Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

New Zealand Survive Late Scare To Win By 9 Runs1
ఉత్కంఠ పోరు.. పోరాడి ఓడిన వెస్టిండీస్‌

వెస్టిండీస్‌-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టింది. నెల్సన్ వేదికగా నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో 9 పరుగుల తేడాతో విండీస్ ఓటమి పాలైంది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్‌ జట్టు 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.లక్ష్య చేధనలో వెస్టిండీస్‌ 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్, టెయిలాండర్‌ బ్యాటర్‌ స్ప్రింగర్‌ కివీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో తమ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే 19 ఓవర్‌లో ఆఖరి బంతికి స్ప్రింగర్‌(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) ఔట్‌ కావడంతో కివీస్‌ మ్యాచ్‌ మలుపు తిరిగింది. చివరి ఓవర్‌లో విండీస్‌ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. జామిసన్‌ కేవలం రెండు రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. షెపర్డ్(34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. బ్లాక్‌క్యాప్స్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ, ఇష్ సోధి చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. జామిసన్‌, బ్రెస్‌వెల్‌, శాంట్నర్‌ తలా వికెట్‌ సాధించారు.కాన్వే సూపర్‌ హాఫ్‌ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్‌ సెంచరీ సాధించగా.. మిచెల్‌(41), రవీంద్ర(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్‌ బౌలర్లలో ఫోర్డ్‌, హోల్డర్‌ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ విజయంతో కివీస్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 నెల్సన్ వేదికగా సోమవారం జరగనుంది.

Australia Enters Hong kong sixes 2025 tournment semi Final2
ఆస్ట్రేలియా విధ్వంసం.. 6 ఓవర్లలో 149 రన్స్‌

హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్న‌మెంట్‌లో ఆస్ట్రేలియా త‌మ జోరును కొన‌సాగిస్తోంది. శ‌నివారం మోంగ్‌కాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కంగారుల జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 149 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత ఓపెనర్ బెన్ మెక్‌డెర్మాట్ కేవలం 14 బంతుల్లో 8 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. సూపర్ సిక్సెస్ టోర్నీ నిబంధనల ప్రకారం 50 పరుగులు చేసిన బ్యాటర్ 'రిటైర్డ్ హర్ట్'గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక మెక్‌డెర్మాట్‌తో పాటు కెప్టెన్ అలెక్స్ రాస్ 11 బంతుల్లో 7 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ ఏడాది సూపర్ సిక్సెస్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు 20 సిక్స్‌లు బాదారు.తడబడిన బంగ్లా..అనంతరం బంగ్లాదేశ్ 150 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున అబు హైదర్ ఒంటరి పోరాటం చేశాడు. హైదర్ 18 బంతుల్లో 7 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో క్రిస్ గ్రీన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆదివారం తలపడనుంది.చదవండి: అత‌డు లేక‌పోవ‌డం కలిసొచ్చింది.. వారి వ‌ల్లే చెల‌రేగుతున్నాను: అభిషేక్‌

Rahul Radesh steers Hyderabad with gritty knock against Rajasthan 3
రాణించిన రాహుల్‌.. హైదరాబాద్‌ స్కోరెంతంటే?

ఓపెనర్ల వైఫల్యంతో శుభారంభం కరువైన హైదరాబాద్‌ను మిడిలార్డర్‌ బ్యాటర్లు రాహుల్‌ రాదేశ్, కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ అర్ధ శతకాలతో ఆదుకున్నారు. రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’లో సొంతగడ్డపై రాజస్తాన్‌తో శనివారం మొదలైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టులో ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (6), అభిరథ్‌ రెడ్డి (9) నిరాశపరిచారు. దీంతో 21 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయింది.ఈ దశలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ హిమతేజ (68 బంతుల్లో 39; 6 ఫోర్లు)తో జతకలిసిన కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత రాజస్తాన్‌ బౌలింగ్‌పై అవలీలగా పరుగులు సాధించడంతో తొలి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. రెండో సెషన్‌ మొదలయ్యాక సాఫీగా సాగిపోతున్న ఈ జోడీని రాహుల్‌ చహర్‌ విడగొట్టాడు. జట్టు స్కోరు 101 వద్ద హిమతేజను అవుట్‌ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వరుణ్‌ గౌడ్‌ అండతో రాహుల్‌ (84 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.కానీ కాసేపటికే అతను కూడా పెవిలియన్‌ చేరాడు. స్వల్ప వ్యవధిలో వరుణ్‌ (23; 2 ఫోర్లు) వికెట్‌ పారేసుకోవడంతో 150 పరుగుల వద్ద హైదరాబాద్‌ జట్టు ఐదో వికెట్‌ను కోల్పోయింది. రెండో సెషన్‌లో సగం వికెట్లను కోల్పోయిన జట్టును రాహుల్‌ రాదేశ్‌ ఆదుకున్నాడు. రోహిత్‌ రాయుడు (86 బంతుల్లో 47; 4 ఫోర్లు) కుదురుగా ఆడటంతో ఆరో వికెట్‌కు 117 పరుగులు జోడించాడు. అర్ధసెంచరీకి చేరువైన రోహిత్‌ నిష్కమ్రించగా, రాహుల్‌ రాదేశ్‌ నిలకడను ప్రదర్శించి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే దశలో సీవీ మిలింద్‌ (14; 2 ఫోర్లు) రూపంలో హైదరాబాద్‌ ఏడో వికెట్‌ను కోల్పోయినప్పటికీ తొలి రోజు ఆటలో సంతృప్తికర స్థాయిలో పరుగులు సాధించింది. రాజస్తాన్‌ బౌలర్లలో అనికేత్, అశోక్‌ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. ఆకాశ్, రాహుల్‌ చహర్, సచిన్‌ యాదవ్‌లకు తల ఒక వికెట్‌ దక్కింది.

Badminton icon Tai Tzu-ying announces her retirement4
రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌..

మహిళల బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న చైనీస్‌ తైపీ స్టార్‌ తై జు–యింగ్‌ (టీటీవై) తన కెరీర్‌ను ముగించింది. గత ఏడాది కాలంగా వరుస గాయాలతో బాధపడుతున్న ఆమె 31 ఏళ్ల వయసులో ఆటనుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించింది.‘జీవితంలో అన్నీ ఇచ్చినందుకు బ్యాడ్మింటన్‌కు కృతజ్ఞతలు. ఒక అద్భుత అధ్యాయం ముగింపునకు వచి్చంది. నా గాయాలే నన్ను ఆటనుంచి తప్పుకునేలా చేశాయి. వరుసగా శస్త్ర చికిత్సలు, రీహాబిలిటేషన్‌ బాగా ఇబ్బంది పెట్టాయి. భవిష్యత్తు గురించి నిర్ణయించుకోలేదు కానీ ప్రస్తుతానికి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. టీటీవై అందరికీ గుర్తుండిపోవాలని ఆశిస్తున్నా’ అని రిటైర్మెంట్‌ ప్రకటనలో తై జు వెల్లడించింది. ఘనమైన రికార్డులు... తైజు సుదీర్ఘ కెరీర్‌లో ప్రతిష్టాత్మక విజయాలన్నీ ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం, కాంస్యంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో 4 స్వర్ణాలు, కాంస్యం ఆమె ఖాతాలో ఉన్నాయి.2009లో ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకొని తొలిసారి గుర్తింపులోకి వచ్చిన తై జు ఆ తర్వాత సీనియర్‌ స్థాయిలో వరుస విజయాలతో శిఖరానికి చేరింది. రికార్డు స్థాయిలో నాలుగు సార్లు బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఈ తైవాన్‌ షట్లర్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీని 3 సార్లు గెలుచుకుంది.కెరీర్‌లో 17 బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ టైటిల్స్‌ గెలిచిన ఆమె మరో 12 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 22 ఏళ్ల వయసులో తొలి సారి వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న తై జు ఓవరాల్‌గా 214 వారాల పాటు అగ్రస్థానాన నిలవడం విశేషం.

Abhishek Sharma reveals planning behind Player of the Series show in Australia5
'అత‌డు లేక‌పోవ‌డం కలిసొచ్చింది.. వారి వ‌ల్లే చెల‌రేగుతున్నాను'

బ్రిస్బేన్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టీ20 వర్షార్ఫణమైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ పంజాబీ క్రికెటర్ మొత్తంగా 161.39 స్ట్రైక్ రేటుతో 163 ప‌రుగులు చేశాడు. అంతేకాకుండా అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగుల మార్క్ అందుకున్న క్రికెట‌ర్‌గా అభిషేక్(528) నిలిచాడు."ఆ్రస్టేలియా పర్యటన కోసం చాలా కాలంగా ఎదురు చూశాను. ఇక్కడ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అక్కడి పరిస్ధితులకు తగ్గట్టుగా నేను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. మేము మరింత భారీ స్కోర్లు సాధించాల్సింది. అయితే జట్టు సిరీస్‌ గెలవడం ముఖ్యం. జోష్ హేజిల్‌వుడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోవడం ఏ జట్టుకైనా ప్రయోజనకరమే. కానీ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా అటువంటి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇక టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. నేను వరుసగా 15 మ్యాచ్‌లలో డకౌట్‌ అయినా నా స్థానానికి ఢోకా ఉండదని చెప్పింది. అందుకే తొలి బంతినుంచే ధైర్యంగా, దూకుడుగా ఆడగలుగుతున్నా. తొలిసారి టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో అభిషేక్ పేర్కొన్నాడు. చదవండి: ‘బంగభూషణ్‌’ రిచా ఘోష్‌

The fifth T20 match was abandoned midway due to rain and india won the series 6
మ్యాచ్‌ రద్దు... మన ఖాతాలో సిరీస్‌

బ్రిస్బేన్‌: వర్షంతో మొదలైన భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్‌ చివరకు వర్షంతోనే ముగిసింది. శనివారం ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌ వాన కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన వర్షం ఎంతకీ తగ్గలేదు. దాంతో చివరకు ఆటను అంపైర్లు రద్దు చేయక తప్పలేదు. ఆడింది 29 బంతులే అయినా ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (13 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (16 బంతుల్లో 29 నాటౌట్‌; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో అభిషేక్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. తొలి ఓవర్లోనే 5 పరుగుల వద్ద అతను ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ వదిలేయగా, 11 పరుగుల వద్ద మరో క్యాచ్‌ను డ్వార్‌షుయిస్‌ అందుకోలేకపోయాడు. మరో వైపు డ్వార్‌షుయిస్‌ ఓవర్లోనే 4 ఫోర్లు బాది గిల్‌ ధాటిని చూపించాడు. 161.38 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 163 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. సిరీస్‌ తొలి మ్యాచ్‌ రద్దు కాగా, మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో పోరులో ఆసీస్‌ గెలిచింది. ఆ తర్వాత హోబర్ట్, కరారాలలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పైచేయి సాధించిన భారత్‌ చివరకు 2–1తో సిరీస్‌ సొంతం చేసుకుంది. భారత్‌ తమ తర్వాతి పోరులో సొంతగడ్డపై నవంబర్‌ 14 నుంచి జరిగే టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగనుండగా... నవంబర్‌ 21 నుంచి ఇంగ్లండ్‌తో ‘యాషెస్‌’లో ఆసీస్‌ తలపడుతుంది. ‘తొలి మ్యాచ్‌ ఓడిన తర్వాత కోలుకొని గెలిపించిన జట్టు సభ్యులకు అభినందనలు. ప్రతీ ఒక్కరికి తమ బాధ్యతపై స్పష్టత ఉంది. పేసర్లు, స్పిన్నర్లు అంతా సమష్టిగా రాణించారు. దాని వల్లే మేం అనుకున్న ప్రణాళికలను సమర్థంగా అమలు చేయగలిగాం. ప్రపంచ కప్‌ కోసం సిద్ధంగా ఉన్న ఎంతో మంది ప్లేయర్లు మా జట్టులో ఉండటం చాలా మంచి విషయం. వరల్డ్‌ కప్‌కు ముందు ఉన్న 2–3 సిరీస్‌లు సన్నాహకంగా ఉపయోగపడతాయి. జట్టులోని ప్రతీ ఒక్కరికి తమదైన ప్రత్యేక ప్రతిభ ఉండటం కెపె్టన్‌గా నా అదృష్టం. బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గత కొన్ని నెలలుగా మంచి ఫలితాలు సాధించగలిగాం. ఎలాంటి లోపాలు లేవని చెప్పను. ఎందుకంటే నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది’ –సూర్యకుమార్‌ యాదవ్, భారత కెప్టెన్ 528 ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో అత్యంత వేగంగా (528 బంతుల్లో) 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అభిషేక్‌ నిలిచాడు.

Indian cricketer Richa Ghosh honoured by Bengal government7
‘బంగభూషణ్‌’ రిచా ఘోష్‌

కోల్‌కతా: మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ను భారత జట్టు తొలిసారి గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ను బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శనివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) అధ్యక్షుడు, భారత మాజీ కెపె్టన్‌ సౌరవ్‌ గంగూలీ, మాజీ ప్లేయర్‌ జులన్‌ గోస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగాల్‌ రాష్ట్ర అత్యుత్తమ పౌర పురస్కారం ‘బంగభూషణ్‌’ను రిచాకు అందిస్తున్నట్లు ప్రకటించిన మమతా బెనర్జీ దీనికి సంబంధించిన మెడల్‌ను అందజేశారు. దీంతో పాటు బెంగాల్‌ పోలీస్‌ శాఖలో రిచాను డిప్యూటీ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)గా నియమిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వరల్డ్‌ కప్‌లో 133.52 స్ట్రయిక్‌ రేట్‌తో 235 పరుగులు సాధించిన రిచా...ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉన్న తొలి బెంగాల్‌ క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. రిచాపై ప్రశంసల వర్షం కురిపించిన గంగూలీ భవిష్యత్తులోనూ ఆమె ఇదే జోరును కొనసాగించడంతో పాటు మున్ముందు భారత కెప్టెన్‌ కూడా కావాలని ఆశీర్వదించారు. ‘క్యాబ్‌’ తరఫున రిచాకు బంగారు తాపడంతో చేసిన ఒక ప్రత్యేక బ్యాట్‌ను బహుకరించడంతో పాటు రూ.34 లక్షల నగదు పురస్కారాన్ని అందించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రిచా 34 పరుగులు సాధించగా, ఆమె చేసిన ఒక్కో పరుగుకు ఒక్కో లక్ష చొప్పున ఈ బహుమతిని ఇస్తున్నట్లు ‘క్యాబ్‌’ ప్రకటించింది. మరో వైపు గంగూలీ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి అధ్యక్షుడవుతారని, అందుకు అన్ని విధాలా ఆయన అర్హుడని మమతా బెనర్జీ ఆకాంక్షించారు.

World Champion Dommaraju Gukesh loses in World Cup Chess8
గుకేశ్‌ నిష్క్రమణ

పనాజీ (గోవా): ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ ప్రపంచ కప్‌ చెస్‌లో ముందంజ వేయడంలో విఫలమయ్యాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లోనే అతను నిష్క్రమించాడు. జర్మనీకి చెందిన ఫ్రెడరిక్‌ స్వేన్‌ 1.5–0.5 తేడాతో గుకేశ్‌ను ఓడించాడు. నల్ల పావులతో తొలి గేమ్‌ను డ్రా చేసుకొని రెండో గేమ్‌లో విజయం కోసం బరిలోకి దిగిన గుకేశ్‌కు నిరాశాజనక ఫలితం ఎదురైంది. స్వేన్‌ ఒత్తిడిని అధిగమించి 55 ఎత్తుల్లో గెలుపొందాడు. ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్‌ ఇరిగేశి, పెంటేల హరికృష్ణ, ప్రజ్ఞానంద, ప్రణవ్‌ నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్‌లో ప్రజ్ఞానంద 42 ఎత్తుల్లో ఆర్మేనియాకు చెందిన రాబర్ట్‌ హావ్‌హనిసన్‌పై గెలుపొందాడు. షంశుద్దీన్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన పోరులో తొలి గేమ్‌ను గెలుచుకున్న అర్జున్‌ రెండో గేమ్‌లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా గేమ్‌ను డ్రాగా ముగించి 1.5–0.5తో ముందంజ వేశాడు. తర్వాతి పోరులో పీటర్‌ లెకో (హంగేరీ)తో అర్జున్‌ తలపడతాడు. డానియెల్‌ డార్దా (బెల్జియం)తో జరిగిన మూడో రౌండ్‌లో తొలి గేమ్‌ను గెలుచున్న హరికృష్ణ తర్వాతి గేమ్‌ను డ్రా చేసుకొని నాలుగో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మరో వైపు ఈ టోర్నీలో అత్యధిక సీడింగ్‌ ఉన్న విదేశీ ఆటగాడు అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) కూడా నిష్క్ర మించాడు. రష్యాకు చెందిన అలెగ్జాండర్‌ డాన్‌చెన్‌కో 47 ఎత్తుల్లో అనీశ్‌ను చిత్తు చేశాడు. తమ మూడో రౌండ్‌లో తొలి గేమ్‌లను డ్రాలుగా ముగించిన విదిత్‌ గుజరాతీ, కార్తీక్‌ వెంకటరామన్, జీఎం నారాయణన్‌ ఆదివారం టైబ్రేక్‌ రౌండ్‌ ఆడతారు.

Hanuma Vihari continues his century streak in the Ranji Trophy9
విహారి అజేయ శతకం

అగర్తలా: త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి శతకాల జోరు కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘సి’లో బెంగాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వీరోచిత శతకంతో త్రిపురకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కట్టబెట్టిన విహారి తాజాగా అస్సాంపై కూడా అజేయ సెంచరీతో కదం తొక్కాడు. టాస్‌ నెగ్గిన అస్సాం ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఓపెనర్లు హృతురాజ్‌ రాయ్‌ (5), కాసేపటికే బిక్రమ్‌కుమార్‌ దాస్‌ (22; 3 ఫోర్లు) వికెట్లను కోల్పోయిన త్రిపురకు విహారి (215 బంతుల్లో 143 బ్యాటింగ్‌; 17 ఫోర్లు, 1 సిక్స్‌) ఆపద్భాంధవుడయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శ్రీదమ్‌ పాల్‌ (38; 7 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. మూడో వికెట్‌కు 68 పరుగులు జతయ్యాక శ్రీదమ్‌ అవుటయ్యాడు. తర్వాత సెంటు సర్కార్‌ (145 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో త్రిపుర ఇన్నింగ్స్‌ను దుర్బేధ్యంగా మలిచాడు. ఇద్దరు దాదాపు రెండు సెషన్ల పాటు క్రీజులో నిలిచి పరుగులు సాధించారు. దీంతో అస్సామ్‌ బౌలర్లు ఈ జోడీని విడగొట్టేందుకు అలసిసొలసి పోయారు. ఇదే క్రమంలో విహారి సెంచరీ పూర్తి చేసుకోగా, సెంటు సర్కార్‌ కూడా శతకదారిలో పడ్డాడు. జట్టు స్కోరు 300 పరుగులు దాటిన తర్వాత దురదృష్టవశాత్తూ సెంటు సర్కార్‌ 6 పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దీంతో 210 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. ఆట నిలిచే సమయానికి విహారి, రాణా దత్త (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అస్సాం బౌలర్లలో దర్శన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఢిల్లీని కూల్చేసిన ఆఖిబ్‌ నబి న్యూఢిల్లీ: జమ్మూ కశీ్మర్‌ సీమర్‌ ఆఖిబ్‌ నబి (16–5–35–5) ఢిల్లీ గడ్డపై ఢిల్లీ జట్టును బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సొంతగడ్డపై ఢిల్లీని తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 70 ఓవర్లయిన ఆడకుండా కూల్చేశాడు. గ్రూప్‌ ‘డి’ పోరులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ అర్పిత్‌ రాణా (0)ను నబి డకౌట్‌ చేయడంతో మొదలైన ఢిల్లీ పతనం 14 పరుగులకే 3 టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. సనత్‌ (12)ను వంశజ్, యశ్‌ ధుల్‌ (1)ను సునీల్‌ అవుట్‌ చేశారు. ఈ దశలో కెపె్టన్‌ ఆయుశ్‌ బదోని (64; 6 ఫోర్లు), ఆయుశ్‌ డొసెజా (65; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సుమిత్‌ మాథ్యూర్‌ (55 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ తర్వాత బ్యాటర్లు అనుజ్‌ (0), హృతిక్‌ (7), మనన్‌ (0), సిమర్‌జీత్‌ (0), మోని గ్రేవల్‌ (0) చేతులెత్తేయడంతో ఢిల్లీ కుప్పకూలేందకు ఎంతో సమయం పట్టనే లేదు. కశ్మీరి బౌలర్లలో వంశజ్‌ శర్మ, అబిద్‌ ముస్తాక్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. శతక్కొట్టిన ముషీర్, సిద్ధేశ్‌ ముంబై: ఓపెనర్‌ ముషీర్‌ ఖాన్‌ (162 బంతుల్లో 112; 14 ఫోర్లు), మిడిలార్డర్‌లో సిద్దేశ్‌ లాడ్‌ (207 బంతుల్లో 100 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలతో కదంతొక్కడంతో ముంబై కోలుకుంది. గ్రూప్‌ ‘డి’లో హిమాచల్‌ ప్రదేశ్‌తో మొదలైన ఈ మ్యాచ్‌లో కేవలం ఈ ఇద్దరు సెంచరీ వీరులే తప్ప మిగతా బ్యాటర్లు కనీస స్కోర్లయిన చేయలేకపోయారు. మొదటి రోజు ఆట నిలిచే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే (9), భారత వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే (2), హిమాన్షు సింగ్‌ (0), ముషీర్‌ సోదరుడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (16) బ్యాట్లెత్తారు. దీంతో ముంబై తొలి సెషన్‌లో 73 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. సిద్దేశ్‌తో ఆకాశ్‌ ఆనంద్‌ (26 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.

Saim Ayub fifty, Abrar 4-fer lead Pakistan to series win over South Africa10
సౌతాఫ్రికాను చిత్తు చేసిన పాకిస్తాన్‌

ఫైసలాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్‌ సొంతం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ కైవం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రోటీస్ జట్టుతో జరిగిన ఐదు వన్డే సిరీస్‌లలో పాక్‌కు ఇది నాలుగో విజయం.అబ్రార్‌ మ్యాజిక్‌..ఇక నిర్ణయాత్మక వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 37.5 ఓవర్లలో కేవలం 143 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అహ్మద్‌ తన పది ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిది, సల్మాన్‌ అఘా, మహ్మద్‌ నవాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.ప్రోటీస్‌ బ్యాటర్లలో ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (72), ప్రిటోరియస్ (57) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 25.1 ఓవర్లలో చేధించింది. పాక్‌ ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌(77) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతో పాక్‌ కైవసం చేసుకుంది.చదవండి: టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement