లేక పోయినా కృషి నైపుణ్యంతో మహిళలు తమ జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకొని స్వతంత్రులుగా ఎదగగలరన్నారు. ప్రతిభా మహిళ మండలి అధ్యక్షురాలు సుజాత రవిచంద్ర మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత కోసం సంస్థ తరచు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు తమ ప్రతిభతో స్వయం ఉపాధి పొందుతూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. బీజేపీ మహిళా మోర్ఛా రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి, శిక్షణ పొందిన అనేక మంది మహిళలు పాల్గొన్నారు.


