Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Indian Test Cricket Died in Guwahati Team India Fans Enraged On Social Media1
'భార‌త్ టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోయింది'

''టీమిండియాను సొంత‌గ‌డ్డ‌పై ఓడించలేర‌ని ఒక‌ప్పుడు అంటుండేవారు. కానీ ఇప్పుడు ఏ జట్టు అయినా భారత్‌లో భారత్‌ను ఓడించగలదు'' అంటూ ఇండియా క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియా నిర్వేదం వ్య‌క్తం చేస్తున్నారు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఘోరంగా ఓడిపోవ‌డంతో టీమిండియా ల‌వ‌ర్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌నీన పోరాట ప‌టిమ లేకుండా ప్ర‌త్య‌ర్థికి దాసోహ‌మ‌వ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. మరీ ముఖ్యంగా సొంతగ‌డ్డ‌పై టీమిండియా భారీ ఓట‌మి అభిమానుల‌ను మరింత కుంగ‌దీసింది.అన్ని విభాగాల్లో పైచేయి సాధించి టీమిండియాను సొంత గ‌డ్డ‌పై ఓడించిన ద‌క్షిణాఫ్రికాపై క్రీడాభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. పాతికేళ్ల త‌ర్వాత భార‌త గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెల‌వ‌డ‌మే కాకుండా, వైట్‌వాష్ చేయ‌డంతో సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వుమాను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఈ విజ‌యానికి స‌ఫారీలు అన్నివిధాలా అర్హుల‌ని కితాబిస్తున్నారు. ఇక, భార‌త్ ఘోర వైఫ‌ల్యానికి హెచ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ ప్ర‌ధాన కార‌కుడ‌ని టీమిండియా ఫ్యాన్స్‌ నిందిస్తున్నారు. భార‌త‌ టెస్టు క్రికెట్‌ను నాశ‌నం చేశాడ‌ని ఫైర్ అవుతున్నారు.టీమిండియా ఓటమిపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. గువాహ‌టిలో ఇండియ‌న్ టెస్టు క్రికెట్ ఈరోజు చ‌నిపోయిందంటూ ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ఒక‌ప్పుడు సొంత గ‌డ్డ‌పై భార‌త జ‌ట్టుతో క్రికెట్ ఆడ‌టానికి ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు భ‌య‌ప‌డేవ‌ని, కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు తారుమారు అయ్యాయ‌ని వాపోతున్నారు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, ఛ‌తేశ్వ‌ర్ పుజారా, అశ్విన్ లాంటి ఆట‌గాళ్లు ఉన్న‌ప్పుడు టీమిండియాకు సొంత‌గ‌డ్డ‌పై ఓట‌మి అనేది ఊహ‌ల్లోకి కూడా వ‌చ్చేది కాద‌ని పేర్కొంటున్నారు. #INDvSA India in India pic.twitter.com/6PG6ylLI4aSouth Africa won Test series against India in India after 25 Years ! #IndvsSA Gautam Gambhir 👌 pic.twitter.com/o32exDqwhd— Nitin.nn (@NitinthisSide_) November 26, 2025— ARMSB 🇮🇳 (@armsb_in) November 26, 2025 They came,They saw,And Destroyed Indian Test Team 😆Once upon a time, India was undefeated on their home soil, but now any team can beat India in India 🤪- Who is responsible for India's Decline ?#IndianCricket pic.twitter.com/U2LfPOYsR9— Ankit Sharma (@AnkitsharmaINC) November 26, 2025

Its Little Disappointing Credit to Opposition: Pant Reacts To Loss Vs SA2
అందుకే ఓడిపోయాం.. ఓటమి కాస్త నిరాశపరిచింది: పంత్‌

సొంతగడ్డపై టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత జట్టు చేదు ఫలితం చవిచూసింది. గువాహటిలో సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 408 పరుగుల భారీ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఓటమిపై స్పందించాడు. ‘‘కాస్త నిరాశకు లోనయ్యాం. జట్టుగా మేము సమిష్టిగా రాణించి ఉండాల్సింది. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రెడిట్‌ ఇవ్వకతప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.సిరీస్‌ ఆరంభం నుంచే సౌతాఫ్రికా ఆధిపత్యం కనబరిచింది. మేము ఓడిపోయాం. ఇప్పటికైనా స్పష్టమైన ఆలోచనా విధానం, వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మాకిది గుణపాఠంగా నిలిచిపోతుంది.ఏదేమైనా మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. వాల్లు అద్భుతంగా ఆడి సిరీస్‌ గెలుచుకున్నారు. క్రికెట్‌లో జట్టుగా భాగస్వామ్యాలు నెలకొల్పడం ముఖ్యం. మా విషయంలో అది లోపించింది. అందుకే సిరీస్‌ రూపంలో భారీ మూల్యమే చెల్లించాము. ఇక ముందైనా సరైన ప్రణాళిక, వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని పంత్‌ పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ సౌతాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. కోల్‌కతాలో తొలి టెస్టులో 30 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన భారత్‌.. తొలిసారి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఫలితంగా ఇరవై ఐదేళ్ల తర్వాత సౌతాఫ్రికా తొలిసారి టెస్టుల్లో టీమిండియాను వైట్‌వాష్‌ చేసింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో ఈ ఘనత సాధించింది.ఇక గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ గాయం వల్ల దూరం కాగా.. పంత్‌ పగ్గాలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా పంత్‌ (7, 13) తీవ్రంగా నిరాశపరచగా.. ఆఖరి రోజైన బుధవారం నాటి ఆటలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (54) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారి నుంచి అతడికి కాస్తైనా సహకారం లభిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకోవచ్చనే ఆశలను ప్రొటిస్‌ బౌలర్లు అడియాసలు చేశారు.ఇక సఫారీ స్పిన్నర్లలో సైమన్‌ హార్మర్‌ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. కేశవ్‌ మహరాజ్‌ రెండు, సెనూరన్‌ ముత్తుస్వామి ఒక వికెట్‌ తీశారు. పేసర్‌ మార్కో యాన్సెన్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా యాన్సెన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి భారత్‌ను 201 పరుగులకు ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. హార్మర్‌ (మొత్తంగా 27 వికెట్లు)కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కింది.

IND vs SA 2nd Test: South Africa Beat India By 408 Runs Whitewashed3
టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ఇలా!

ఊహించిందే జరిగింది.. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA) 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. కనీస పోరాట పటిమ కూడా కనబరచకుండా ‘స్టార్‌’ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టడం భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సొంతగడ్డపై ఇంతటి భారీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) -2025 విజేత సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ తాజా సైకిల్‌లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు భారత్‌కు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఇరుజట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ప్రొటిస్‌ జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది.ఆది నుంచే ఆధిపత్యంఅనంతరం భారత్‌- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్‌ గెలిచిన సఫారీలు ఆది నుంచే ఆధిపత్యం కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన ప్రొటిస్‌ జట్టు.. అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్‌ చేసింది. పేసర్‌ మార్కో యాన్సెన్‌ ఆరు వికెట్లతో సత్తా చాటి.. సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు.549 పరుగుల లక్ష్యంఆ తర్వాత టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడించకుండా తామే మళ్లీ బ్యాటింగ్‌ చేసిన సఫారీలు.. నాలుగో రోజు ఆఖరి సెషన్‌ వరకు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయలేదు. నెమ్మదిగా ఆడుతూనే 78.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన తర్వాత ప్రొటిస్‌ జట్టు తమ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి.. టీమిండియాకు 549 పరుగుల (288+260) భారీ లక్ష్యాన్ని విధించింది.రెండో ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (94) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. టోనీ డి జోర్జీ (49) తృటిలో అర్ధ శతంక చేజార్చుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (13)ను యాన్సెన్‌ వెనక్కి పంపగా.. కేఎల్‌ రాహుల్‌ (6)ను సైమన్‌ హార్మర్‌ అవుట్‌ చేశాడు. దీంతో మంగళవారం నాటి నాలుగోరోజు ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు చేసింది.హార్మర్‌ విజృంభణఈ క్రమంలో 27/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాకు సఫారీ స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ చుక్కలు చూపించాడు. నైట్‌ వాచ్‌మన్‌ కుల్దీప్‌ యాదవ్‌ (5)ను సైమన్‌ బౌల్డ్‌ చేయగా.. పట్టుదలగా క్రీజులో నిలబడ్డ సాయి సుదర్శన్‌ (139 బంతుల్లో 14)ను సెనూరన్‌ ముత్తుస్వామి వెనక్కి పంపాడు.ఆ తర్వాత సైమన్‌ హార్మర్‌ తన వికెట్ల వేటను వేగవంతం చేశాడు. ధ్రువ్‌ జురెల్‌ (2), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (13), వాషింగ్టన్‌ సుందర్‌ (16), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (0)లను అవుట్‌ చేసి.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. లాంఛనం పూర్తి చేసిన మహరాజ్‌ఇక పట్టుదలగా నిలబడ్డ రవీంద్ర జడేజా అర్ధ శతక వీరుడు (87 బంతుల్లో 54)ను వెనక్కి పంపిన మరో స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌.. మొహమ్మద్‌ సిరాజ్‌ (0) ఆఖరి వికెట్‌గా వెనక్కి పంపి టీమిండియా ఓటమిని ఖరారు చేశాడు. మొత్తంగా సైమన్‌ హార్మర్‌ ఆరు వికెట్లతో చెలరేగగా.. కేశవ్‌ మహరాజ్‌ రెండు, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ యాన్సెన్‌, ముత్తుస్వామి చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక సమిష్టి కృషితో ఆద్యంతం అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా పాతికేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడమే కాదు..వైట్‌వాష్‌ చేసింది కూడా!! భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా: 489 & 260/5 డిక్లేర్డ్‌భారత్‌: 201 & 140ఫలితం: 408 పరుగుల తేడాతో భారత్‌పై సౌతాఫ్రికా గెలుపుచదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్‌పై మండిపడ్డ కుంబ్లే, డేల్‌ స్టెయిన్‌

India vs South Africa Day 5: Sai Sudharsan super slow batting4
సాయి సుద‌ర్శ‌న్.. సూప‌ర్‌ స్లో బ్యాటింగ్‌!

ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (Sai Sudharsan) ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కాపాడుకునేందుకు చాలాసేపు క్రీజులో పాతుకుపోయాడు. సఫారీల ప‌దునైన‌ బంతుల‌ను ఎదుర్కొనేందుకు బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. వికెట్ ప‌డ‌కుండా ఉండేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించి విజ‌య‌వంతం కాలేక‌పోయాడు. ముత్తుసామి బౌలింగ్‌లో మార్క్‌ర‌మ్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా అవుట‌య్యాడు.27/2 ఓవ‌ర్‌నైట్‌ స్కోరుతో చివ‌రి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ముందు 31 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మ‌రో మూడు వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ యాద‌వ్ (5), ధ్రువ్ జురేల్‌(2), రిష‌బ్ పంత్‌(13) స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరిగాడు.మ‌రో ఎండ్‌లో సాయి సుద‌ర్శ‌న్ మాత్రం క్రీజులో పాతుకు పోయాడు. 2 ప‌రుగుల‌తో చివ‌రి రోజు ఆట మొద‌లు పెట్టిన ఈ ఎడంచేతి వాటం బ్యాట‌ర్ ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో సఫారీ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. ప‌రుగులు రాబ‌ట్ట‌క‌పోయినా వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్ర‌మంలో ఈ సిరీస్‌లో అత్య‌ధిక బంతులు ఎదుర్కొన్న‌ భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు. 139 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్‌తో 14 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీన్ని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది సాయి ఎంత స్లోగా ఆడాడో. మ్యాచ్ ఎలాగూ ఓడిపోతాం కాబ‌ట్టి.. వికెట్లు ప‌డ‌కుండా ఉంటే డ్రా అవుతుంద‌న్న ఉద్దేశంతో అత‌డు ఇలా బ్యాటింగ్ చేశాడ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. టీమిండియా చిత్తుమ్యాచ్ విష‌యానికి వ‌స్తే టీమిండియా 408 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో 549 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్ 140 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. అర్ధ సెంచ‌రీతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన ర‌వీంద్ర జ‌డేజా (Ravindra Jadeja) 9వ‌ వికెట్‌గా వెనుదిరిగాడు. జ‌డేజా 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 54 ప‌రుగులు చేసి కేశ‌వ మ‌హ‌రాజ్ బౌలింగ్‌లో అవుట‌య్యాడు.చ‌ద‌వండి: ద‌క్షిణాఫ్రికా కోచ్‌పై మండిప‌డ్డ దిగ్గ‌జాలు

Dont use Those words: Kumble Steyn Slams SA Coach Controversial Comments5
కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్‌పై మండిపడ్డ దిగ్గజాలు

స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో మరో ఘోర పరాభవం ఎదుర్కోవడానికి సిద్ధపడింది. గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా (IND vs SA Tests) చేతిలోనూ అదే చేదు ఫలితం పొందనుంది. గువాహటి వేదికగా ప్రొటిస్‌ జట్టు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంత్‌ సేన తడబడింది.భారీ ఆధిక్యం లభించినా..బర్సపరా స్టేడియంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు చేసింది. నిజానికి నాలుగో రోజు భారీ ఆధిక్యం లభించినా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడంలో ప్రొటిస్‌ జట్టు ఆలస్యం చేసింది. ఆఖరి రోజు వరకు టీమిండియాను తిప్పలుపెట్టాలనే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సాష్టాంగపడేలా చేస్తాంఈ విషయం గురించి సౌతాఫ్రికా హెడ్‌కోచ్‌ షుక్రి కాన్రాడ్‌ మాట్లాడుతూ.. టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత జట్టును మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి.. ఆఖరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేయడం కోసమే ఇలా చేశాము.వాళ్లు బ్యాటింగ్‌ చేయాలి. ఫలితం మాకు అనుకూలంగా రావాలి. ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివరికి మాదే పైచేయి అవుతుంది’’ అంటూ అవమానకరంగా మాట్లాడాడు.కాస్త హుందాగా ఉండండిఈ నేపథ్యంలో షుక్రి కాన్రాడ్‌ వ్యాఖ్యలపై భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే, సౌతాఫ్రికా లెజెండరీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ మండిపడ్డారు. అనిల్‌ కుంబ్లే స్పందిస్తూ.. ‘‘యాభై ఏళ్ల క్రితం అప్పటి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ వెస్టిండీస్‌ జట్టును ఉద్దేశించి ఇలాంటి మాటలే మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.విండీస్‌ అగ్రస్థానానికి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. సౌతాఫ్రికా ఇప్పుడు చారిత్రాత్మక సిరీస్‌ గెలిచేందుకు చేరువైంది. నిజానికి మీదే పైచేయిగా ఉన్నపుడు.. మీరు మాట్లాడే మాటలు కూడా అంతే హుందాగా ఉండాలి. కోచ్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇలా ఎవరైనా మాట్లాడతారా?ఇక ప్రొటిస్‌ మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఇదే విషయంపై స్పందించాడు. ‘‘ఇది అసలు ఎలాంటి మాట? నిజానికి ఈ విషయంపై స్పందించాలని కూడా నేను అనుకోవడం లేదు. ఇదొక అసందర్భ ప్రేలాపన. సౌతాఫ్రికా టీమిండియాపై ఆధిపత్యం సాధించింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇలాంటి మాటలను నేను అస్సలు సమర్థించను’’ అంటూ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో స్టెయిన్‌ ఫైర్‌ అయ్యాడు.ఓటమి అంచున టీమిండియాఇదిలా ఉంటే.. గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఓటమికి చేరువైంది. టీ బ్రేక్‌ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 90 పరుగులే చేసింది. విరామం తర్వాత టీమిండియా మరింత కష్టాల్లో కూరుకుపోయింది. 56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి 440 పరుగులు అవసరం కాగా.. సౌతాఫ్రికా కేవలం నాలుగు వికెట్లు తీస్తే సిరీస్‌ సొంతం చేసుకోగలదు. ఇప్పటికే కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా టీమిండియాపై 30 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?

FIDE World Cup 2025 Final Goes To Tiebreaks6
విజేత తేలేది టైబ్రేక్‌లోనే...

పనాజీ: పురుషుల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ కొత్త విజేత ఎవరో నేడు తేలనుంది. సిందరోవ్‌ జవోఖిర్‌ (ఉజ్బెకిస్తాన్‌), వె యి (చైనా) మధ్య ఫైనల్‌ మ్యాచ్‌లోని నిర్ణీత రెండు క్లాసిక్‌ గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా వీరిద్దరి మధ్య నేడు టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. సిందరోవ్, వె యి మధ్య మంగళవారం జరిగిన రెండో గేమ్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అంతకుముందు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) ముఖ్య అతిథిగా విచ్చేసి రెండో గేమ్‌ను ప్రారంభించింది. టైబ్రేక్‌ జరిగేది ఇలా... సిందరోవ్, వె యి మధ్య నేడు ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు నిర్వహిస్తారు. ఇందులో ఫలితం తేలకపోతే 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లను ఆడిస్తారు. ఇక్కడా ఫలితం రాకపోతే 5 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లను నిర్వహిస్తారు. అయినా విజేత తేలకపోతే 3 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడిస్తారు. ఇక్కడా స్కోరు సమమైతే ఇద్దరి మధ్య ‘సడన్‌ డెత్‌’ గేమ్‌ నిర్వహిస్తారు. ఒకవేళ ‘సడెన్‌ డెత్‌’ గేమ్‌ కూడా ‘డ్రా’ అయితే నల్లపావులతో ఆడిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు. మరోవైపు రష్యా గ్రాండ్‌మాస్టర్‌ ఆండ్రీ ఎసిపెంకో (Andrey Esipenko) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నొదిర్‌బెక్‌ యాకుబొయేవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన పోటీలో ఎసిపెంకో 2–0తో గెలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోరీ్నకి అర్హత సాధించాడు. నొదిర్‌బెక్‌తో సోమవారం జరిగిన తొలి గేమ్‌లో 38 ఎత్తుల్లో గెలిచిన ఎసిపెంకో... మంగళవారం జరిగిన రెండో గేమ్‌లో 26 ఎత్తుల్లో విజయం సాధించాడు. చ‌ద‌వండి: ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్‌- పాకిస్థాన్ టి20 మ్యాచ్‌

Mushtaq Ali Domestic T20 Tournament from today7
ధనాధన్‌ ధమాకా

హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రపంచం మొత్తం కన్నేసే ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల కంట... వేలం పంట పండించుకునేందుకు యువ ఆటగాళ్లకు చక్కని అవకాశమిది. నేటి నుంచి జరిగే దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మెరుపులు మెరిపించేందుకు భారత కుర్రాళ్లు సై అంటున్నారు. కుర్రాళ్లతో పోటీ పడేందుకు, తిరిగి టీమిండియా తరఫున పునరాగమనం చేసేందుకు భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా సన్నద్ధమవుతున్నాడు. ఇతనొక్కడే కాదు... మరో 74 రోజుల్లోనే ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి, సంజూ సామ్సన్, శార్దుల్‌ ఠాకూర్‌లతో పాటు తెరమరుగైన పృథ్వీ షా కూడా ముస్తాక్‌ అలీ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు. బరోడా బలం పాండ్యా హార్దిక్‌ పాండ్యా ఆసియా కప్‌ సందర్భంగా కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో టైటిల్‌ గెలిచిన సూర్యకుమార్‌ జట్టులో లేడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న ఈ ఆల్‌రౌండర్‌ ఫామ్‌పై ఎవరికి ఏ అనుమానాలు లేకపోయినా... భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వబోయే టి20 మెగా ఈవెంట్‌కు మధ్యలో ఉన్నది ఒకే ఒక్క టి20 సిరీస్‌ దక్షిణాఫ్రికాతో డిసెంబర్‌ 9న మొదలవుతుంది. దీంతో ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు హార్దిక్‌కు ఈ టోర్నీ కీలకంగా మారింది. అతనింకా బరోడా జట్టుతో చేరకపోయినప్పటికీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగానే ఉన్నట్లు కోచ్‌ ముకుంద్‌ పర్మార్‌ వెల్లడించారు. ముంబై తరఫున సూర్యకుమార్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లన్నీ ఆడేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. సహచరుడు శివమ్‌ దూబే సైతం ముంబైకి సై అంటున్నాడు. అయితే డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైకి శార్దుల్‌ ఠాకూర్‌ సారథ్యం వహిస్తున్నాడు. ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి తమిళనాడు కెప్టెన్‌గా, సంజూ సామ్సన్‌ కేరళ కెప్టెన్‌గా తమ జట్లను నడిపించనున్నారు.ఐపీఎల్‌పైనే వృథ్వీ ఆశలుఐపీఎల్‌ సహా టీమిండియా తరఫున ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా ఫామ్‌ లేమి, ఫిట్‌నెస్, ప్రవర్తన సరళి బాగోలేక జాతీయ జట్టుతో పాటు సొంత ముంబై జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మహారాష్ట్ర తరఫున రంజీలాడుతున్న పృథ్వీ... టీమిండియా బెర్త్‌ సంగతి దేవుడెరుగు ముందు ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కంటపడితే చాలనే ఆశతో ముస్తాక్‌ అలీ టోర్నీలో మెరిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. నేటి నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో వేదికల్లో ఈ దేశవాళీ టి20 టోర్నీ జరుగుతుంది. ఏ గ్రూప్‌లో ఎవరున్నారంటే...గ్రూప్‌ ‘ఎ’ (8): ఆంధ్ర, అస్సాం, ఛత్తీస్‌గఢ్, కేరళ, ముంబై, ఒడిశా, రైల్వేస్, విదర్భ. గ్రూప్‌ ‘బి’ (8): హైదరాబాద్, బిహార్, చండీగఢ్, గోవా, జమ్మూ కశీ్మర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌. గ్రూప్‌ ‘సి’ (8): బరోడా, బెంగాల్, గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, పంజాబ్, సర్వీసెస్‌. గ్రూప్‌ ‘డి’ (8): ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, రాజస్తాన్, సౌరాష్ట్ర, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌. టోర్నీ జరిగేదిలా... మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 8 జట్లకు చోటు కల్పించారు. గ్రూప్‌లోని ఒక జట్టు మిగతా ఏడు జట్లతో ఒక్కోసారి తలపడుతుంది. గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక... నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (8) ‘సూపర్‌ లీగ్‌’ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్‌ లీగ్‌కు అర్హత పొందిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్‌ ‘ఎ’లో 4 జట్లు... గ్రూప్‌ ‘బి’లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్‌ లీగ్‌’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్‌ ‘ఎ’ విజేత... గ్రూప్‌ ‘బి’ విజేత ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మ్యాచ్‌లు ఎక్కడంటే... గ్రూప్‌ దశ లీగ్‌ మ్యాచ్‌లు దేశంలోని నాలుగు వేదికల్లో జరుగుతాయి. గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లను లక్నోలో... గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లను కోల్‌కతాలో... గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లను హైదరా బాద్‌లో... గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు. ‘సూపర్‌ లీగ్‌’ మ్యాచ్‌లకు, ఫైనల్‌ మ్యాచ్‌కు ఇండోర్‌ ఆతిథ్యమిస్తుంది. గ్రూప్‌ దశ లీగ్‌ మ్యాచ్‌లు డిసెంబర్‌ 10వ తేదీ వరకు జరుగుతాయి. ‘సూపర్‌ లీగ్‌’ మ్యాచ్‌లు డిసెంబర్‌ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తారు. ఫైనల్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 18న జరుగుతుంది.

Indias number one shuttler Lakshya Sen comments on Austalian Open8
కొన్ని మార్చుకున్నా... ఇంకొన్ని నేర్చుకున్నా!

న్యూఢిల్లీ: వైఫల్యాలను అధిగమించేందుకు నేర్చుకున్న పాఠాలు, మార్చుకున్న ఆటతీరే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టైటిల్‌ విజయానికి కారణమని భారత నంబర్‌వన్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ అన్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ వైఫల్యం తన గుండెను బద్దలు చేసిందని, తన ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసిందని... దీంతో శారీరక ఫిట్‌నెస్, మానసిక స్థైర్యంపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని 24 ఏళ్ల ఈ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ చెప్పాడు. ‘పారిస్‌’లో కాంస్య పతకం కోసం గట్టిగానే పోరాడినా... చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకెదురైన అనుభవాలు, ఆటలో లక్ష్యాలు లక్ష్య సేన్‌ మాటల్లోనే... ఫలితాలు పక్కనబెట్టి... నాకెదురైన చేదు అనుభవాలు నాలోని స్ఫూర్తిని కొరవడేలా చేశాయి. దీంతో నా పంథా మార్చుకున్నా. ఫలితాల కోసం కాదు... ముందు ఆటతీరును మెరుగు పర్చుకోవడం కోసమే ఆడటం మొదలుపెట్టాను. దీంతో ఈ సీజన్‌లో టైటిల్స్‌లో వెనుకబడినప్పటికీ ఆటలో మార్పు, ఫిట్‌నెస్‌లో మెరుగుదల, మానసిక బలం అన్ని సానుకూలంగా మలచుకున్నాను. ఇవే తాజా విజయానికి కారణం. పోటీ పెరిగింది బ్యాడ్మింటన్‌లో పోటీ బాగా పెరిగింది. ఎంతో మంది మేటి షట్లర్లు వస్తున్నారు. నిలకడగా రాణిస్తున్నారు. మనం కూడా దీటుగా తయారు కావాలి. అదే ఉత్సాహంతో ఆటను కొనసాగించాలి. వచ్చే ఏడాది మాకెంతో కీలకం. రెగ్యులర్‌ ఈవెంట్లతో పాటు అంతర్జాతీయ టోర్నీలున్నాయి. ఫిట్‌నెస్, నిలకడ ఎంతో ముఖ్యం. అయితే ప్రస్తుతానికి ఒక్కో టోర్నీ ఆడటంపైనే దృష్టి పెట్టాను. వైవిధ్యం చూపించాల్సిందే సీనియర్‌ సర్క్యూట్‌లోకి వచ్చి మూణ్నాలుగేళ్లవుతోంది. ప్రత్యర్థులకు మన ఆట ఏంటో ఈ పాటికే అర్థమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైవిధ్యం చూపించాల్సిందే. నా కోచ్‌ యూ యంగ్‌ సాంగ్‌ కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాడు. ఫిట్‌నెస్‌తో చురుకుదనం, షాట్ల వైవిధ్యంతో ఆటతీరు నన్ను మేటిగా మార్చుతుంది. అందుకే ఇప్పుడు ఒకప్పటిలా కాకుండా కొత్తగా ఆడేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నా. పూర్తి వైవిధ్యమైన ఆటతీరును కనబరచడంపైనే ఉత్సాహంగా ఉన్నా.

India heading for defeat in second Test9
మరో పరాభవం పిలుస్తోంది!

పుష్కర కాలం పాటు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ ఓడిపోని జట్టు ఇప్పుడు 12 నెలల వ్యవధిలో రెండో సిరీస్‌ పరాజయానికి చేరువైంది. స్వదేశీ పిచ్‌లపై పరుగుల వరద పారించి ప్రత్యర్థికి సవాల్‌ విసిరే టీమ్‌ ఇప్పుడు సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో పరువు కోసం పోరాడుతోంది. టెస్టులో చివరి రోజు ఒక్కో బంతి గండంలా కనిపిస్తుంటే... మ్యాచ్‌ను కాపాడుకునేందుకు విదేశీ జట్లు పడిన పాట్లు ఎన్నో చూశాం. ఇప్పుడు మన జట్టు సరిగ్గా అలాగే కనిపిస్తోంది. అవతలి వైపు బౌలర్లు చెలరేగిపోతుంటే ఎనిమిది వికెట్లతో రోజంతా నిలిచి బేలగా ‘డ్రా’ కోసం ఆడాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏ రకంగానూ సాధ్యం కాదు కాబట్టి సిరీస్‌ ఓటమి అనేది ఖాయమైపోయింది. ఇక తేడా 0–1తోనా లేక 0–2తోనే అని తేలడమే మిగిలింది! ఏదైనా అద్భుతం జరిగి ఓటమి నుంచి తప్పించుకుంటారేమో అనే ఆశ ఉన్నా... ఈ సిరీస్‌లో భారత్‌ ఆట చూస్తే అలాంటి నమ్మకం కూడా కనిపించడం లేదు. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ భారత్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 549 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (13), కేఎల్‌ రాహుల్‌ (6) అవుట్‌ కాగా... ప్రస్తుతం సాయి సుదర్శన్‌ (2 బ్యాటింగ్‌), కుల్దీప్‌ యాదవ్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఆఖరి రోజు భారత్‌ మరో 522 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 26/0తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 78.3 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (180 బంతుల్లో 94; 9 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... టోనీ జోర్జి (68 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. భారత బౌలర్లలో జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మంగళవారం ఆటలో జడేజాకు వికెట్లు దక్కిన తీరు, ఆ తర్వాత హార్మర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ బౌల్డ్‌ అయిన బంతిని చూస్తే చివరి రోజు పిచ్‌పై అనూహ్యమైన టర్న్‌ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో మన బ్యాటర్లు రోజంతా నిలవడం కూడా అసాధ్యం కావచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితిని బట్టి 80 ఓవర్ల ఆట మాత్రమే జరిగే అవకాశం ఉంది. కీలక భాగస్వామ్యాలు... ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం ఉన్నా... దక్షిణాఫ్రికా వేగంగా ఆడి డిక్లేర్‌ చేసే ప్రయత్నం చేయలేదు. సాధారణ టెస్టు ఇన్నింగ్స్‌ తరహాలోనే బ్యాటర్లు పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు జోడించారు. ఫలితంగా ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్లు రికెల్టన్‌ (64 బంతుల్లో 35; 4 ఫోర్లు), మార్క్‌రమ్‌ (84 బంతుల్లో 29; 3 ఫోర్లు)లను తక్కువ వ్యవధిలో వెనక్కి పంపించగా, బవుమా (3)ను సుందర్‌ లెగ్‌ స్లిప్‌ ఉచ్చులో పడేశాడు. అయితే స్టబ్స్, జోర్జి కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం 27 ఓవర్ల పాటు సాగింది. 129 బంతుల్లో స్టబ్స్‌ అర్ధ సెంచరీని చేరుకోగా, జడేజా బౌలింగ్‌లో స్వీప్‌ చేసే ప్రయత్నంలో జోర్జి అర్ధసెంచరీ కోల్పోయాడు. లంచ్‌ విరామ సమయానికే దక్షిణాఫ్రికా ఆధిక్యం 508 పరుగులకు చేరింది. అయినా సరే ఆ జట్టు డిక్లేర్‌ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విరామం తర్వాత స్టబ్స్‌ జోరు పెంచాడు. తాను ఆడిన తర్వాతి 24 బంతుల్లో 34 పరుగులు రాబట్టిన అతను సెంచరీకి చేరువయ్యాడు. అయితే జడేజా ఓవర్లో సిక్స్‌ బాది 94కు చేరిన అతను మరో సిక్స్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. దాంతో బవుమా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. అదే తడబాటు... రెండో ఇన్నింగ్స్‌ను జైస్వాల్‌ కొంత ధాటిగా మొదలు పెట్టినా, రాహుల్‌ వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిచ్చాడు. అయితే మరోసారి యాన్సెన్‌ చక్కటి బంతితో జైస్వాల్‌ను అవుట్‌ చేసి పతనానికి శ్రీకారం చుట్టగా... హార్మర్‌ స్పిన్‌కు రాహుల్‌ స్టంప్‌ కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన భారత బ్యాటర్‌ కుల్దీప్‌ ఈసారి కూడా డిఫెన్స్‌ ఆడే పాత్రను పోషిస్తూ 22 బంతులు సమర్థంగా ఎదుర్కొన్నాడు. సాయి, కుల్దీప్‌ కలిసి 39 బంతులు ఆడి మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు. దక్షిణాఫ్రికా ఆలస్యంగా డిక్లేర్‌ చేసినట్లు అనిపించినా... జట్టు తీసిన 2 వికెట్లు వారి నిర్ణయాన్ని సరైందిగా నిరూపించాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 489; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) సిరాజ్‌ (బి) జడేజా 35; మార్క్‌రమ్‌ (బి) జడేజా 29; స్టబ్స్‌ (బి) జడేజా 94; బవుమా (సి) నితీశ్‌ (బి) సుందర్‌ 3; జోర్జి (ఎల్బీ) (బి) జడేజా 49; ముల్డర్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (78.3 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్‌) 260. వికెట్ల పతనం: 1–59, 2–74, 3–77, 4–178, 5–260. బౌలింగ్‌: బుమ్రా 6–0–22–0, సిరాజ్‌ 5–1–19–0, జడేజా 28.3–3–62–4, కుల్దీప్‌ 12–0–48–0, సుందర్‌ 22–2–67–1, జైస్వాల్‌ 1–0–9–0, నితీశ్‌ రెడ్డి 4–0–24–0. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) వెరీన్‌ (బి) యాన్సెన్‌ 13; రాహుల్‌ (బి) హార్మర్‌ 6; సుదర్శన్‌ (బ్యాటింగ్‌) 2; కుల్దీప్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 27. వికెట్ల పతనం: 1–17, 2–21. బౌలింగ్‌: యాన్సెన్‌ 5–2–14–1, ముల్డర్‌ 4–1–6–0, హార్మర్‌ 3.5–2–1–1, మహరాజ్‌ 3–1–5–0.

2026 T20 World Cup tournament schedule released10
ఫిబ్రవరి 15న పాక్‌తో భారత్‌ పోరు

ముంబై: భారత్, పాకిస్తాన్‌ మధ్య మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టోర్నీలో పోరుకు రంగం సిద్ధమైంది. 2026 టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వరల్డ్‌ కప్‌ ముగుస్తుంది. ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ చైర్మన్‌ జై షా విడుదల చేశారు. డిఫెండింగ్‌ చాంపియన్, ఆతిథ్య జట్టు హోదాలో భారత్‌ ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే టోర్నీ తొలి పోరులో అమెరికాతో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో... ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్‌ లీగ్‌ దశను ముగిస్తుంది. గత టోర్నీ తరహాలోనే మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, అమెరికాతో పాటు నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. లీగ్‌ దశ తర్వాత తమ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు తర్వాతి దశ ‘సూపర్‌–8’కు అర్హత సాధిస్తాయి. ‘సూపర్‌–8’కు చేరిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్‌–8’ మ్యాచ్‌ల తర్వాత రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 3న తొలి సెమీఫైనల్‌... మార్చి 5న రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. మార్చి 8న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఎనిమిది వేదికలు ఖరారు... టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలలో మ్యాచ్‌లు నిర్వహించనుండగా... శ్రీలంకలో కొలంబో (ప్రేమదాస), కొలంబో (ఎస్‌ఎస్‌సీ), పల్లెకెలెలను వేదికలుగా నిర్ణయించారు. గతంలోనే ఐసీసీ స్పష్టం చేసినట్లుగా పాక్‌ జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు కోల్‌కతా, ముంబై వేదికలు కాగా... ఒకవేళ పాక్‌ సెమీస్‌ చేరితే ఆ జట్టు తమ సెమీఫైనల్‌ను కోల్‌కతాలో కాకుండా కొలంబోలోనే ఆడుతుంది. పాక్‌ ఫైనల్‌ చేరినా ఇదే వర్తిస్తుంది. భారత్, పాక్‌ ఏ దశలో తలపడినా...ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహిస్తారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ... భారత మాజీ కెప్టెన్, 2 టి20 ప్రపంచకప్‌ల విజేత రోహిత్‌ శర్మను ఐసీసీ 2026 టి20 వరల్డ్‌ కప్‌ ప్రచారకర్తగా నియమించింది. తన కొత్త పాత్ర పట్ల రోహిత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలో ఇలా ఎవరినీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించలేదని తెలిసింది. నాకు దక్కిన ఈ గౌరవం పట్ల ఆనందంగా ఉన్నా. 9 వరల్డ్‌ కప్‌లు ఆడిన తర్వాత ఆటగాడిగా మైదానంలో కాకుండా ప్రేక్షకుడిగా భారత్‌ ఆడే టి20 మ్యాచ్‌లను చూడటం కొత్తగా అనిపించడం ఖాయం’ అని రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కార్యదర్శి దేవజిత్‌ సైకియా, ఐసీసీ సీఈఓ సంజోగ్‌ గుప్తా, భారత టి20 జట్టు కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్, భారత మహిళల జట్టు కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాల్గొన్నారు.గ్రూప్‌ల వివరాలు గ్రూప్‌ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా. గ్రూప్‌ ‘బి’: ఆ్రస్టేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్‌. గ్రూప్‌ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.గ్రూప్‌ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement