Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Two medals for Indian TT teams1
భారత టీటీ జట్లకు రెండు పతకాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు రెండు పతకాలు సాధించాయి. రొమేనియా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత బాలుర అండర్‌–19 జట్టు రజత పతకంతో మెరవగా... బాలికల అండర్‌–15 జట్టు కాంస్యం సాధించింది. చక్కటి ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకున్న బాలుర అండర్‌–19 జట్టు బుధవారం జరిగిన ఫైనల్లో 0–3తో జపాన్‌ చేతిలో ఓడింది.అంకుర్‌ 17–15, 6–11, 12–10, 4–11, 11–13తో రైసీ కవాకమి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడగా... అభినందర్‌ 7–11, 8–11, 6–11తో కజకి యోషియామా (జపాన్‌) చేతిలో ఓడాడు. మూడో సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రియానుజ్‌ భట్టాచార్య 9–11, 7–11, 3–11తో టమిటో వటనబే (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు సెమీస్‌లో భారత జట్టు 3–2తో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. బాలికల అండర్‌–15 జట్టు సెమీఫైనల్లో 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. తొలిసారి ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత అమ్మాయిల అండర్‌–15 జట్టు క్వార్టర్స్‌లో 3–1తో జర్మనీపై గెలిచింది. బాలికల అండర్‌–19 క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 2–3తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడింది.

Womens Premier League mega auction today2
వరల్డ్‌కప్‌ స్టార్స్‌పైనే దృష్టి

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 సీజన్‌ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా గురువారం ఈ ప్రక్రియ సాగనుంది. మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాలు ఖాళీ ఉండగా... వీటి కోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో 52 మంది క్యాప్డ్‌ (జాతీయ జట్టుకు ఆడినవారు) ప్లేయర్లు కాగా... 142 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు. ఇక విదేశాల నుంచి 83 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 66 మది క్యాప్డ్‌ ప్లేయర్లు... 17 మంది అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు ఉన్నారు. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. » ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ చేజిక్కించుకున్న భారత ప్లేయర్లకు వేలంలో భారీ డిమాండ్‌ ఉండే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచిన టీమిండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడొచ్చు. గతంలో యూపీ వారియర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దీప్తిని వేలంలో ఎవరు దక్కించుకుంటారో చూడాలి. దీప్తితో పాటు రేణుక సింగ్, సోఫీ డివైన్, అమెలియా కెర్‌ (న్యూజిలాండ్‌), ఎకిల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), అలీసా హీలీ, మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా), వాల్‌వర్ట్‌ (దక్షిణాఫ్రికా) మార్క్యూ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. » వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులోని క్రాంతి గౌడ్, శ్రీ చరణి, హర్లీన్‌ డియోల్, ప్రతీక రావల్‌కు కూడా భారీ ధర దక్కే అవకాశాలున్నాయి. స్నేహ్‌ రాణా, పూజ వస్త్రకర్, ఉమా ఛెత్రీ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు. విదేశీ ప్లేయర్ల జాబితాలో డిక్లెర్క్, లిచ్‌ఫీల్డ్, అలానా కింగ్‌ కూడా ఉన్నారు. » 5 ఫ్రాంచైజీలు కలిసి ఈ వేలంలో రూ. 41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అందులో అత్యధికంగా యూపీ వారియర్స్‌ దగ్గర 14.5 కోట్లు ఉన్నాయి. వేలానికి ముందు ఆ జట్టు కేవలం ఒక్క ప్లేయర్‌ను మాత్రమే రీటైన్‌ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద అతి తక్కువగా రూ. 5.70 కోట్లు ఉన్నాయి. ఢిల్లీతో పాటు ముంబై ఇండియన్స్‌ జట్లు వేలానికి ముందు ఐదుగురు ప్లేయర్లను రీటైన్‌ చేసుకున్నాయి. దీంతో వేలంలో ఈ రెండు జట్లకు ‘రైట్‌ టు మ్యాచ్‌‘ అవకాశం లేదు. వేలంలో నలుగురు అసోసియేట్‌ ఆటగాళ్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తీర్థ సతీశ్, ఇషా ఓజా (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌), తారా నోరిస్‌ (అమెరికా), థిపట్చా పుథవాంగ్‌ (థాయ్‌లాండ్‌) వేలం బరిలో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి డబ్ల్యూపీఎల్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Hyderabad and Andhra start Syed Mushtaq Ali Trophy with wins3
హైదరాబాద్, ఆంధ్ర శుభారంభం

కోల్‌కతా: దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు విజయంతో శుభారంభం చేశాయి. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ స్టేడియంలో మధ్యప్రదేశ్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘బి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో సీవీ మిలింద్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నోలో ఎకానా స్టేడియంలో అస్సాం జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో రికీ భుయ్‌ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు 29 పరుగుల తేడాతో నెగ్గింది. హైదరాబాద్‌తో జరిగిన పోరులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మధ్యప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. శివాంగ్‌ కుమార్‌ (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (11) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సీవీ మిలింద్‌ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... రక్షణ్‌ రెడ్డి 26 పరుగులిచ్చి 2 వికెట్లు, అర్ఫాజ్‌ అహ్మద్‌ 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. అజయ్‌దేవ్‌ గౌడ్, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది.అనంతరం హైదరాబాద్‌ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్‌), అమన్‌ రావు (13 బంతుల్లో 16; 2 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి (6 బంతుల్లో 9; 1 ఫోర్‌) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరుకున్నారు. ఈ దశలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ బుద్ధి (46 బంతుల్లో 59 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), తనయ్‌ త్యాగరాజన్‌ (19 బంతుల్లో 18; 1 ఫోర్‌) నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. తనయ్‌ అవుటయ్యాక వచ్చిన భవేశ్‌ సేథ్‌ (6 బంతుల్లో 9; 1 సిక్స్‌) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. అయితే అర్ఫాజ్‌ (13 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో రాహుల్‌ హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చాడు. శుక్రవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో మహారాష్ట్రతో హైదరాబాద్‌ తలపడుతుంది.

Team India all out for 140 in the second innings4
పరాజయం పరిపూర్ణం

మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే చాలు అదే మాకు రెండో టెస్టులో విజయంతో సమానం... నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాడు రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్య ఇది. ‘డ్రా’ చేసుకోవడం కాదు కదా... మన ఆటగాళ్లు కనీస స్థాయి పోరాటం కూడా చేయలేకపోయారు... చివరి రోజు సఫారీ స్పిన్నర్లు పదునైన బంతులతో మన పని పట్టి అలవోకగా మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టారు. రికార్డు విజయంతో సిరీస్‌ను గెలుచుకొని వరల్డ్‌ చాంపియన్‌గా తమ స్థాయిని ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికా సింహనాదం చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మ్యాచ్‌ను శాసించిన యాన్సెన్‌ చివరి క్యాచ్‌ను అద్భుతంగా అందుకోవడం సరైన ముగింపు కాగా... ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై రెండు సిరీస్‌లలో వైట్‌వాష్ కు గురైన భారత బృందం అవమాన భారాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో లాంఛనం ముగిసింది. అనూహ్యమేమీ జరగకుండా భారత్‌ సులువుగా తలవంచింది. ఊహించిన విధంగానే రెండు సెషన్ల లోపే మ్యాచ్‌ చేజారింది. టీమిండియా మిగిలిన 8 వికెట్లు తీసేందుకు సఫారీ బౌలర్లకు 48 ఓవర్లు సరిపోయాయి. బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 27/2తో ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (87 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించడం మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆఫ్‌ స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ (6/37) ఆరు వికెట్లతో భారత్‌ పని పట్టాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టును కూడా గెలిచిన దక్షిణాఫ్రికా తాజా ఫలితంతో 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 25 ఏళ్ల తర్వాత ఆ జట్టు భారత్‌లో సిరీస్‌ గెలవడం విశేషం. 93 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీసిన మార్కో యాన్సెన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా... మొత్తం 17 వికెట్లు తీసిన సైమన్‌ హార్మర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్‌ జరుగుతుంది. జడేజా మినహా... ఓటమి నుంచి తప్పించుకునేందుకు చివరి రోజు బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో కాస్త అదృష్టం కలిసొచ్చింది. యాన్సెన్‌ బౌలింగ్‌లో 4 పరుగుల వద్ద సాయి సుదర్శన్‌ క్యాచ్‌ ఇవ్వగా అది నోబాల్‌గా తేలింది. ఆ తర్వాత 4 పరుగుల వద్ద కుల్దీప్‌ యాదవ్‌ (5) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మార్క్‌రమ్‌ వదిలేశాడు. అయితే ఇది ఎంతోసేపు సాగలేదు. ఒకే ఓవర్లో కుల్దీప్, జురేల్‌ (2)లను అవుట్‌ చేసి దెబ్బ కొట్టిన హార్మర్‌... కొద్ది సేపటికే కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (13)ను కూడా వెనక్కి పంపాడు. టీ విరామానికి భారత్‌ స్కోరు 90/5కు చేరింది. అయితే ప్రతీ బంతిని డిఫెన్స్‌ ఆడుతూ పట్టుదల ప్రదర్శించిన సాయి సుదర్శన్‌ (139 బంతుల్లో 14; 1 ఫోర్‌)) ఎట్టకేలకు ముత్తుసామి వేసిన ఒక చక్కటి బంతికి అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా, సుందర్‌ (16) కొద్దిసేపు పోరాడారు. అయితే కొత్త స్పెల్‌లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన హార్మర్‌ 8 పరుగుల వ్యవధిలో సుందర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (0)లను అవుట్‌ చేయగా... మహరాజ్‌ ఒకే ఓవర్లో జడేజా, సిరాజ్‌ (0)లను వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో వేడుకలు మొదలయ్యాయి. ఐదో స్థానానికి భారత్‌.. భారీ ఓటమి తర్వాత ఇప్పటికిప్పుడు భారత టెస్టు జట్టు ప్రదర్శనపై ఎలాంటి చర్చా జరిగే అవకాశం లేదు. దక్షిణాఫ్రికాతో వన్డేలు, టి20ల తర్వాత న్యూజిలాండ్‌తో భారత్‌ స్వదేశంలోనే వన్డే, టి20 సిరీస్‌లు ఆడనుంది. ఆపై టి20 వరల్డ్‌ కప్, ఐపీఎల్‌ ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ పరాజయంపై విశ్లేషణలు, ప్రశ్నలు ఇక్కడితోనే ముగిసిపోవచ్చు! మరోవైపు తాజా ఓటమితో ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్‌ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్‌ చాలా శ్రమించాల్సి ఉంటుంది. భారత తమ తర్వాతి టెస్టు మ్యాచ్‌ 2026 ఆగస్టులోనే ఆడనుంది. శ్రీలంకకు వెళ్లి 2 టెస్టులు, ఆపై న్యూజిలాండ్‌లో 2 టెస్టులతో పాటు స్వదేశంలో ఆ్రస్టేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఉన్న ఈ 9 టెస్టుల్లో ప్రదర్శన మన ఫైనల్‌ ప్రస్థానాన్ని నిర్దేశించనుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 489; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 260/5 డిక్లేర్డ్‌; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) వెరీన్‌ (బి) యాన్సెన్‌ 13; రాహుల్‌ (బి) హార్మర్‌ 6; సుదర్శన్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ముత్తుసామి 14; కుల్దీప్‌ (బి) హార్మర్‌ 5; జురేల్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) హార్మర్‌ 2; పంత్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) హార్మర్‌ 13; జడేజా (స్టంప్డ్‌) వెరీన్‌ (బి) మహరాజ్‌ 54; సుందర్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) హార్మర్‌ 16; నితీశ్‌ రెడ్డి (సి) వెరీన్‌ (బి) హార్మర్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 1; సిరాజ్‌ (సి) యాన్సెన్‌ (బి) మహరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్‌) 140. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–40, 4–42, 5–58, 6–95, 7–130, 8–138, 9–140, 10–140. బౌలింగ్‌: యాన్సెన్‌ 15–7–23–1, ముల్డర్‌ 4–1–6–0, హార్మర్‌ 23–6–37–6, మహరాజ్‌ 12.5–1–37–2, మార్క్‌రమ్‌ 2–0–2–0, ముత్తుసామి 7–1–21–1. 408 టెస్టుల్లో పరుగులపరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. 2004లో ఆ్రస్టేలియా చేతిలో (నాగ్‌పూర్‌లో) భారత్‌ 342 పరుగుల తేడాతో ఓడింది.3స్వదేశంలో భారత్‌ వైట్‌వాష్ కు గురి కావడం ఇది మూడోసారి. 2000లో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో, 2024లో న్యూజిలాండ్‌ చేతిలో 0–3తో ఓడింది.9 ఈ మ్యాచ్‌లో మార్క్‌రమ్‌ పట్టిన క్యాచ్‌ల సంఖ్య. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రహానే (8) రికార్డును అతను సవరించాడు. 11 కెప్టెన్‌గా బవుమాకిది 11వ టెస్టు విజయం. ఆడిన 12 టెస్టుల్లో ఒకటి డ్రా కాగా, అతని నాయకత్వంలో జట్టు ఒక్క టెస్టూ ఓడలేదు.టెస్టు జట్టుకు కోచ్‌గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం నా చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. చాలా మంది న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్‌లోనే జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌ కూడా గెలిచింది. కివీస్‌తో సిరీస్‌తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది. ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్‌లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి. –గౌతమ్‌ గంభీర్, భారత హెడ్‌ కోచ్‌చాలా గొప్ప విజయం. అసాధారణ ఘనత ఇది. భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడం సాధారణంగా ఊహకు కూడా అందనిది. మా ఆటపై సందేహాలు వ్యక్తం చేసిన వారందరికీ సమాధానమిది. మంచి సన్నద్ధతతో పాటు పరిస్థితులకు తగినట్లుగా మా ఆటను మార్చుకున్నాం. తమ బాధ్యతపై ప్రతీ ఒక్కరికి స్పష్టత ఉండటం మేలు చేసింది. –తెంబా బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్

No one will marry her: How people taunted Once Smriti Mandhana father5
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!

జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్‌గా, వైస్‌ కెప్టెన్‌గా మహిళా క్రికెట్‌పై ఆమె ముద్ర ప్రత్యేక​ం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్‌ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్‌ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.తొమ్మిదేళ్ల వయసులోఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్‌-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్‌-19 టీమ్‌ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్‌గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా అవార్డు అందుకుంది.వరల్డ్‌కప్‌ చాంపియన్‌గాభారత జట్టు వైస్‌ కెప్టెన్‌ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిచింది. అయితే, క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.సగటు భారతీయ తండ్రిఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి 15 షోలో స్పందించింది. హోస్ట్‌ అమితాబ్‌ బచ్చన్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్‌.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్‌ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్‌ ఆడేదాన్ని.అన్న నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్‌ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్‌ చేస్తూ లెఫ్టాండర్‌గా మారిపోయా.అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్‌ పర్సన్‌ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్‌ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్‌గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్‌-19 స్థాయిలో లిస్ట్‌-ఎ మ్యాచ్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌ స్మృతి.ఉన్నత శిఖరాలకుఇక మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి టైటిల్‌ అందించిన కెప్టెన్‌. కెరీర్‌ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.మనసిచ్చిన ప్రియుడు పలాష్‌ ముచ్చల్‌తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్‌ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.ఊహించని విధంగా.. ఇప్పుడిలాఏదేమైనా క్రికెటర్‌ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?

SMAT: Urvil Patel 37 Ball 119 Gujarat Beat Services By 8 Wickets6
సీఎస్‌కే బ్యాటర్‌ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే..

దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy 2025)లో గుజరాత్‌ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్‌-సి గ్రూపులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో సర్వీసెస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్‌ ఉర్విల్‌ పటేల్‌ (Urvil Patel) విధ్వంసకర శతకం కారణంగా గుజరాత్‌ విజయం నల్లేరు మీద నడకలా మారింది.182 పరుగులుహైదరాబాద్‌లోని జింఖాన స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్‌ గౌరవ్‌ కొచ్చర్‌ (37 బంతుల్లో 60) మెరుపు అర్ధ శతకం బాదగా.. అరుణ్‌ కుమార్‌ (29), జయంత్‌ గోయత్‌ (7 బంతుల్లో 29) రాణించారు.గుజరాత్‌ బౌలర్లలో హేమాంగ్‌ పటేల్‌, అర్జాన్‌ నాగ్వాస్వల్లా చెరో రెండు వికెట్లు తీయగా.. హర్షల్‌ పటేల్‌, రవి బిష్షోయి, విశాల్‌ జేస్వాల్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఆది నుంచే దూసుకుపోయింది.చెలరేగిన ఓపెనర్లుఓపెనర్లలో ఆర్య దేశాయ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (35 బంతుల్లో 60)తో హాఫ్‌ సెంచరీ చేయగా.. కెప్టెన్‌ ఉర్విల్‌ పటేల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.321కి పైగా స్ట్రైక్‌రేటుతోఉర్విల్‌ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. 321కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టడం గమనార్హం. మిగతావారిలో రిపాల్‌ పటేల్‌ డకౌట్‌ అయినా పెద్దగా ప్రభావం పడలేదు. 12.3 ఓవర్లలోనే కేవం రెండు వికెట్లు నష్టపోయి గుజరాత్‌ 183 పరుగులు చేసి జయభేరి మోగించింది. శతక వీరుడు ఉర్విల్‌ పటేల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.నమ్మకం నిలబెట్టుకున్నాడుకాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు ఉర్విల్‌ పటేల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు చెన్నై అతడిని రిటైన్‌ చేసుకుంది. ఇక ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ సొంత జట్టు గుజరాత్‌ తరఫున ఉర్విల్‌ తొలి మ్యాచ్‌లోనే ఇరగదీయడం గమనార్హం. కాగా ఏడాది ఐపీఎల్‌లో ఉర్విల్‌ మూడు మ్యాచ్‌లు ఆడి 68 పరుగులు చేశాడు.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం

Bharat Ratna for Gambhir and Agarkar: Vinay Kumar Dokania Satire7
గంభీర్ కోచింగ్ అద్భుతం.. ఇదంతా ఆయ‌న ఘ‌న‌తే!

''కేవలం సంవత్సరం కాలంలో టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన‌ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్‌లకు దేశ అత్యున్న‌త పుర‌స్కారం భారతరత్న ప్ర‌క‌టించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా జాతీయ కోఆర్డినేట‌ర్ విన‌య్ కుమార్ డోకానియా (Vinay Kumar Dokania) సెటైర్ వేశారు. సొంతగడ్డపై టెస్టుల్లో రెండో విజయవంతమైన వైట్‌వాష్‌కు అభినందనలు అంటూ చుర‌క అంటించారు.ద‌క్షిణాఫ్రికాతో జరిగిన‌ రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమిండియా చిత్తుగా ఓడిన నేప‌థ్యంలో.. హెడ్‌ కోచ్ గౌత‌మ్ గంభీర్‌, చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌ల‌పై ఎక్స్ వేదిక‌గా ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు, విమ‌ర్శ‌లు గుప్పించారు. వీరిద్ద‌రినీ తొల‌గించ‌క‌పోతే భార‌త క్రికెట్‌కు భారీ న‌ష్టం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. 80, 90లలో కూడా భారత టెస్ట్ జట్టు ఇంత బలహీనంగా లేద‌ని.. అగార్కర్, గంభీర్ వల్లే ఇప్పుడు అది సాధ్యమైందని దుయ్య‌బ‌ట్టారు. కోచ్ ప‌ద‌వికి గంభీర్ త‌నంత తానుగా రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.వారిద్ద‌రినీ తొల‌గించాలిపటిష్ట‌మైన భార‌త టెస్ట్ జ‌ట్టును గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భ్ర‌ష్టు ప‌ట్టించాడ‌ని, టి20 ఆల్ రౌండర్ల టీమ్‌గా మార్చేశాడ‌ని విన‌య్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. టి20 క్రికెటర్లతో నిండిన ఈ భారత జట్టు కంటే ఇంట్లోని చిన్న పిల్లలు బాగా క్రికెట్ ఆడతారని వ్యంగ్యంగా అన్నారు. అసంబద్ధ నిర్ణ‌యాల‌తో ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టును గంభీర్ ఎగతాళి చేశాడని మండిప‌డ్డారు. టీమిండియా 2027లో సొంత‌గ‌డ్డ‌పై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుంద‌ని.. గంభీర్‌, అగార్క‌ర్‌ల‌ను తొల‌గించ‌క‌పోతే మ‌న జ‌ట్టు 5-0 తేడాతో ఓడిపోతుందని ఆయ‌న జోస్యం చెప్పారు.భారత టెస్ట్ క్రికెట్ హంతకుడుఅశ్విన్, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి.. టెస్ట్ క్రికెట్‌ నుంచి అవమానకరంగా రిటైర్ కావ‌డానికి గంభీర్ కార‌ణ‌మ‌య్యాడ‌ని విన‌య్ కుమార్ ఆరోపించారు. అస‌మ‌ర్థ టి20 క్రికెట‌ర్ల‌తో టెస్ట్ జ‌ట్టును నింపేశార‌ని అన్నారు. తెలివితక్కువ, ప్రమాదకరమైన ప్రయోగాలతో ఆట‌గాళ్ల ప్ర‌తిభ‌ను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశార‌ని విమ‌ర్శించారు. గౌతమ్ గంభీర్‌ను భారత టెస్ట్ క్రికెట్ హంతకుడిగా అభివ‌ర్ణించారు. క్రికెట్ కోచింగ్ ఆయ‌న‌కు స‌రిప‌డ‌ద‌ని, రాజ‌కీయాల్లోకి తిరిగి వెళ్లాల‌ని గంభీర్‌కు స‌ల‌హాయిచ్చారు. గంభీర్ తన అద్భుతమైన కోచింగ్, జ‌ట్టు కూర్పుతో 2027 సీజ‌న్‌లో ఇండియాను WTC ఫైనల్స్‌కు వెళ్ల‌కుండా చేస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు.స‌క్సెస్ రేటు డౌన్‌2016 నుంచి 2019 వ‌ర‌కు సొంత‌గ‌డ్డ‌పై టీమిండియా విజ‌యాల శాతం 79 కాగా, 2020 నుంచి 2024 వ‌ర‌కు 73 శాతం స‌క్సెస్ రేటు సాధించింద‌ని విన‌య్ కుమార్ గుర్తు చేశారు. 2024 అక్టోబ‌ర్ నుంచి ఇది 29 శాతానికి ప‌డిపోయింద‌ని వెల్ల‌డించారు. ఇంత‌టి ఘ‌న‌త సాధించిన గౌతమ్ గంభీర్‌కు ధన్యవాదాలు అంటూ సెటైర్ వేశారు.చ‌ద‌వండి: భార‌త్ టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోయింది13 నెల‌ల్లో ఆరుగురు..టీమిండియా టెస్ట్ టీమ్‌లో కీల‌క‌మైన‌ మూడో స్థానానికి స‌రైన ఆట‌గాడిని ఎంపిక చేయ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు. రాహుల్ ద్ర‌విడ్ 15 ఏళ్లు, ఛ‌తేశ్వ‌ర్ పుజారా పదేళ్ల పాటు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశార‌ని గుర్తు చేశారు. గంభీర్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత 13 నెల‌ల కాలంలోనే ఆరుగురిని మార్చార‌ని తెలిపారు. శుబ్‌మ‌న్ గిల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, క‌రుణ్ నాయ‌ర్, ప‌డిక్క‌ల్‌, కేఎల్ రాహుల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ల‌ను మూడో స్థానంలో ఆడించిన విష‌యాన్ని వెల్ల‌డించారు.I demand Bharat Ratna from Indian govt for Gautam Gambhir and Ajit Agarkar for these herculean achievements for Team India in just 1 year #IndvsSA pic.twitter.com/z5JpekDHFm— Vinay Kumar Dokania (@VinayDokania) November 26, 2025

Smriti Mandhana vs Palash Muchhal: Know Who Has Higher Net Worth8
స్మృతి వర్సెస్‌ పలాష్‌: ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన తరుణంలో అకస్మాత్తుగా స్మృతి తండ్రి ఆరోగ్యం చెడిపోయింది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి తన మేనేజర్‌తో మీడియాకు చెప్పించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చేరిన తర్వాత పలాష్‌ కూడా ఆస్పత్రి పాలు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత పలాష్‌ పేరిట ఓ అకౌంట్‌ నుంచి మేరీ డికోస్టా అనే అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌లు వెళ్లాయనేలా స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అయ్యాయి.మోసం చేశాడా?అందులో స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా మాట్లాడిన పలాష్‌.. డికోస్టాతో డేటింగ్‌ చేయడానికి ఉవ్విళ్లూరినట్లుగా అనిపించింది. అంతేకాదు.. స్మృతితో తనకు ‘లాంగ్‌ డిస్టేన్స్‌’ ఉందంటూ పలాష్‌.. సదరు అమ్మాయిని తనతో ఎంజాయ్‌ చేయాలని కోరినట్లుగా ఉన్న మెసేజ్‌లు వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో పలాష్‌ తన మాజీ ప్రేయసి బిర్వా షాకు ప్రపోజ్‌ చేసిన పాత రొమాంటిక్‌ వీడియోలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్‌.. స్మృతిని మోసం చేశాడని.. ఇది గుర్తించిన ఆమె తండ్రి అతడితో గొడవ పడే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడనే వదంతులు వ్యాపించాయి. అయితే, సోషల్‌ మీడియాలో స్మృతి- పలాష్‌ గురించి ఇంత రచ్చ జరుగుతున్నా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందనా లేదు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌.. అయినాఅంతేకాదు.. తాజా సమాచారం ప్రకారం స్మృతి తండ్రి సాంగ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయినప్పటికీ పెళ్లి గురించి మంధాన కుటుంబం గురించి ఎటువంటి స్పందన రాకపోవడం అనుమానాలు బలపడేలా చేసింది. ఇద్దరిలో ఎవరు ధనవంతులు?ఈ నేపథ్యంలో పలాష్‌.. అందం, కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఉన్న స్మృతిని ప్రేమ అనే మత్తులో ఉంచి ద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి నెట్‌వర్త్‌ ఎంత?.. ఇద్దరిలో ఎవరు ధనవంతులు? అన్న చర్చ నడుస్తోంది.టాప్‌ క్రికెట్‌ స్టార్‌ స్మృతిభారత మహిళా జట్టు వైస్‌ కెప్టెన్‌గా, మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు తొలి టైటిల్‌ అందించిన సారథిగా మంధానకు పేరుంది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 గెలవడంలోనూ ఆమెది కీలక పాత్ర. వెరసి స్మృతి బ్రాండ్‌ వాల్యూ మునుపటి కంటే భారీ స్థాయిలో పెరిగింది.భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కాంట్రాక్టులో ద్వారా ఆమెకు ఏటా రూ. 50 లక్షల వేతనం వస్తుంది. అదే విధంగా ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అదనంగా లభిస్తాయి.ఆమె నికర ఆస్తుల విలువ ఎంతంటే?ఇందుకు తోడు ఆర్సీబీ ప్రధాన ప్లేయర్‌గా, కెప్టెన్‌గా స్మృతికి రూ. 3.4 కోట్లు దక్కుతాయి. మహిళా క్రికెటర్లలో ఈ మేరకు అత్యధిక ధరకు ఒప్పందం కుదుర్చుకున్న అమ్మాయి మంధాననే. వీటితో పాటు బ్రాండ్‌ ప్రమోషన్స్‌, ప్రచారం ద్వారా కూడా స్మృతి రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి స్మృతి మంధాన నికర ఆస్తుల విలువ రూ. 32- 34 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా అంచనా. పలాష్‌ నెట్‌వర్త్‌ ఎంత?ఇక పలాష్‌ విషయానికొస్తే.. మ్యూజిక్‌ కంపోజర్‌గా, ఆల్బమ్స్‌ రూపకర్తగా అతడికి ఆదాయం వస్తోంది. అంతేకాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలాష్‌ అదనపు ఆదాయం గడిస్తున్నాడు. వీటితో పాటు లైవ్‌ షోలు, రాయల్టీల ద్వారా పలాష్‌కు భారీ మొత్తమే అందుతోంది. వెరసి 2025 నాటికి అతడి నెట్‌వర్త్‌ రూ. 20- 41 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా 2019 నుంచి స్మృతి- పలాష్‌ రిలేషన్‌లో ఉండగా.. గతేడాది తమ ప్రేమను ధ్రువీకరించారు. ఈ జంట నవంబరు 23న పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా అంతా గందరగోళంగా మారిపోయింది.చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

Guys: Bavuma Brings Up Bauna Row When Asked SA Coach Grovel Remark9
మా కోచ్‌ ఒక్కడేనా?.. వాళ్లూ హద్దు దాటారు: బవుమా కౌంటర్‌

సౌతాఫ్రికా కెప్టెన్‌గా తెంబా బవుమా (Temba Bavuma) మరో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు. పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో వైట్‌వాష్‌ చేసిన ప్రొటిస్‌ సారథిగా నిలిచాడు. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2025 టైటిల్‌ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది.సాష్టాంగపడేలా చేస్తాంగువాహటి వేదికగా రెండో టెస్టులో టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన తర్వాత సౌతాఫ్రికా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, అంతకంటే ముందు.. అంటే మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా సౌతాఫ్రికా హెడ్‌కోచ్‌ షుక్రి కాన్రాడ్‌ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాము ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి.. ఆఖరి రోజు టీమిండియాను సాష్టాంగపడేలా చేస్తామన్న అర్థంలో కాన్రాడ్‌ మాట్లాడాడు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (Anil Kumble), సౌతాఫ్రికా లెజెండరీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ (Dale Steyn) హుందాగా ఉండాలంటూ అతడికి హితవు పలికారు.కోచ్‌ కామెంట్స్‌పై బవుమా స్పందన ఇదేఈ నేపథ్యంలో భారీ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన బవుమాకు.. సౌతాఫ్రికా కోచ్‌ షుక్రి కాన్రాడ్‌ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మా కోచ్‌ మాట్లాడిన మాటల గురించి నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. నా దృష్టి మొత్తం మ్యాచ్‌ మీదే కేంద్రీకృతమై ఉంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు.అసలు ఆయనతో మాట్లాడే తీరికే దొరకలేదు. షుక్రి అరవై ఏళ్ల వయసుకు దగ్గరపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని బవుమా విమర్శించాడు.హద్దు మీరి ప్రవర్తించారుఅదే సమయంలో తనపై టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చేసిన వ్యాఖ్యలను కూడా బవుమా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘అయినా.. ఈ సిరీస్‌లో మా కోచ్‌ ఒక్కరే కాదు.. చాలా మంది ఆటగాళ్లు కూడా హద్దు మీరి ప్రవర్తించారు. అయితే, మా కోచ్‌ లైన్‌ క్రాస్‌ చేశారని నేను అనడం లేదు. కానీ ఆయన తన వ్యాఖ్యల గురించి మరోసారి ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నాడు.కాగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా బవుమా షాట్‌ గురించి రివ్యూ తీసుకునే విషయంలో బుమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు మరుగుజ్జు’ కదా అంటూ బవుమాను హేళన చేశాడు. ఇక కోల్‌కతాలో భారత్‌పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన సౌతాఫ్రికా.. గువాహటిలో 408 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది.చదవండి: ఇండియా టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోయింది.. ఫ్యాన్స్ ఫైర్‌

Blame Starts With Me BCCI Will Take Call: Gambhir Refuses Mince Words10
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్‌

స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్‌వాష్‌ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్‌ జట్టుకు టెస్టు సిరీస్‌ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్‌స్వీప్‌నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌, లెజెండరీ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్‌ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు సిరీస్‌ 2-2తో సమం చేసింది.చాంపియన్స్‌ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్‌ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్‌గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్‌లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్‌ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్‌ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్‌ కోచింగ్‌లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ 3-0తో వైట్‌వాష్‌ అయింది. తాజాగా కోల్‌కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్‌ అయి.. మరో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్‌ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్‌పై మండిపడ్డ కుంబ్లే, డేల్‌ స్టెయిన్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement