Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sultan Azlan Shah Cup 2025: India Beat Malaysia Highlights1
భారత్‌ను గెలిపించిన సంజయ్‌

సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇపో వేదికగా బుధవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్‌ తేడాతో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. కొరియాపై తొలి మ్యాచ్‌లో 1–0తో నెగ్గిన భారత్‌... బెల్జింయతో జరిగిన రెండో మ్యాచ్‌లో 2–3తో ఓడిపోయింది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరఫున సెల్వం కార్తీ (7వ నిమిషంలో), సుఖ్‌జీత్‌ సింగ్‌ (21వ నిమిషంలో), అమిత్‌ రోహిదాస్‌ (39వ నిమిషంలో), కెప్టెన్‌ సంజయ్‌ (53వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగామలేసియా జట్టుకు ఫైజల్‌ సారి (13వ నిమిషంలో), ఫిత్రి సారి (36వ నిమిషంలో), మర్హాన్‌ జలీల్‌ (45వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. మ్యాచ్‌ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా సంజయ్‌ గోల్‌ చేసి భారత్‌ను 4–3తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఈ ఏడు నిమిషాలు భారత రక్షణపంక్తి మలేసియా ఆటగాళ్లను నిలువరించి ఈ టోర్నీలో రెండో విజయాన్ని ఖాయం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు, రెండు పెనాల్టీ స్ట్రోక్‌లు లభించాయి. నాలుగు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని... రెండు పెనాల్టీ స్ట్రోక్‌లలో ఒక దానిని భారత్‌ సద్వినియోగం చేసుకుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్‌ మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండింటిలో గెలిచి, ఒక దాంట్లో ఓడిపోయి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక గురువారం జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది.

Kerala Sanju Samson 51 Rohan Kunnummal 121 Script SMAT History2
సంజూ శాంసన్‌ ధనాధన్‌.. రోహన్‌ విధ్వంసకర సెంచరీ

దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 సీజన్‌లో కేరళ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపింది. ఎలైట్‌ గ్రూప్‌-‘ఎ’లో భాగంగా ఒడిషా (Kerala Vs Odisha)తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఒడిషా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్వస్తిక్‌ సమాల్‌ (14 బంతుల్లో 20), గౌరవ్‌ చౌదరి (15 బంతుల్లో 29) మెరుగ్గా రాణించారు.176 పరుగులుమిగతా వారిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సుభ్రాంషు నేనాపతి (15) నిరాశపరచగా.. కెప్టెన్‌ సమంత్రయ్‌ (41 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు. అతడికి తోడుగా సంబిత్‌ ఎస్‌ బరాల్‌ (32 బంతుల్లో 40) రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఒడిషా ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. కేరళ బౌలర్లలో నిధీశ్‌ నాలుగు వికెట్లు తీయగా.. ఆసిఫ్‌ రెండు, అంకిత్‌ శర్మ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌండరీల వర్షంఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళకు ఓపెనర్లు కెప్టెన్‌ సంజూ శాంసన్‌, రోహన్‌ కణ్ణుమ్మల్‌ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆది నుంచే ఒడిషా బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు. సంజూ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 51 పరుగులు సాధించాడు.సంజూ ధనాధన్‌.. రోహన్‌ విధ్వంసకర సెంచరీమరోవైపు.. రోహన్‌ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 121 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ, రోహన్‌ అజేయంగా నిలవడంతో 16.3 ఓవర్లలోనే కేరళ వికెట్‌ నష్టపోకుండా 177 పరుగులు సాధించి జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ఓపెనింగ్‌ జంటగా సంజూ శాంసన్‌, రోహన్‌ కణ్ణుమ్మల్‌ రికార్డు సాధించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కావాల్సినంత ప్రాక్టీస్‌కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే జట్టులో మరోసారి సంజూకు చోటివ్వలేదు సెలక్టర్లు. ఇక దేశీ టీ20 టోర్నీలో ప్రదర్శన ఆధారంగానైనా టీ20 జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌-2026కు సన్నద్ధమయ్యే క్రమంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్‌ దొరకనుంది.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం

South Africa Creates World Record 1st Team To Achieve Historic Feat3
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు

భారత గడ్డపై సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు సత్తా చాటింది. స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌ చేసింది. ఇరవై ఐదేళ్ల క్రితం నాటి ఫలితాన్ని పునరావృతం చేసి రెండోసారి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా ఓ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)-2025 ఫైనల్లో విజేతగా నిలిచి ఐసీసీ ‘గద’ను గెలుచుకున్న సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ తాజా సీజన్‌లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఆసియాలో ఈ ఏడాది తొలుత పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న సఫారీలు.. అనూహ్య రీతిలో టీమిండియాను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేశారు.408 పరుగుల భారీ తేడాతోరెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో భారత్‌పై గెలిచిన సౌతాఫ్రికా.. గువాహటిలో చరిత్ర సృష్టించింది. తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన బర్సపరా స్టేడియంలో ఆద్యంత ఆధిపత్యం కనబరిచి.. టీమిండియా (IND vs SA 2nd Test)ను ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.తొలి జట్టుగా చరిత్ర తద్వారా ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సౌతాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో భారత్‌పై 400 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. గతంలో ఆస్ట్రేలియా నాగ్‌పూర్‌ వేదికగా టీమిండియాపై 342 పరుగుల తేడాతో గెలవగా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది.కాగా టీమిండియాను వైట్‌వాష్‌ చేయడంలో సౌతాఫ్రికా బౌలర్లది కీలక పాత్ర. పేసర్‌ మార్కో యాన్సెన్‌ (Marco Jansen) రెండో టెస్టులో సత్తా చాటి ప్లేయర్‌గా నిలవగా.. సఫారీ పేసర్‌ సైమన్‌ హార్మర్‌ రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 17 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత జట్టుకు ఘోర పరాజయాలు (పరుగుల పరంగా)🏏సౌతాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో ఓటమి- 2025, గువాహటి🏏ఆస్ట్రేలియా చేతిలో 342 పరుగుల తేడాతో ఓటమి- 2008, నాగ్‌పూర్‌🏏పాకిస్తాన్‌ చేతిలో 341 పరుగుల తేడాతో ఓటమి- 2006, కరాచి🏏ఆస్ట్రేలియా చేతిలో 337 పరుగుల తేడాతో ఓటమి- 2007, మెల్‌బోర్న్‌🏏ఆస్ట్రేలియా చేతిలో 333 పరుగుల తేడాతో ఓటమి- 2017, పూణె.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: బర్సపరా స్టేడియం, గువాహటి👉టాస్‌: సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్‌👉సౌతాఫ్రికా స్కోర్లు: 489 &260/5 డిక్లేర్డ్‌👉భారత్‌ స్కోర్లు: 201 &140👉ఫలితం: 408 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపు.. సిరీస్‌ 2-0తో వైట్‌వాష్‌.చదవండి: సీఎస్‌కే బ్యాటర్‌ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే..

Smriti Mandhana vs Palash Muchhal: Know Who Has Higher Net Worth4
స్మృతి వర్సెస్‌ పలాష్‌: ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన తరుణంలో అకస్మాత్తుగా స్మృతి తండ్రి ఆరోగ్యం చెడిపోయింది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి తన మేనేజర్‌తో మీడియాకు చెప్పించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనేక సందేహాలకు తావిచ్చాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చేరిన తర్వాత పలాష్‌ కూడా ఆస్పత్రి పాలు కావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత పలాష్‌ పేరిట ఓ అకౌంట్‌ నుంచి మేరీ డికోస్టా అనే అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్‌లు వెళ్లాయనేలా స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అయ్యాయి.మోసం చేశాడా?అందులో స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా మాట్లాడిన పలాష్‌.. డికోస్టాతో డేటింగ్‌ చేయడానికి ఉవ్విళ్లూరినట్లుగా అనిపించింది. అంతేకాదు.. స్మృతితో తనకు ‘లాంగ్‌ డిస్టేన్స్‌’ ఉందంటూ పలాష్‌.. సదరు అమ్మాయిని తనతో ఎంజాయ్‌ చేయాలని కోరినట్లుగా ఉన్న మెసేజ్‌లు వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో పలాష్‌ తన మాజీ ప్రేయసి బిర్వా షాకు ప్రపోజ్‌ చేసిన పాత రొమాంటిక్‌ వీడియోలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్‌.. స్మృతిని మోసం చేశాడని.. ఇది గుర్తించిన ఆమె తండ్రి అతడితో గొడవ పడే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడనే వదంతులు వ్యాపించాయి. అయితే, సోషల్‌ మీడియాలో స్మృతి- పలాష్‌ గురించి ఇంత రచ్చ జరుగుతున్నా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందనా లేదు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌.. అయినాఅంతేకాదు.. తాజా సమాచారం ప్రకారం స్మృతి తండ్రి సాంగ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయినప్పటికీ పెళ్లి గురించి మంధాన కుటుంబం గురించి ఎటువంటి స్పందన రాకపోవడం అనుమానాలు బలపడేలా చేసింది. ఇద్దరిలో ఎవరు ధనవంతులు?ఈ నేపథ్యంలో పలాష్‌.. అందం, కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఉన్న స్మృతిని ప్రేమ అనే మత్తులో ఉంచి ద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి నెట్‌వర్త్‌ ఎంత?.. ఇద్దరిలో ఎవరు ధనవంతులు? అన్న చర్చ నడుస్తోంది.టాప్‌ క్రికెట్‌ స్టార్‌ స్మృతిభారత మహిళా జట్టు వైస్‌ కెప్టెన్‌గా, మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు తొలి టైటిల్‌ అందించిన సారథిగా మంధానకు పేరుంది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 గెలవడంలోనూ ఆమెది కీలక పాత్ర. వెరసి స్మృతి బ్రాండ్‌ వాల్యూ మునుపటి కంటే భారీ స్థాయిలో పెరిగింది.భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కాంట్రాక్టులో ద్వారా ఆమెకు ఏటా రూ. 50 లక్షల వేతనం వస్తుంది. అదే విధంగా ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అదనంగా లభిస్తాయి.ఆమె నికర ఆస్తుల విలువ ఎంతంటే?ఇందుకు తోడు ఆర్సీబీ ప్రధాన ప్లేయర్‌గా, కెప్టెన్‌గా స్మృతికి రూ. 3.4 కోట్లు దక్కుతాయి. మహిళా క్రికెటర్లలో ఈ మేరకు అత్యధిక ధరకు ఒప్పందం కుదుర్చుకున్న అమ్మాయి మంధాననే. వీటితో పాటు బ్రాండ్‌ ప్రమోషన్స్‌, ప్రచారం ద్వారా కూడా స్మృతి రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 నాటికి స్మృతి మంధాన నికర ఆస్తుల విలువ రూ. 32- 34 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా అంచనా. పలాష్‌ నెట్‌వర్త్‌ ఎంత?ఇక పలాష్‌ విషయానికొస్తే.. మ్యూజిక్‌ కంపోజర్‌గా, ఆల్బమ్స్‌ రూపకర్తగా అతడికి ఆదాయం వస్తోంది. అంతేకాదు.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలాష్‌ అదనపు ఆదాయం గడిస్తున్నాడు. వీటితో పాటు లైవ్‌ షోలు, రాయల్టీల ద్వారా పలాష్‌కు భారీ మొత్తమే అందుతోంది. వెరసి 2025 నాటికి అతడి నెట్‌వర్త్‌ రూ. 20- 41 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా 2019 నుంచి స్మృతి- పలాష్‌ రిలేషన్‌లో ఉండగా.. గతేడాది తమ ప్రేమను ధ్రువీకరించారు. ఈ జంట నవంబరు 23న పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా అంతా గందరగోళంగా మారిపోయింది.చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

Womens Premier League mega auction today5
WPL 2026 Auction: వరల్డ్‌కప్‌ స్టార్స్‌పైనే దృష్టి

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 సీజన్‌ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా గురువారం ఈ ప్రక్రియ సాగనుంది. మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాలు ఖాళీ ఉండగా... వీటి కోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో 52 మంది క్యాప్డ్‌ (జాతీయ జట్టుకు ఆడినవారు) ప్లేయర్లు కాగా... 142 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు. ఇక విదేశాల నుంచి 83 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 66 మది క్యాప్డ్‌ ప్లేయర్లు... 17 మంది అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు ఉన్నారు. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. » ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ చేజిక్కించుకున్న భారత ప్లేయర్లకు వేలంలో భారీ డిమాండ్‌ ఉండే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచిన టీమిండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడొచ్చు. గతంలో యూపీ వారియర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దీప్తిని వేలంలో ఎవరు దక్కించుకుంటారో చూడాలి. దీప్తితో పాటు రేణుక సింగ్, సోఫీ డివైన్, అమెలియా కెర్‌ (న్యూజిలాండ్‌), ఎకిల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), అలీసా హీలీ, మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా), వాల్‌వర్ట్‌ (దక్షిణాఫ్రికా) మార్క్యూ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. » వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులోని క్రాంతి గౌడ్, శ్రీ చరణి, హర్లీన్‌ డియోల్, ప్రతీక రావల్‌కు కూడా భారీ ధర దక్కే అవకాశాలున్నాయి. స్నేహ్‌ రాణా, పూజ వస్త్రకర్, ఉమా ఛెత్రీ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు. విదేశీ ప్లేయర్ల జాబితాలో డిక్లెర్క్, లిచ్‌ఫీల్డ్, అలానా కింగ్‌ కూడా ఉన్నారు. » 5 ఫ్రాంచైజీలు కలిసి ఈ వేలంలో రూ. 41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అందులో అత్యధికంగా యూపీ వారియర్స్‌ దగ్గర 14.5 కోట్లు ఉన్నాయి. వేలానికి ముందు ఆ జట్టు కేవలం ఒక్క ప్లేయర్‌ను మాత్రమే రీటైన్‌ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద అతి తక్కువగా రూ. 5.70 కోట్లు ఉన్నాయి. ఢిల్లీతో పాటు ముంబై ఇండియన్స్‌ జట్లు వేలానికి ముందు ఐదుగురు ప్లేయర్లను రీటైన్‌ చేసుకున్నాయి. దీంతో వేలంలో ఈ రెండు జట్లకు ‘రైట్‌ టు మ్యాచ్‌‘ అవకాశం లేదు. వేలంలో నలుగురు అసోసియేట్‌ ఆటగాళ్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తీర్థ సతీశ్, ఇషా ఓజా (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌), తారా నోరిస్‌ (అమెరికా), థిపట్చా పుథవాంగ్‌ (థాయ్‌లాండ్‌) వేలం బరిలో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి డబ్ల్యూపీఎల్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

No one will marry her: How people taunted Once Smriti Mandhana father6
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!

జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్‌గా, వైస్‌ కెప్టెన్‌గా మహిళా క్రికెట్‌పై ఆమె ముద్ర ప్రత్యేక​ం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్‌ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్‌ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.తొమ్మిదేళ్ల వయసులోఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్‌-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్‌-19 టీమ్‌ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్‌గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా అవార్డు అందుకుంది.వరల్డ్‌కప్‌ చాంపియన్‌గాభారత జట్టు వైస్‌ కెప్టెన్‌ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిచింది. అయితే, క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.సగటు భారతీయ తండ్రిఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి 15 షోలో స్పందించింది. హోస్ట్‌ అమితాబ్‌ బచ్చన్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్‌.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్‌ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్‌ ఆడేదాన్ని.అన్న నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్‌ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్‌ చేస్తూ లెఫ్టాండర్‌గా మారిపోయా.అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్‌ పర్సన్‌ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్‌ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్‌గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్‌-19 స్థాయిలో లిస్ట్‌-ఎ మ్యాచ్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌ స్మృతి.ఉన్నత శిఖరాలకుఇక మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి టైటిల్‌ అందించిన కెప్టెన్‌. కెరీర్‌ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.మనసిచ్చిన ప్రియుడు పలాష్‌ ముచ్చల్‌తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్‌ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.ఊహించని విధంగా.. ఇప్పుడిలాఏదేమైనా క్రికెటర్‌ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?

Ronaldo Cleared to play opening matches at FIFA World Cup 20267
FIFA WC 2026: రొనాల్డోకు గుడ్‌న్యూస్‌

జెనీవా: పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) వచ్చే ఏడాది జరగనున్న ‘ఫిఫా’ ప్రపంచకప్‌ (FIFA World Cup) ఆరంభ మ్యాచ్‌లో బరిలోకి దిగడంపై సందిగ్ధత వీడింది. ఇటీవల ఐర్లాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా రొనాల్డోకు ‘రెడ్‌ కార్డు’ దక్కింది. దీంతో అతడిపై మూడు మ్యాచ్‌ల నిషేధం పడింది. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఏడాది తర్వాత అమలు చేయవచ్చని ‘ఫిఫా’ వెసులుబాటు కల్పించింది. దీంతో ఈ నెల 16న అర్మేనియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన రొనాల్డో... వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌కప్‌ ఆరంభం నుంచి అందుబాటులో ఉండనున్నాడు.కాగా 2026 జూన్‌ 11 నుంచి అమెరికా, కెనడా, మెక్సికో వేదికగా ‘ఫిఫా’ ప్రపంచకప్‌ జరగనుండగా... దానికి ముందు పోర్చుగల్‌ జట్టు రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. ఫుట్‌బాట్ ప్రపంచ కప్ 2026కు అర్హ‌త సాధించిన‌ జట్లు ఇవే అల్జీరియా, కేప్ వెర్డే, ఈజిప్ట్ , ఘనా, ఐవరీ కోస్ట్, మొరాకో, సెనెగల్, దక్షిణాఫ్రికా, ట్యునీషియా, ఆస్ట్రేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్.

 Sindarov crowned 2025 FIDE World Cup Champion8
World Chess Championship: సూపర్‌ సిందరోవ్‌

పనాజీ: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్‌ టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జవోఖిర్‌ సిందరోవ్‌ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. బుధవారం ముగిసిన పురుషుల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో 19 ఏళ్ల సిందరోవ్‌ చాంపియన్‌గా అవతరించాడు. తద్వారా ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గిన అతి పిన్న వయసు్కడిగా సిందరోవ్‌ గుర్తింపు పొందాడు. చైనా గ్రాండ్‌మాస్టర్‌ వె యితో జరిగిన టైబ్రేక్‌లో సిందరోవ్‌ 1.5–0.5తో గెలుపొందాడు. ఇద్దరి మధ్య నిరీ్ణత రెండు క్లాసిక్‌ ఫార్మాట్‌ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో... విజేతను నిర్ణయించేందుకు బుధవారం టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. తెల్ల పావులతో ఆడిన తొలి గేమ్‌ను సిందరోవ్‌ 45 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.నల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌లో సిందరోవ్‌ 60 ఎత్తుల్లో గెలుపొంది టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన సిందరోవ్‌కు 1,20,000 డాలర్లు (రూ. 1 కోటీ 7 లక్షలు), రన్నరప్‌ వె యికి 85,000 డాలర్లు (రూ. 75 లక్షల 83 వేలు), మూడో స్థానం పొందిన ఎసిపెంకో (రష్యా)కు 60,000 డాలర్లు (రూ. 53 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ముగ్గురు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి కూడా అర్హత సాధించారు. ఫాబియానో కరువానా (అమెరికా), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), మథియాస్‌ బ్లూబామ్‌ (జర్మనీ) ఇప్పటికే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత పొందారు. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీపడతాడు.

Commonwealth Games 2030 IAs Ahmedabad Hosts9
అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌

గ్లాస్గో (స్కాట్లాండ్‌): ఊహించిన విధంగానే 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ హక్కులు భారత్‌ దక్కించుకుంది. ఈ మేరకు కామన్వెల్త్‌ స్పోర్ట్‌ కార్యవర్గం బుధవారం వివరాలు వెల్లడించింది. కామన్వెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు గత నెలలోనే అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించగా... ఇప్పుడు కార్యవర్గం దానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు కామన్వెల్త్‌ స్పోర్ట్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ రుకరే ఆతిథ్య హక్కుల పత్రాలు అందజేశారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత భారత్‌ ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌ ఢిల్లీలో జరిగాయి. ‘కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం తదుపరి వేదిక ఖరారైంది. భారత్‌ ఈ క్రీడలకు కొత్త అభిరుచి, మరింత ఔచిత్యం తీసుకొస్తుందని విశి్వసిస్తున్నాం. గొప్ప సంస్కృతిని కొనసాగిస్తూ క్రీడల స్థాయిని పెంచుతుంది’ అని కామన్వెల్త్‌ స్పోర్ట్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ రుకరే అన్నారు.కామన్వెల్త్‌ స్పోర్ట్‌ నిర్ణయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్వాగతించారు. ‘ఇది గరి్వంచే క్షణం. 2047 కల్లా టాప్‌–5 క్రీడా దేశాల్లో భారత్‌ ఒకటిగా ఎదుగుతుంది’ అని మాండవీయ పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న భారత్‌కు కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణ మంచి రిహార్సల్‌ కానుంది. 2030 కామన్వెల్త్‌ క్రీడల కోసం అహ్మదాబాద్‌తో పాటు... నైజీరియా నగరం అబుజా కూడా పోటీపడింది. అయితే నిర్వాహకులు మాత్రం భారత్‌నే ఎంపిక చేశారు. అబుజాను 2034 కామన్వెల్త్‌ క్రీడల కోసం పరిగణించనున్నారు.

Two medals for Indian TT teams10
భారత టీటీ జట్లకు రెండు పతకాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు రెండు పతకాలు సాధించాయి. రొమేనియా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత బాలుర అండర్‌–19 జట్టు రజత పతకంతో మెరవగా... బాలికల అండర్‌–15 జట్టు కాంస్యం సాధించింది. చక్కటి ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకున్న బాలుర అండర్‌–19 జట్టు బుధవారం జరిగిన ఫైనల్లో 0–3తో జపాన్‌ చేతిలో ఓడింది.అంకుర్‌ 17–15, 6–11, 12–10, 4–11, 11–13తో రైసీ కవాకమి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడగా... అభినందర్‌ 7–11, 8–11, 6–11తో కజకి యోషియామా (జపాన్‌) చేతిలో ఓడాడు. మూడో సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రియానుజ్‌ భట్టాచార్య 9–11, 7–11, 3–11తో టమిటో వటనబే (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు సెమీస్‌లో భారత జట్టు 3–2తో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. బాలికల అండర్‌–15 జట్టు సెమీఫైనల్లో 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. తొలిసారి ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత అమ్మాయిల అండర్‌–15 జట్టు క్వార్టర్స్‌లో 3–1తో జర్మనీపై గెలిచింది. బాలికల అండర్‌–19 క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 2–3తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement