Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

19 wickets fell on the first day of the first Ashes Test1
అటు స్టార్క్‌... ఇటు స్టోక్స్‌

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాషెస్‌ సిరీస్‌ అనూహ్య రీతిలో ఆరంభమైంది. కిక్కిరిసిన పెర్త్‌ స్టేడియంలో ఆసీస్‌ పేసర్లు అదరగొట్టడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశాం అనుకుంటే... ఇంగ్లండ్‌ బౌలర్లు కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు. స్టార్క్‌ ధాటికి ఇంగ్లండ్‌ స్వల్ప స్కోరుకే కుప్పకూలగా... బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ బంతితో విజృంభించాడు. ఐదు వికెట్లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. వెరసి... పర్యాటక ఇంగ్లండ్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆధిక్యం దక్కే అవకాశాలున్నాయి. పెర్త్‌: పేసర్లకు అనుకూలించే పెర్త్‌ పిచ్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు తొలి రోజే 19 వికెట్లు నేలకూలాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ధాటిగా ఆడుతూ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (61 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో రాణించగా... ఒలీ పోప్‌ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), జేమీ స్మిత్‌ (22 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అలెక్స్‌ కేరీ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఆసీస్‌ పేసర్లు ఆకట్టుకున్న చోట... ఇంగ్లండ్‌ బౌలర్లు కూడా సత్తా చాటారు. సారథి బెన్‌ స్టోక్స్‌ 6 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, బ్రైడన్‌ కార్స్‌ చెరో 2 వికెట్లు తీశారు. చేతిలో ఒక వికెట్‌ ఉన్న ఆస్ట్రేలియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. నాథన్‌ లయన్‌ (3 బ్యాటింగ్‌), బ్రెండన్‌ డగెట్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్‌లోనే వికెట్‌...ఆస్ట్రేలియా గడ్డపై గత కొన్నాళ్లుగా ప్రభావం చూపలేకపోతున్న ఇంగ్లండ్‌ జట్టును స్టార్క్‌ (7/58) కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలతో గట్టిదెబ్బ కొట్టాడు. తొలి ఓవర్‌ చివరి బంతికి ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (0)ని అవుట్‌ చేసిన అతడు... చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. తొలి ఓవర్‌లో వికెట్‌ పడగొట్టడం స్టార్క్‌కు ఇది 24వసారి. సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ (0) డకౌట్‌ కాగా... కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (6) ప్రభావం చూపలేకపోయాడు. బెన్‌ డకెట్‌ 21 పరుగులు చేశాడు. పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై సంయమనంతో బ్యాటింగ్‌ చేయడానికి బదులు ఇంగ్లండ్‌ జట్టు... తమకు అలవాటైన ‘బాజ్‌బాల్‌’ ఆటతీరును అవలంభించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్‌ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. దీంతో ఒకవైపు వికెట్లు పడుతున్నా... ఇంగ్లండ్‌ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అరంగేట్ర పేసర్‌ బ్రెండన్‌ డగెట్‌ 2 వికెట్లు తీశాడు. కామెరూన్‌ గ్రీన్‌కు ఒక వికెట్‌ దక్కింది. 6 ఓవర్లు వేసి 5 వికెట్లు...తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్‌... బౌలింగ్‌లో పట్టుదల కనబర్చింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఆసీస్‌ అరంగేట్ర ఓపెనర్‌ జేక్‌ వెదరాల్డ్‌ (0)ను ఆర్చర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబుషేన్‌ (41 బంతుల్లో 9; 1 ఫోర్‌) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా... ఈ మ్యాచ్‌లో సారథ్యం వహిస్తున్న స్టీవ్‌ స్మిత్‌ (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఉస్మాన్‌ ఖ్వాజా (2) విఫలం కాగా... ట్రావిస్‌ హెడ్‌ (21), కామెరూన్‌ గ్రీన్‌ (24) తలా కొన్ని పరుగులు చేశారు. తొలి నాలుగు వికెట్లను ఆర్చర్, కార్స్‌ పంచుకోగా... ఆ తర్వాత కెప్టెన్‌ స్టోక్స్‌ మ్యాజిక్‌ ప్రారంభమైంది. కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్‌ చేసిన అతడు... వరుసగా హెడ్, గ్రీన్, స్టార్క్‌ (12), కేరీ, బోలండ్‌ (3)లను పెవిలియన్‌ బాట పట్టించాడు. ఇంగ్లండ్‌ కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా... 5.23 రన్‌రేట్‌తో పరుగులు సాధించగా... ఆస్ట్రేలియా మాత్రం ఆ పని చేయలేకపోయింది.19 యాషెస్‌ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు నేలకూలడం 1909 తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1909 మాంచెస్టర్‌ టెస్టు తొలి రోజు ఇరు జట్లు ఆలౌటయ్యాయి.5 ఆస్ట్రేలియా గడ్డపై 5 వికెట్లు పడగొట్టిన ఐదో ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌ నిలిచాడు. చివరిసారిగా 1982లో ఇంగ్లండ్‌ సారథి బాబ్‌ విల్లీస్‌ బ్రిస్బేన్‌ టెస్టులో ఈ ఘనత సాధించాడు.36 బెన్‌ స్టోక్స్‌ ఐదు వికెట్లు పడగొట్టేందుకు వేసిన బంతులు. ఇంగ్లండ్‌ పేసర్లలో ఇది మూడో వేగవంతమైంది. గతంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ 19 బంతుల్లో (ఆస్ట్రేలియాపై), 34 బంతుల్లో (న్యూజిలాండ్‌పై) ఈ ఫీట్‌ నమోదు చేశాడు.7/58 ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌కు టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆసీస్‌ ఆడిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై స్టార్క్‌ 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టెస్టుల్లో స్టార్క్‌ ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి.100 ‘యాషెస్‌’ టెస్టుల్లో 100 వికెట్లు తీసిన 11వ ఆస్ట్రేలియా పేసర్‌గా స్టార్క్‌ నిలిచాడు. 21వ శతాబ్దంలో టెస్టు అరంగేంట్రం చేసిన వారిలో ఈ ఘనత సాధించిన మొదటి పేసర్‌ అతడే.0/1 యాషెస్‌ సిరీస్‌లో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదు కాకుండా ఇరు జట్లు ఓపెనింగ్‌ బ్యాటర్‌ వికెట్‌ కోల్పోవడం ఇదే తొలిసారి.10 బెన్‌స్టోక్స్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయడం ఇది పదోసారి. భారత స్పిన్నర్‌ అశ్విన్‌ 13 సార్లు స్టోక్స్‌ను పెవిలియన్‌ చేర్చాడు.

WPL auction on the 27th of this month2
ఖాళీలు 73... బరిలో 277

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026వ సీజన్‌కు సంబంధించిన వేలం ఈ నెల 27న జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచిన టీమిండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మతో పాటు... హర్లీన్‌ డియోల్, ప్రతీక రావల్, పూజ వస్త్రకర్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్‌ వంటి భారత ఆటగాళ్లతో పాటు పలువులు అంతర్జాతీయ ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు. అటు బౌలింగ్‌ ఇటు బ్యాటింగ్‌లో సత్తాచాటే దీప్తి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి. మొత్తం 5 ఫ్రాంచైజీలు కలిసి ఈ వేలంలో రూ. 41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం మొత్తం 277 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో 52 మంది క్యాప్డ్‌ ప్లేయర్స్‌ కాగా... 142 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు. ఇక విదేశాల నుంచి 83 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 66 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా... 17 మంది అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు. గరిష్ట ప్రారంభ ధర రూ. 50 లక్షలు కాగా... ఇందులో 19 మంది ప్లేయర్లు ఉన్నారు. దీప్తి, హర్లీన్, ప్రతీక, పూజ, ఉమ, క్రాంతితో పాటు సోఫీ డివైన్, అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌), సోఫీ ఎకిల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), అలీసా హీలీ, మెగ్‌ లానింగ్‌ (ఆ్రస్టేలియా) కూడా తమ ప్రాథమిక ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించుకున్నారు. రూ. 40 లక్షల ప్రారంభ ధరతో 11 మంది, రూ. 30 లక్షల ప్రారంభ ధరతో 88 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ‘వేలంలో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. 50 స్థానాల కోసం వీరు పోటీ పడుతున్నారు. 23 విదేశీ స్థానాల కోసం 83 మంది పోటీలో ఉన్నారు’ అని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Indian women star cricketer Smriti Mandhana to get married tomorrow3
స్మృతి WEDS పలాశ్‌

న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలిసారి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వైస్‌ కెప్టెన్, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన మనసిచ్చిన వాడితో రేపు మనువాడబోతోంది. ఇన్నేళ్లుగా ఒకలా రేపటి రోజు ఒకలా స్మృతి కనిపించబోతోంది. జట్టు జెర్సీతో మైదానంలో ప్యాడ్లు, గ్లౌజ్‌లు, క్యాప్‌తో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చే ఆమె... రేపు మాత్రం అరుదైన డిజైనర్‌ లెహెంగా, నుదుటన పాపిట బిళ్ల, బుగ్గన చుక్క, మోచేతుల దాకా గాజులు, అరచేతి నిండా పండిన గోరింటాకు, కాళ్లకు పారాణితో వధువులా ముస్తాబై కమనీయ కళ్యాణ వేదికకు రానుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సంగీత దర్శకుడు, డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌తో స్మృతి కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరు త్వరలోనే ఒక్కటవుతారనే వార్తలు నెట్టింట తెగ షికార్లు చేశాయి. ప్రపంచకప్‌ తర్వాత ముహూర్తం ఖాయమనే ముచ్చట్లూ వినిపించాయి. చివరకు అన్నట్లే ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే స్మృతి ఇంట పెళ్లి బాజా మోగనుంది. తన హోటల్‌ ‘ఎస్‌ఎం 18’ (స్మృతి మంధాన 18 జెర్సీ నంబర్‌)లో భారత జట్టు సహచరుల సందడితో పెళ్లి కోలాహలం ఎప్పుడో మొదలైంది. హల్దీ, మెహందీ వేడుకల్లో సహచరుల చిందులు, చిలిపి అల్లర్లు నెట్టింట కనువిందు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలతో పాటు డీవై పాటిల్‌ స్టేడియం మధ్యలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పలాశ్‌ పిచ్‌ వద్దకు తొడ్కొని రావడంతోపాటు మోకాళ్లపై కూర్చోని ఆమెకు చేసిన పెళ్లి ప్రతిపాదన వీడియో కూడా నెట్టింట క్రికెట్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 19 లక్షలు లైక్‌లు, 12 వేలపైచిలుకు కామెంట్లు, లెక్కలేనన్ని శుభాకాంక్షలు ఇన్‌స్టాలో వెల్లువెత్తాయి. ‘ఎక్స్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే జంట స్మృతి మంధాన, పలాశ్‌లకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Bangladesh take huge lead in second Test against Ireland4
భారీ ఆధిక్యంలో బంగ్లాదేశ్‌

మిర్పూర్‌: సొంతగడ్డపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న బంగ్లాదేశ్‌ జట్టు... ఐర్లాండ్‌తో రెండో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (91 బంతుల్లో 60; 6 ఫోర్లు), షాద్‌మన్‌ ఇస్లామ్‌ (110 బంతుల్లో 69 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో గావిన్‌ హోయ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. నేడు ఆటకు నాలుగో రోజు కాగా... చేతిలో 9 వికెట్లు ఉన్న బంగ్లాదేశ్‌... ప్రస్తుతం 367 పరుగుల ఆధిక్యంలో ఉంది. షాద్‌మన్‌తో పాటు మోమినుల్‌ హక్‌ (19 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 98/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాండ్‌ జట్టు... 88.3 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ టకర్‌ (171 బంతుల్లో 75 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... జోర్డన్‌ నీల్‌ (83 బంతుల్లో 49; 9 ఫోర్లు), స్టీఫెన్‌ (77 బంతుల్లో 46; 4 ఫోర్లు) చక్కటి పోరాటం కనబర్చారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్‌ 4 వికెట్లు పడగొట్టగా... ఖాలెద్‌ అహ్మద్, హసన్‌ మురాద్‌ చెరో 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోరు చేయడంతో... ఆ జట్టుకు 211 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌ జరుగుతన్న సమయంలో ఉదయం సెషన్‌లో భూప్రకంపనలు రావడంతో కొన్ని నిమిషాలపాటు ఆటను నిలిపి వేశారు.

Second Test match between India and South Africa start today5
సిరీస్‌ కాపాడుకుంటారా!

పుష్కర కాలం పాటు సొంతగడ్డపై ఆడిన ప్రతీ టెస్టు సిరీస్‌ గెలిచిన భారత్‌ ఇప్పుడు ఏడాది వ్యవధిలో రెండో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడిన జట్టు సిరీస్‌ గెలుచుకునే అవకాశం లేకపోగా, ఇప్పుడు దానిని కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతోంది. కోల్‌కతా పిచ్‌ మనకు పూర్తి ప్రతికూలంగా మారి చర్చకు దారి తీసిన నేపథ్యంలో... ఈసారి ఎలాంటి పిచ్‌ భారత్‌కు అనుకూలిస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మరోవైపు పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌ గెలిచిన వరల్డ్‌ చాంపియన్‌ దక్షిణాఫ్రికా అదే ఉత్సాహంతో మరోసారి తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి పైచేయి సాధించాలని భావిస్తోంది. ఇలాంటి స్థితిలో రెండో టెస్టు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. గువాహటి: భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ ఫలితాన్ని తేల్చే రెండో టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మూడు రోజుల్లోపే ముగిసిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్య విజయం సాధించగా, ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత టెస్టులో మెడ నొప్పితో అర్ధాంతరంగా తప్పుకున్న శుబ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో రిషబ్‌ పంత్‌ తొలిసారి జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పక్కటెముకల గాయంతో తొలి టెస్టు ఆడని దక్షిణాఫ్రికా పేసర్‌ రబడ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌ నుంచి కూడా తప్పుకున్నాడు. చివరిసారి దక్షిణాఫ్రికా 2000లో భారత గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. సుదర్శన్‌కు అవకాశం! గత టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో మన బ్యాటర్లెవరూ కనీసం అర్ధసెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. ఆ వైఫల్యాన్ని దాటి ఓపెనర్లు జైస్వాల్, రాహుల్‌ శుభారంభం ఇవ్వాల్సి ఉంది. గిల్‌ గాయం కారణంగా ఒక తప్పనిసరి మార్పుతో జట్టు బరిలోకి దిగనుంది. గిల్‌ స్థానంలో వచ్చే సాయి సుదర్శన్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది చెప్పలేం. ధ్రువ్‌ జురేల్‌ మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉండగా, ఇప్పుడు కొత్తగా కెప్టెన్సీతో పంత్‌పై బాధ్యత మరింత పెరిగింది. అతని ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగితే భారత్‌ పటిష్ట స్థితికి చేరుతుంది. జడేజా, సుందర్‌ల బ్యాటింగ్‌ మరోసారి కీలకం కానుంది. పేసర్లుగా బుమ్రా, సిరాజ్‌ ఖాయం కాగా, పిచ్‌ను బట్టి మూడో పేసర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే మేనేజ్‌మెంట్‌ ఆలోచన అయితే నితీశ్‌ కుమార్‌ రెడ్డి తుది జట్టులోకి వస్తాడు. ఈడెన్‌లో నలుగురు స్పిన్నర్లతో ఆడి విమర్శలపాలైన జట్టు నితీశ్‌ను ఆడిస్తే అక్షర్‌ను పక్కన పెట్టవచ్చు. ఆఫ్‌ స్పిన్నర్‌ హార్మర్‌ చెలరేగుతున్న నేపథ్యంలో ఆరుగురు లెఫ్ట్‌ హ్యాండర్లతో ఆడటం మరింత ఇబ్బందికరం అనుకుంటే కూడా నితీశ్‌కు చాన్స్‌ లభిస్తుంది. బ్రెవిస్‌కు చోటు! కోల్‌కతా టెస్టు ఘన విజయం ఇచ్చిన జోష్‌తో దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు తడబడినా బౌలర్లు గెలుపును అందించారు. ఈసారి కూడా హార్మర్, మహరాజ్‌ కీలకం కానున్నారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే వీరిద్దరు చెలరేగిపోగలరు. అవసరమైతే మూడో స్పిన్నర్‌గా ముత్తుసామిని కూడా ఆడించాలని టీమ్‌ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయిన ముల్డర్‌ స్థానంలో అతనికి స్థానం దక్కవచ్చు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా లేకపోతే ముల్డర్‌ స్థానంలో మరో బ్యాటర్‌ బ్రెవిస్‌కు చాన్స్‌ దక్కవచ్చు. దూకుడుగా ఆడే బ్రెవిస్‌ కొద్ది సేపట్లోనే ఆట గమనాన్ని మార్చగల సమర్థుడు. జట్టు బ్యాటింగ్‌కు మరోసారి కెప్టెన్‌ బవుమా మూల స్థంభంలా ఉన్నాడు. ఇతర బ్యాటర్ల నుంచి అతనికి తగినంత సహకారం కావాలి. రికెల్టన్, జోర్జిలకు తగినంత అనుభవం లేకపోగా... ఓపెనర్‌గా మార్క్‌రమ్‌ రాణించడం జట్టుకు అవసరం. పేసర్లు యాన్సెన్, బాష్‌ కూడా భారత్‌పై ప్రభావం చూపించగలరు. గువాహటిలో తొలి టెస్టు భారత్‌లో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న 30వ వేదికగా గువాహటి నిలుస్తోంది. ఇక్కడి బర్సపర స్టేడియంలో ఇప్పటి వరకు 2 వన్డేలు, 4 టి20లతో పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇటీవల మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లకు ఈ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. బర్సపరలో కొత్త మైదానం ప్రారంభానికి ముందు 1983 నుంచే గువాహటి నెహ్రూ స్టేడియంలో వన్డేలు జరిగాయి.ముందు టీ విరామం, ఆ తర్వాత లంచ్‌... ఈశాన్య రాష్ట్రం అసోంలోని వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని టెస్టు మ్యాచ్‌ సమయాల్లో స్వల్ప మార్పు చేశారు. ఇక్కడ సాయంత్రం తొందరగా చీకటి పడిపోతుంది. దాంతో మ్యాచ్‌ను ఉదయం 9 గంటల నుంచి మొదలుపడుతున్నారు. తొలి సెషన్‌ తర్వాత 11 గంటలకు టీ విరామం ఇస్తారు. 1:20కి లంచ్‌ బ్రేక్‌ అవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఆట ముగుస్తుంది. ఒకటే మ్యాచ్‌కు కెప్టెన్‌గా అంటే చేసేదేముంటుంది. అయితే దేశానికి నాయకత్వం వహించడం అంటే గర్వపడాల్సిన క్షణం. నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు. వ్యూహాల్లో కెప్టెన్‌గా సాంప్రదాయ శైలిని అనుసరించడంతో పాటు కొత్త తరహాలో కూడా ఆలోచిస్తాను. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూనే జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలననే నమ్మకం ఉంది. –రిషభ్‌ పంత్, భారత జట్టు 38వ టెస్టు కెప్టెన్‌ పిచ్, వాతావరణం కోల్‌కతాతో పోలిస్తే మెరుగైన పిచ్‌ అని అందరూ అంగీకరించారు. ఆరంభంలో బౌన్స్, బ్యాటింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్పిన్‌ ప్రభావం కనిపించవచ్చు. అయితే ఇక్కడ తొలి టెస్టు కాబట్టి ఎవరికీ స్పష్టత లేదు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్‌: పంత్‌ (కెప్టెన్‌), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, జడేజా, సుందర్, అక్షర్‌/నితీశ్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్‌. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), మార్క్‌రమ్, రికెల్టన్, ముల్డర్‌/ బ్రెవిస్, జోర్జి, స్టబ్స్, వెరీన్, బాష్, యాన్సెన్, హార్మర్, మహరాజ్‌.

ACC Men's Asia Cup Rising Stars 2025, Semi Final 1: Bangladesh A Beat India A In Super Over and Enter Final6
వైభవ్‌ మెరుపులు వృధా.. ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) భాగంగా భారత్‌-ఏ-బంగ్లాదేశ్‌-ఏ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 21) జరిగిన తొలి సెమీఫైనల్‌ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమానమైన స్కోర్లు చేయగా మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఖాతా తెరవకుండానే 2 వికెట్లూ కోల్పోగా.. సుయాశ్‌ శర్మ వైడ్‌ వేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. పాకిస్తాన్‌-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఇవాళ రాత్రే జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో బంగ్లాదేశ్‌-ఏ నవంబర్‌ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఓపెనర్‌ హబిబుర​్‌ రెహ్మాన్‌ సోహన్‌ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మెహ్రబ్‌ (18 బంతుల్లో 48 నాటౌట్‌; ఫోర్‌, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.భారత బౌలర్లలో గుర్‌జప్నీత్‌ సింగ్‌ (4-0-39-2), హర్ష​్‌ దూబే (4-0-22-1), సుయాశ్‌ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. రమన్‌దీప్‌ సింగ్‌ (2-0-29-1), నమన్‌ ధిర్‌ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్‌ మెరుపులు వృధాభారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ (15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రియాంశ్‌ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు వృధా అయ్యాయి. జితేశ్‌ శర్మ (33), నేహల్‌ వధేరా (32 నాటౌట్‌), ఆఖర్లో రమన్‌దీప్‌ (17), అశుతోష్‌ శర్మ (13) సత్తా చాటడంతో అతి కష్టం మీద నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి.అయితే సూపర్‌ ఓవర్‌లో భారత్‌ బొక్క బోర్లా పడింది. తొలి రెండు బంతులకు వికెట్లు జితేశ్‌, అశుతోష్‌ ఔట్‌ కావడంతో ఖాతా కూడా తెరవలేకయింది. అనంతరం బంగ్లాదేశ్‌ సైతం తొలి బంతికే వికెట్‌ కోల్పోగా.. రెండో బంతిని సుయాశ్‌ శర్మ వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్‌ గెలుపొందింది. చదవండి: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన

South Africa Squads Announced For India Limited Overs Series7
భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన

త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల (India vs South Africa) కోసం వేర్వేరు సౌతాఫ్రికా జట్లను (South Africa) ఇవాళ (నవంబర్‌ 21) ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా టెంబా బవుమా (Temba Bavuma), టీ20 జట్టు కెప్టెన్‌గా ఎయిడెన్‌ మార్క్రమ్‌ (Aiden Markram) ఎంపికయ్యారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసిన రూబిన్‌ హెర్మన్‌ వన్డే జట్టులో కొనసాగాడు. క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నవంబర్‌ 30, డిసెంబర్‌ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్‌, విశాఖ వేదికలుగా జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ డిసెంబర్‌ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్‌, ముల్లాన్‌పూర్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికగా జరుగనుంది.భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:టెంబా బవుమా (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్‌ సుబ్రాయన్‌.భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్‌ స్టబ్స్‌.చదవండి: టీమిండియాతో సెమీఫైనల్‌.. బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌

IND vs SA Sai Padikkal getting into the XI: Former stumper predicts changes8
IND vs SA: అతడిపై వేటు.. భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరు!

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో చావోరేవో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గువాహటి వేదికగా శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆందోళనకరంగా పరిణమించింది.గిల్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)ను బీసీసీఐ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. అయితే, తుదిజట్టులో గిల్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై పంత్‌ స్పందిస్తూ.. తాము ఇప్పటికే గిల్‌ రీప్లేస్‌మెంట్‌ గురించి నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. కానీ ఆ ఆటగాడి పేరు మాత్రం వెల్లడించలేదు.ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సబా కరీం (Saba Karim) కీలక వ్యాఖ్యలు చేశాడు. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న తరుణంలో.. భారత జట్టు ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లను ఆడించాలని సూచించాడు. అదే విధంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఇవ్వాలని పేర్కొన్నాడు.ఇందులో భాగంగా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌పై వేటు వేయక తప్పదని సబా కరీం అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్‌ గిల్‌ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ. అయితే, ఇలాంటి సమయంలో తుది జట్టులోకి సాయి సుదర్శన్‌తో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌ను కూడా తీసుకుంటే మంచిది.అతడిపై వేటు వేయాల్సి వస్తుందిఆరు స్పెషలిస్టు బ్యాటర్లు.. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగాలి. గువాహటిలో గెలవాలంటే ఇదే సరైన కాంబినేషన్‌. కాబట్టి ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను తప్పించకతప్పదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వైవిధ్యం కోసం అతడిపై వేటు వేయాల్సి వస్తుంది.కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్నర్ల కోటాలో తుదిజట్టులో ఉంటారు. ఇక పేస్‌ విభాగంలో బుమ్రా, సిరాజ్‌ ఉండనే ఉన్నారు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. సాయి, పడిక్కల్‌ రాకతో జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుందని.. అందుకే ధ్రువ్‌ జురెల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందని పేర్కొన్నాడు.తొలి టెస్టులో ఆరుగురుకాగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు తీయడంతో పాటు వరుసగా 26, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌.. సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక తొలి టెస్టులో భారత్‌ ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు తుదిజట్టులో చోటు ఇచ్చింది.సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడిన భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్.చదవండి: గంభీర్‌పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ

ACC Men's Asia Cup Rising Stars 2025: BAN-A Scored Huge Score In 1st Semis Against IND-A9
టీమిండియాతో సెమీఫైనల్‌.. బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) ఇవాళ (నవంబర్‌ 21) తొలి సెమీ ఫైనల్‌ జరుగుతుంది. దోహా వేదికగా భారత్‌-ఏ-బంగ్లాదేశ్‌-ఏ (India A vs Bangladesh A) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ హబిబుర్‌ రెహ్మాన్‌ సోహన్‌ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో మెహ్రబ్‌ (18 బంతుల్లో 48 నాటౌట్‌; ఫోర్‌, 6 సిక్సర్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జిషన్‌ ఆలమ్‌ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జవాద్‌ అబ్రార్‌ (13), యాసిర్‌ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ జట్టు కెప్టెన్‌ అక్బర్‌ అలీ 9, మహిదుల్‌ ఇస్లాం 1 పరుగు చేయగా.. అబూ హైదర్‌ డకౌటయ్యాడు.భారత బౌలర్లలో విజయ్‌కుమార్‌ వైశాక్‌ (4-0-51-0) భారీ పరుగులు సమర్పించుకోగా.. గుర్‌జప్నీత్‌ సింగ్‌ (4-0-39-2), హర్ష​్‌ దూబే (4-0-22-1), సుయాశ్‌ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. రమన్‌దీప్‌ సింగ్‌ (2-0-29-1), నమన్‌ ధిర్‌ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్‌ మెరుపులు కూడా మొదలయ్యాయి..!అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (12 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసాన్ని ప్రారంభించాడు. మరో ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య (7 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు) కూడా భారీ షాట్లు ఆడుతున్నాడు. ఫలితంగా భారత్‌ 3.3 ఓవరల్లో వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.

Shreyas Iyer's comeback set to be delayed, Report reveals recovery timeline10
శ్రేయస్‌ అయ్యర్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడిన భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు (Shreyas Iyer) సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ అందుతుంది. టీమిండియాలోకి శ్రేయస్‌ రీఎంట్రీ ఇప్పట్లో కష్టమేనని సమాచారం. ఇండియాటుడే నివేదిక ప్రకారం.. శ్రేయస్‌కు తాజాగా అల్రాసోనోగ్రఫీ (USG) స్కాన్‌ తీశారు. ఇందులో అతడి గాయం పూర్తిగా నయం కాలేదని తేలింది.ప్రస్తుతం​ అతను సాధారణ పనులు, తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు మాత్రమే చేసుకోవచ్చు. హార్డ్‌ ట్రైనింగ్‌ మరో నెల పాటు నిషేధం. రెండు నెలల తర్వాత మరో స్కాన్‌ ఆధారంగా BCCI CoEలో అతడి రీహాబ్‌ ప్లాన్‌ అమలు కానుంది. ఈ సమాచారం నిజమైతే శ్రేయస్‌ మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు.ఈ మధ్యలో అతను సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు దూరమవుతాడు. మార్చిలో జరిగే ఐపీఎల్‌ 2026లోనే శ్రేయస్‌ పునఃదర్శనం ఉంటుంది. ఈ వార్త తెలిసి శ్రేయస్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు. తొలుత శ్రేయస్‌ వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌ సమయానికంతా సిద్దంగా ఉంటాడని అంతా అనుకున్నారు.తాజా అప్‌డేట్‌ని బట్టి చూస్తే ఇప్పట్లో శ్రేయస్‌ను టీమిండియా జెర్సీలో చూడటం కష్టమేనని స్పష్టమవుతుంది.కాగా, అక్టోబర్‌ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్‌ క్యారీ క్యాచ్‌ పట్టే ప్రయత్నంలో శ్రేయస్‌ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్‌ అయితే పట్టగలిగాడు ​కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్‌ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు.అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు. ప్రస్తుతం అతను మునుపటిలా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. క్రికెట్‌కు మాత్రం ఇంకొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. చదవండి: యాషెస్‌ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement