రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని కోరుతూ కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ ఆధ్వర్యంలో రాయచూరు బంద్ పూర్తిగా విజయవంతమైంది. ఉదయం నుంచే ఐక్య వేదిక మహాసభ కార్యకర్తలు నగరంలో కలియ తిరుగుతూ బంద్ చేయించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ముగ్గురు కార్యకర్తలు శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలో దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బాబూ జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ సర్కిల్, బసవేశ్వర సర్కిల్, గంజ్ సర్కిళ్ల వద్ద ఆందోళన చేపట్టి వాహనాల రాకపోకలను స్తంభింప చేశారు.
ఆర్టీసీ బస్టాండ్ వెలవెల
ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేకపోవడంతో బోసిపోయింది. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అంగళ్లు, హోటళ్లు బంద్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిథిగా పని చేశాయి. రాయచూరు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు రవాణా సౌకర్యాలు స్తంభించి పోయాయి. తెలంగాణలోని గడినాడు టైర్ రహదారి వద్ద ఆరు కి.మీ.ల దూరం వాహనాలు నిలిచి పోయాయి. తీన్ కందిల్, సూపర్ మార్కెట్, షరాఫ్ బజార్, పటేల్ రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, గంజ్ రహదారులు వాహన సంచారం లేక ప్రజల సందడి లేక బోసిపోయాయి. రాయచూరు నుంచి మంత్రాలయం, బళ్లారి, కర్నూలు, శ్రీశైలం, దావణగెరె, హైదరాబాద్, కలబుర్గి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు.
బంద్తో మూతపడిన అంగళ్లు, హోటళ్లు
ముగ్గురు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
తెలంగాణ, ఏపీలకు నిలిచిన రాకపోకలు


