Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Virat Kohli Receives Massive Request From Taliban Leader1
విరాట్‌ కోహ్లిపై తాలిబన్‌ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు

దిగ్గజ బ్యాటర్‌, టీమిండియా ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి ఈ ఏడాది మే 12న టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి యావత్‌ క్రికెట్‌ ప్రపంచానికి ఊహించని షాకిచ్చాడు. కోహ్లిలో మరో మూడు, నాలుగేళ్లు టెస్ట్‌ల్లో కొనసాగే సత్తా ఉన్నా ఎందుకో సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి తప్పుకున్నాడు. కోహ్లి ఆకస్మిక టెస్ట్‌ రిటైర్మెంట్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా అతను మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందే (గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత) పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్‌.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. త్వరలో ఆస్ట్రేలియాతో వారి దేశంలోనే జరుగబోయే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్‌ పాల్గొనే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, తాజాగా విరాట్‌ టెస్ట్‌ రిటైర్మెంట్‌పై ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన తాలిబన్‌ అగ్రనేత అనాస్‌ హక్కానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో​ అయ్యే హకాన్నీ విరాట్‌ టెస్ట్‌ రిటైర్మెంట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లి టెస్ట్‌ రిటైర్మెంట్ వెనుక కారణాలు నాకు తెలియదు. బహుశా భారత మీడియా వల్ల విసిగిపోయి అతనలా చేసి ఉండవచ్చు. విరాట్‌ లాంటి ఆటగాడు కనీసం 50 ఏళ్ల వరకైనా ఆడాలన్నది నా కోరిక. విరాట్‌కు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. జో రూట్‌ను చూడండి, సచిన్ అత్యధిక టెస్ట్‌ పరుగుల రికార్డును ఛేదిస్తున్నాడు. విరాట్‌ కూడా ఆ రికార్డును టార్గెట్‌గా పెట్టుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.హక్కానీ లాంటి ఉగ్ర నేపథ్యమున్న నేత విరాట్‌ టెస్ట్‌ రిటైర్మెంట్‌పై స్పందించడం క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. హక్కానీకి తాలిబన్‌ ఉద్యమ నేత. తాలిబన్లు తీసుకునే అంతర్గత నిర్ణయాల్లో హక్కానీ కీలకపాత్రధారుడు. హక్కానీ క్రమం తప్పకుండా క్రికెట్‌ను ఫాలో అవుతుండటంతో పాటు సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. హక్కానీ వారి దేశ క్రికెట్‌ జట్టుకు (ఆఫ్ఘనిస్తాన్‌) మంచి మద్దతుదారుడు. వారి తురుపుముక్క రషీద్‌ ఖాన్‌ను హక్కానీ అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ భారత్‌తో పాటు ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ ఖండాంతర టోర్నీలో ఇరు జట్లు వేరువేరు గ్రూప్‌ల్లో ఉండటంతో గ్రూప్‌ దశలో పోటీపడటం లేదు. ఇరు జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తే సూపర్‌ ఫోర్‌లో తలపడే అవకాశం ఉంటుంది.

Jaismine Lamboria wins gold at World Boxing Championships 20252
World Boxing Championships 2025: చరిత్ర సృష్టించిన భారత బాక్సర్‌

భారత బాక్సింగ్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. లివర్‌పూల్‌లో జరుగుతున్న వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌-2025లో ముగ్గురు మహిళా బాక్సర్లు పతకాలు సాధించారు. నుపూర్ 80 ప్లస్‌ కేజీల విభాగంలో రజత పతకం సాధించగా.. పూజా రాణి 80 కేజీల విభాగంలో కాంస్యం​.. తాజాగా జైస్మిన్ లంబోరియా 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఫలితం (ముగ్గురు మహిళా బాక్సర్లకు పతకాలు) ఇదే.చరిత్ర సృష్టించిన లంబోరియా తాజాగా జరిగిన 57 కేజీల విభాగం​ ఫైనల్లో జైస్మిన్ లంబోరియా పోలాండ్‌కి చెందిన ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా సెరెమెటాపై 4-1 స్ప్లిట్ డెసిషన్‌తో విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. నూతన గ్లోబల్‌ బాక్సింగ్‌ గవర్నింగ్‌ బాడీగా 'వరల్డ్‌ బాక్సింగ్‌' ఏర్పడ్డాక జరుగుతున్న తొలి వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఇదే.నుపూర్‌కు రజతంఇదే టోర్నీలో 80 ప్లస్‌ కేజీల విభాగంలో నుపుర్‌ గోల్డ్‌ మిస్‌ అయ్యింది. అగాటా కాజ్‌మార్స్కాతో (పోలాండ్) ఫైనల్‌లో నుపుర్‌ 2-3తో పోరాడి ఓడింది.పూజా రాణికి కాంస్యం80 కేజీల విభాగంలో పూజా రాణి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్‌కి చెందిన ఎమిలీ ఆస్క్విత్‌తో సెమీఫైనల్‌లో గట్టిగానే పోరాడింది.భారత బాక్సింగ్‌లో చారిత్రక ఘట్టంభారత బాక్సింగ్‌ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి ముగ్గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్‌కు చేరారు. జైస్మిన్‌, నుపుర్‌ ఇది వరకే స్వర్ణం, రజతం సాధించగా.. మీనాక్షి 48 కేజీ విభాగంలో స్వర్ణం​ కోసం​ పోటీపడాల్సి ఉంది.

T20 Blast 2025: Chris Lynn makes history with first Finals Day hundred3
వరుసగా 5 సిక్సర్లు.. విధ్వంసకర శతరం.. చరిత్ర సృష్టించిన ఆసీస్‌ బ్యాటర్‌

టీ20 బ్లాస్ట్‌ 2025లో హ్యాంప్‌షైర్‌ ఆటగాడు (ఆసీస్‌) క్రిస్‌ లిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్స్‌ డే (టీ20 బ్లాస్ట్‌లో సెమీస్‌, ఫైనల్స్‌ ఒకే రోజు జరుగుతాయి) చరిత్రలో శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (సెప్టెంబర్‌ 13) నాటింగ్హమ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లో శతకం పూర్తి చేసిన లిన్‌.. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. తద్వారా తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్స్‌కు చేర్చాడు. 159 పరుగుల లక్ష్య ఛేదనలో లిన్‌ ఒక్కడే 90 శాతం పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసే క్రమంలో ఓ ఓవర్‌లో (లాయిడ్‌ పోప్‌) వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.లిన్‌ రికార్డు శతకంతో హ్యాంప్‌షైర్‌ను ఫైనల్స్‌కు చేర్చినా.. ఆ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. తొలి సెమీఫైనల్‌ (ఇది కూడా నిన్ననే జరిగింది) విజేత సోమర్‌సెట్‌తో జరిగిన ఫైనల్లో హ్యాంప్‌షైర్‌ ఓటమిపాలైంది. సెమీస్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగిన లిన్‌ ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 7 బంతుల్లో సిక్స్‌, ఫోర్‌ సాయంతో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఫైనల్లో లిన్‌ విఫలమైనా హ్యాంప్‌షైర్‌ భారీ స్కోరే (194/6)​ చేసింది. అయితే దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. విల్‌ స్మీడ్‌ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసం సృష్టించి సోమర్‌సెట్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. సోమర్‌సెట్‌కు ఇది మూడో టీ20 బ్లాస్ట్‌ టైటిల్‌. ఫైనల్లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్‌ ఛేదనల చరిత్రలో అత్యధికం.

Somerset Win T20 Blast 20254
స్మీడ్‌ ఊచకోత.. టీ20 బ్లాస్ట్‌ 2025 విజేతగా సోమర్‌సెట్‌.. రికార్డు ఛేదన

టీ20 బ్లాస్ట్‌ 2025 విజేతగా సోమర్‌సెట్‌ ఆవిర్భవించింది. నిన్న (సెప్టెంబర్‌ 13) జరిగిన ఫైనల్లో హ్యాంప్‌షైర్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హ్యాంప్‌షైర్‌.. టాబీ ఆల్బర్ట్‌, కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.టీ20 బ్లాస్ట్‌ ఫైనల్స్‌ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్‌. అయినా ఈ స్కోర్‌ను హ్యాంప్‌షైర్‌ కాపాడుకోలేకపోయింది. విల్‌ స్మీడ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి సోమర్‌సెట్‌ను గెలిపించాడు. కెప్టెన్‌ లెవిస్‌ గ్రెగరి మరో ఓవర్‌ మిగిలుండగానే సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సోమర్‌సెట్‌కు ఇది మూడో టీ20 బ్లాస్ట్‌ టైటిల్‌.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హ్యాంప్‌షైర్‌.. టాబీ ఆల్బర్ట్‌ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్‌ విన్స్‌ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో బెన్నీ హోవెల్‌ (19 బంతుల్లో 26 నాటౌట్‌; 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. క్రిస్‌ లిన్‌ 12, జేమ్స్‌ ఫుల్లర్‌ 1, బెన్‌ మేయర్స్‌ 9, అలీ ఒర్‌ 3 పరుగులు చేశారు. సోమర్‌సెట్‌ బౌలర్లలో జేక్‌ బాల్‌ 2, గ్రెగరి, ఓవర్టన్‌, గోల్డ్స్‌వర్తీ తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సోమర్‌సెట్‌.. విల్‌ స్మీడ్‌ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసం సృష్టించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది (4 వికెట్లు కోల్పోయి). సీన్‌ డిక్సన్‌ (22 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రెగరి (5 బంతుల్లో 18 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) సోమర్‌సెట్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ 23, టామ్‌ ఏబెల్‌ 0, జేమ్స్‌ రూ 20 పరుగులు చేశారు. హ్యాంప్‌షైర్‌ బౌలరల్లో స్కాట్‌ కర్రీ 2, సొన్నీ బేకర్‌, జేమ్స్‌ ఫుల్లర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్‌ ఛేదనల చరిత్రలో అత్యధికం. ఈ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌కు గానూ స్మీడ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్దు దక్కింది.

Telugu Titans suffer defeat in Pro Kabaddi League5
తెలుగు టైటాన్స్‌ పరాజయం

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్‌కు పరాజయం ఎదురైంది. వైజాగ్‌ వేదికగా ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన తెలుగు టైటాన్స్‌ శనివారం 33–39 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్‌ చేతిలో ఓడింది. ఈ సీజన్‌లో టైటాన్స్‌కు ఇది మూడో పరాజయం. తెలుగు టైటాన్స్‌ తరఫున భరత్‌ 12 పాయింట్లతో విజృంభించగా... కెపె్టన్‌ విజయ్‌ మాలిక్‌ 7 పాయింట్లు సాధించాడు. పల్టన్‌ తరఫున అస్లమ్‌ ఇనామ్‌దార్, గౌరవ్‌ చెరో 7 పాయింట్లు సాధించారు. విశాల్‌ భరద్వజ్‌ (6 పాయింట్లు), ఆదిత్య (5 పాయింట్లు), పంకజ్‌ (5 పాయింట్లు) కూడా మెరవడంతో పల్టన్‌ ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ 21 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... పల్టన్‌ 15కే పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో పల్టన్‌ 17 పాయింట్లు సాధిస్తే తెలుగు టైటాన్స్‌ పది పాయింట్లకే పరిమితమైన పరాజయం పాలైంది. లీగ్‌లో భాగంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌ మూడింట గెలిచి మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడి 6 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 41–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. పింక్‌ పాంథర్స్‌ తరఫున నితిన్‌ కుమార్‌ 11 పాయింట్లు, అలీ సమది 10 పాయింట్లతో సత్తాచాటారు. యూపీ యోధాస్‌ తరఫున గగన్‌ గౌడ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 22 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 21 సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పింక్‌ పాంథర్స్‌ 12 పాయింట్లు సాధిస్తే... యూపీ యోధాస్‌ 4 పాయింట్లకే పరిమితమైంది.

Today match between India and Pakistan in asia cup6
అసలు సమరానికి సమయం

సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్‌ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్‌ ఫలితంపై అందరి దృష్టీ పడుతుంది... బలాబలాల మధ్య ఆకాశమంత అంతరం ఉన్నా ఆసక్తి విషయంలో ఎక్కడా లోటుండదు. ఆటగాళ్లు మారినా, వేదికలు మారినా అభిమానుల్లో ఈ పోరు కొత్త ఉత్సాహాన్ని రేపుతుంది.దాయాది జట్లు భారత్, పాకిస్తాన్‌ మధ్య ఆసియా కప్‌లో జరిగే మ్యాచ్‌లో నేడు తలపడనున్నాయి. పహల్గావ్‌ ఘటనను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ ఎన్నో వైపులనుంచి పిలుపులు వచ్చినా క్రికెటర్లు, నిర్వాహకులు, ప్రసారకర్తలు తమ పని తాము చేసుకుంటూ మ్యాచ్‌కు బహుళ ప్రచారాన్ని కల్పిస్తున్నారు. దుబాయ్‌: ఆసియా కప్‌ లీగ్‌ దశలో మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతా 11 మ్యాచ్‌లపై ఆసక్తి, ప్రేక్షకుల స్పందన చూస్తే అతి పేలవం. టోర్నీని నిలబెట్టగలిగే, భాగస్వాములకు కాస్త ఆర్థిక పుష్టి అందించే మ్యాచ్‌ ఏదైనా ఉందంటే అది భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగే పోరు మాత్రమే. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్‌ కప్‌ తర్వాత ఈ రెండు టీమ్‌లు ఈ ఫార్మాట్‌లో తలపడటం ఇదే మొదటిసారి. భారత్‌ తరఫున సీనియర్లు రోహిత్, కోహ్లి నిష్క్రమించగా...పాక్‌ జట్టుకు బాబర్, రిజ్వాన్‌ దూరమయ్యారు. దాంతో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఆసియా కప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో యూఏఈని భారత్‌ చిత్తు చేయగా...ఇదే తరహాలో ఒమన్‌పై పాక్‌ విజయం సాధించింది. అదే జట్టుతో... టోర్నీ తొలి పోరులో తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగిన భారత్‌ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో బౌలర్లంతా ఆకట్టుకోగా, ఓపెనర్లకు మినహా మిగతావారికి బ్యాటింగ్‌ అవకాశమే రాలేదు. అభిషేక్‌ శర్మ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌కు సై అంటుండగా, మరో ఓపెనర్‌ గిల్‌ కూడా పాక్‌పై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గిల్‌ ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఒక్క టి20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. పాక్‌పై ఇప్పటి వరకు 20 పరుగులు దాటలేకపోయిన సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా లెక్క సరి చేసేందుకు సిద్ధమయ్యాడు. సంజు, తిలక్, దూబే, హార్దిక్‌లతో విధ్వంసకర లైనప్‌ టీమిండియాకు భారీ స్కోరును అందించగలదు. ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ తన విలువ చూపిస్తే పాక్‌కు ఇబ్బంది తప్పదు. బుమ్రా ప్రమాదకర బౌలింగ్‌ను పాక్‌ బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోగలరనేది సందేహమే. పాండ్యా, దూబేల రూపంలో ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటంతో రెండో పేసర్‌ అవసరం జట్టుకు లేదు. కుల్దీప్, వరుణ్‌లను ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేయగల సమర్థులు. పిచ్, వాతావరణం దుబాయ్‌లో సాధారణంగా భారీ స్కోర్లు నమోదు కావు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షసూచన లేదు కానీ క్రికెటర్లు తీవ్రమైన ఎండలను తట్టుకోవాల్సి ఉంది. తుది జట్లు (అంచనా)భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్, గిల్, సామ్సన్, తిలక్, శివమ్‌ దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్‌. పాకిస్తాన్‌: సల్మాన్‌ ఆగా (కెప్టెన్), ఫర్హాన్, అయూబ్, ఫఖర్, హసన్, హారిస్, నవాజ్, ఫహీమ్, అఫ్రిది, ముఖీమ్, అబ్రార్‌

India in the final of the Asia Cup womens hockey7
ఆసియాకప్‌ మహిళల హాకీ ఫైనల్లో భారత్‌

హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్‌–4’ దశ చివరి మ్యాచ్‌లో శనివారం డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌తో పోరును భారత జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ తరఫున బ్యూటీ డుంగ్‌ డుంగ్‌ 7వ నిమిషంలో గోల్‌ సాధించింది. చివరి క్వార్టర్‌ వరకు ఆధిక్యాన్ని కొనసాగించిన టీమిండియా... విజయం సాధించడం ఖాయమే అనుకుంటుండగా... 58వ నిమిషంలో కోబయకావా షిహో గోల్‌తో జపాన్‌ స్కోరు సమం చేసింది. ఇరు జట్ల మధ్య గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌ సైతం ‘డ్రా’గానే ముగిసింది. మరో మ్యాచ్‌లో చైనా 1–0 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాపై గెలవడంతో టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ‘సూపర్‌–4’ దశలో మూడు మ్యాచ్‌లాడిన భారత్‌ ఒక విజయం, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు జరగనున్న ఫైనల్లో చైనాతో భారత్‌ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధిస్తుంది.

India qualify for Davis Cup tennis tournament qualifiers8
క్వాలిఫయర్స్‌కు భారత్‌

బీల్‌ (స్విట్జర్లాండ్‌): మూడు దశాబ్దాల తర్వాత డేవిస్‌ కప్‌లో భారత జట్టు ఓ ఘనమైన విజయంతో ముందంజ వేసింది. డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 టైలో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 3–1తో విజయం సాధించింది. తొలి రోజు కొత్త కుర్రాడు దక్షిణేశ్వర్‌తో పాటు భారత స్టార్‌ సుమిత్‌ నగాల్‌ వరుస విజయాలతో సింగిల్స్‌లో 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌కు రెండో రోజు శనివారం డబుల్స్‌లో పరాజయం ఎదురైంది. దీంతో భారత్‌ ఆధిక్యం 2–1కి తగ్గింది. ఈ దశలో రివర్స్‌ సింగిల్స్‌ బరిలోకి దిగిన భారత నంబవర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ 6–1, 6–3తో హెన్రీ బెర్నెట్‌పై విజయం సాధించాడు. దీంతో ఈ ‘టై’లో భారత్‌ గెలుపొందింది. ఫలితం రావడంతో నామమాత్రమైన రెండో రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ను నిర్వహించలేదు. మూడేళ్ల క్రితం 2022లో డెన్మార్క్‌పై గెలిచినప్పటికీ ఇది న్యూఢిల్లీ వేదికపై జరిగింది. తాజా విజయంతో డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌ అర్హత సాధించింది. తొలిరౌండ్‌ డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ పోటీలు వచ్చే జనవరిలో జరుగుతాయి. అంతకుముందు జరిగిన డబుల్స్‌లో భారత బృందానికి నిరాశ ఎదురైంది. శ్రీరామ్‌ బాలాజీతో జోడీగా బరిలోకి దిగిన తెలంగాణ ఆటగాడు రితి్వక్‌ బొల్లిపల్లి జంటకు ఆతిథ్య స్విట్జర్లాండ్‌ జోడీ చేతిలో చుక్కెదురైంది. రితి్వక్‌–బాలాజీ ద్వయంకు 7–6 (8/3), 4–6, 5–7తో జాకుబ్‌ పాల్‌–డామినిక్‌ స్ట్రికెర్‌ జంట చేతిలో పరాజయం ఎదురైంది. మొత్తమ్మీద విదేశీ గడ్డపై భారత్‌ చివరిసారిగా 1993లో గెలిచింది.

Satwiksairaj and Chirag Shetty in Hong Kong Open finals9
ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

హాంకాంగ్‌: భారత బ్యాడ్మింటన్‌ అగ్ర శ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ కూడా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న భారత ఆటగాడు 23–21, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, మూడో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ని కంగు తినిపించాడు. సుమారు గంటపాటు హోరా హోరీగా జరిగిన సమరంలో లక్ష్యసేన్‌ ఏ దశలోనూ పట్టు సడలించలేదు. నేడు జరిగే టైటిల్‌ పోరులో చైనాకు చెందిన రెండో సీడ్‌ లి షి ఫెంగ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ ఏడాది సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ సెమీస్‌తోనే ఆగిపోతున్నారు. ఆరు టోర్నీల్లో సెమీస్‌తోనే ముగిసిన భారత జోడీ పోరాటం ఇక్కడ ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్‌లో తొలిసారి సాత్విక్‌–చిరాగ్‌లు ఎట్టకేలకు టైటిల్‌ వేటలో అడుగు దూరంలో ఉన్నారు. తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య విజేత అయిన భారత డబుల్స్‌ జోడీ వరుస సెట్లలో చైనీస్‌ తైపీకి చెందిన బింగ్‌ వే లిన్‌–చెన్‌ చెంగ్‌ కున్‌ జంటను కంగుతినిపించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకులో ఉన్న సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–17, 21–15తో తైపీ జోడీని కంగుతినిపించింది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ఎనిమిదో సీడ్‌ భారత జోడీ... పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతక విజేతలైన లియాంగ్‌ వే కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా) జంటతో తలపడుతుంది.

Asia cup 2025: Srilanka Wins Over Bangladesh10
శ్రీలంక శుభారంభం

అబుదాబి: ఆసియా కప్‌ టి20 టోర్నమెంట్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో అసలంక సారథ్యంలోని లంక 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్‌ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్‌జీద్‌ హసన్‌ (0), పర్వేజ్‌ హుసేన్‌ (0) డకౌట్‌ కావడంతో జట్టు పరుగుల ఖాతా తెరువకముందే 2 టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. జట్టు రెండంకెల స్కోరు 11కు చేరగానే తౌహీద్‌ హృదయ్‌ (8) రనౌటయ్యాడు. ఈ దశలో కెపె్టన్‌ లిటన్‌ దాస్‌ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే మెహదీ హసన్‌ (9)తో పాటు లిటన్‌ దాస్‌ కూడా పెవిలియన్‌ చేరడంతో బంగ్లా 53 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షమీమ్‌ (34 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జాకీర్‌ అలీ (34 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించారు. మరో వికెట్‌ పడకుండా జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో కుశాల్‌ మెండిస్‌ (3) నిరాశ పరచగా, నిసాంక (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కమిల్‌ మిషార (32 బంతుల్లో 46 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి నిసాంక రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement