Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Venkatesh Iyer picks All Time T20 playing XI Leaves out Rohit Kohli1
ఆల్‌టైమ్‌ టీ20 జట్టు.. రోహిత్‌, కోహ్లికి దక్కని చోటు! కెప్టెన్‌ ఎవరంటే..

ఐపీఎల్‌-2026 వేలానికి ముందు భారత ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer)కు భారీ షాక్‌ తగిలింది. గతేడాది కోట్లు కుమ్మరించి అతడిని కొనుక్కున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) ఈసారి మాత్రం ఆక్షన్‌లోకి విడిచిపెట్టేసింది. అన్నీ కుదిరితే కేకేఆర్‌ వెంకటేశ్‌ను మళ్లీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ 2025లో అతడి ప్రదర్శన దృష్ట్యా ఇది సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తోంది.ఏకంగా రూ. 23.75 కోట్లుకాగా మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్‌ అయ్యర్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. రూ. 20 లక్షలకు 2021లో కేకేఆర్‌ అతడిని కొనుగోలు చేసింది. అదే ఏడాది వెంకటేశ్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. పది మ్యాచ్‌లలో కలిపి 370 పరుగులతో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌ను 2022లో ఏకంగా రూ. 8 కోట్లకు కేకేఆర్‌ రిటైన్‌ చేసుకుంది.ఇక గతేడాది కేకేఆర్‌ టైటిల్‌ గెలవడంలో వెంకీ తన వంతు పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌లలో కలిపి 370 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. ఫైనల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌ వేలంలోకి వెళ్లినా కేకేఆర్‌ అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ ఈసారి అతడు పూర్తిగా విఫలమయ్యాడు.ఆల్‌టైమ్‌ టీ20 ఎలెవన్‌ఐపీఎల్‌-2025లో పదకొండు మ్యాచ్‌లు ఆడి కేవలం 142 పరుగులే చేశాడు. దీంతో కేకేఆర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 16న అబుదాబి వేదికగా వేలంపాట జరుగనున్న నేపథ్యంలో క్రిక్‌ట్రాకర్‌కు వెంకీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఆల్‌టైమ్‌ టీ20 ఎలెవన్‌ను వెంకటేశ్‌ అయ్యర్‌ ప్రకటించాడు.రోహిత్‌, కోహ్లికి దక్కని చోటుఅయితే, వెంకీ ఎంచుకున్న టీ20 ఆల్‌టైమ్‌ జట్టులో భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రో-కోకు వెంకటేశ్‌ అయ్యర్‌ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం.ఓపెనర్లుగా వీరూ, అభిషేక్‌ఇక తన జట్టులో ఓపెనర్లుగా భారత విధ్వంసకర బ్యాటర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌, అభిషేక్‌ శర్మను ఎంచుకున్న వెంకీ.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను వన్‌డౌన్‌లో ఆడిస్తానని తెలిపాడు. మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరొందిన టీమిండియా మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనాను ఎంపిక చేసుకున్న అతడు.. తన జట్టులో ఇద్దరు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుకు చోటిచ్చాడు.ఇంగ్లండ్‌ స్టార్‌ బెన్‌ స్టోక్స్‌తో పాటు టీమిండియా మేటి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు వెంకీ ఈ మేరకు తన జట్టులో స్థానం కల్పించాడు. ఇక ఏడో స్థానానికి, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోనిని వెంకటేశ్‌ అయ్యర్‌ ఎంచుకున్నాడు.బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్లు అఫ్గనిస్తాన్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌, వెస్టిండీస్‌ దిగ్గజం సునిల్‌ నరైన్‌లకు చోటు ఇచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌.. పేస్‌ దళంలో భారత మేటి బౌలర్‌ జస్‌‍ప్రీత్‌ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగలను ఎంచుకున్నాడు. ఇక ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హెడెన్‌కు వెంకీ స్థానమిచ్చాడు.వెంకటేశ్‌ అయ్యర్‌ ఆల్‌టైమ్‌ టీ20 ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదేవీరేందర్‌ సెహ్వాగ్‌, అభిషేక్‌ శర్మ, ఏబీ డివిలియర్స్‌, సురేశ్‌ రైనా, బెన్‌ స్టోక్స్‌, హార్దిక్‌ పాండ్యా, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రషీద్‌ ఖాన్‌, సునిల్‌ నరైన్‌, లసిత్‌ మలింగ, జస్‌ప్రీత్‌ బుమ్రాఇంపాక్ట్‌ ప్లేయర్‌: మాథ్యూ హెడెన్‌.

IND A vs SA A 3rd One Day: SA Openers Tons IND A need 326 runs to win2
భారత్‌తో వన్డేలో శతక్కొట్టిన ఓపెనర్లు.. సౌతాఫ్రికా భారీ స్కోరు

భారత్‌తో మూడో అనధికారిక వన్డేలో సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (IND A vs SA A) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు శతక్కొట్టడంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఏకంగా 325 పరుగులు చేసింది. కాగా రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా భారత్‌-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసిన సఫారీ జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. తొలి, రెండో వన్డేలో తిలక్‌ వర్మ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్‌ వేదికగా బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు బ్యాటింగ్‌తో అదరగొట్టింది.శతక్కొట్టిన ఓపెనర్లుఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌-‘ఎ’ జట్టు ప్రొటిస్‌ టీమ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌, రివాల్డో మూన్‌సామీ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రిటోరియస్‌ 98 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 123 పరుగులు చేయగా.. మూన్‌సామీ 130 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 107 పరుగులు సాధించాడు.మిగతా అంతా ఫెయిల్‌విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఈ ఓపెనింగ్‌ జోడీని భారత పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ విడదీశాడు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. మిగతా వాళ్లంతా పెలివియన్‌కు క్యూ కట్టారు. రుబిన్‌ హెర్మాన్‌ (11), సినెతెంబ కెషిలె (1), కెప్టెన్‌ మార్క్వెస్‌ అకెర్మాన్‌ (16) పూర్తిగా విఫలం కాగా.. డియాన్‌ ఫోరెస్టర్‌ 20, డిలానో పాట్‌గిటర్‌ 30 (నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. డిజోర్న్‌ ఫార్చ్యూన్‌ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా సౌతాఫ్రికా-‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో పేసర్లు ప్రసిద్‌ కృష్ణ, ఖలీల్‌ అహ్మద్‌, హర్షిత్‌ రాణా తలా రెండేసి వికెట్లు కూల్చారు.

Rinku singh Scores 176 In Ranji Trophy To Help Uttar Pradesh Take 1st Innings Lead3
రింకూ సింగ్ విధ్వంసం.. వణకిపోయిన బౌలర్లు

టీమిండియా వైట్ బాల్ స్పెష‌లిస్ట్ రింకూ సింగ్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2025/26 సీజన్‌లో రింకూ అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. త‌మిళ‌నాడుతో కోయంబత్తూరు వేదిక‌గా జ‌రుగుతున్న ఎలైట్ గ్రూపు-ఎ మ్యాచ్‌లో ఈ యూపీ బ్యాట‌ర్ భారీ శ‌త‌కంతో చెల‌రేగాడు.149 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన రింకూ.. వ‌న్డే త‌ర‌హాలో త‌న ఇన్నింగ్స్‌ను కొన‌సాగించాడు. అప్ప‌టివ‌ర‌కు బంతిని గింగ‌రాలు తిప్పిన తమిళనాడు స్పిన్నర్లు పి. విద్యుత్, కెప్టెన్ సాయి కిషోర్‌ల‌ను రింకూ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాడు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. పిచ్ కండీష‌న్స్ ఆర్ధం చేసుకోవడానికి కాస్త స‌మ‌యం తీసుకున్న రింకూ సింగ్‌.. ఆ త‌ర్వాత త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. రింకూ సింగ్ ఓవ‌రాల్‌గా 248 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్లతో 176 పరుగులు చేసి ఔట‌య్యాడు. లోయార్డ‌ర్ బ్యాట‌ర్ శివమ్ మావితో కలిసి 104 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని ఈ కేకేఆర్ బ్యాట‌ర్‌ నెలకొల్పాడు. ఫ‌లితంగా యూపీ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 460 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అంత‌కుముందు త‌మిళ‌నాడు మొద‌టి ఇన్నింగ్స్‌లో 455 ప‌రుగులు చేసింది. దీంతో యూపీకి కేవ‌లం 5 ప‌రుగుల ఆధిక్యం మాత్ర‌మే ల‌భించింది.అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌తో మ్యాచ్‌లో కూడా రింకూ(165) శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సింగ్‌.. 341 పరుగులు చేశాడు.

Babar Azam leaves Shahid Afridi behind in shameful Pakistan list4
జింబాబ్వేతో మ్యాచ్‌.. బాబర్‌ ఆజామ్‌ అత్యంత చెత్త రికార్డు

జింబాబ్వే, శ్రీలంక‌తో ముక్కోణ‌పు టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజామ్‌ పేల‌వంగా ఆరంభించాడు. ల‌హోర్ వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై బాబ‌ర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఆజామ్‌ కేవలం మూడు బంతులే ఆడి ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. జింబాబ్వే పేస‌ర్ బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు ఈ పాక్ మాజీ కెప్టెన్ దొరికిపోయాడు. బాబర్ ఆజమ్‌కు గత ఆరు టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఇది మూడో డక్. ఈ క్ర‌మంలో అత‌డు ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక సార్లు డౌకౌటైన రెండో పాక్ ఆట‌గాడిగా బాబ‌ర్ నిలిచాడు. ఇంత‌కుముందు ఈ అవాంఛిత రికార్డు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అఫ్రిదిని ఆజామ్‌ అధిగ‌మించాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ క‌మ్రాన్ ఆక్మ‌ల్‌, యువ ఓపెన‌ర్ సైమ్ అయూబ్‌లు సంయుక్తంగా అగ్ర‌స్ధానంలో ఉన్నారు. ఆయూబ్, ఆక్మ‌ల్ టీ20ల్లో ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది సార్లు డకౌట‌య్యారు. ఇక మ్యాచ్ విష‌యానికి వస్తే.. జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో పాక్ విజ‌యం సాధించింది. 148 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ 19.2 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన పాక్ ఆట‌గాళ్లు వీరే..👉సైమ్ అయూబ్ – 10 సార్లు (50 ఇన్నింగ్స్‌ల్లో)👉ఉమ‌ర్ అక్మ‌ల్ – 10 సార్లు (79 ఇన్నింగ్స్‌ల్లో)👉షాహిద్ అఫ్రిది – 8 సార్లు (90 ఇన్నింగ్స్‌ల్లో)👉 క‌మ్రాన్ అక్మ‌ల్ – 7 సార్లు (53 ఇన్నింగ్స్‌ల్లో)👉మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ – 7 సార్లు (108 ఇన్నింగ్స్‌ల్లో)👉మ‌హ్మ‌ద్ న‌వాజ్ – 7 సార్లు (58 ఇన్నింగ్స్‌ల్లో)

India ask for pace And bounce from Guwahati pitch curator after Kolkata debacle5
భారత్‌-సౌతాఫ్రికా రెండో టెస్టు.. సిద్దమవుతున్న స్పెషల్ పిచ్

గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్ తమ ప్రయోగాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో చావు దెబ్బ తినడంతో గౌహతి టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్‌ను తయారు చేయాలని క్యూరేటర్‌ను టీమ్ మేనెజ్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కోల్‌కతాలో ఉపయోగించిన నల్ల మట్టి పిచ్‌లా కాకుండా.. రెడ్ సాయిల్ పిచ్‌లపై పేస్‌తో పాటు బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాక్‌లపై క్రాక్స్ కూడా ఎక్కువగా రావు. అంతేకాకుండా ఆట ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలించే అవకాశముంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం, బీసీసీఐ ప్రధాన క్యూరేటర్ ఆశిష్ భౌమిక్ ఇప్పటికే పిచ్‌ను తాయారు చేయడం మొదలు పెట్టినట్లు సమాచారం."గౌహతిలోని పిచ్ ఎర్ర మట్టితో తయారు అవుతోంది. సాధారణంగా ఈ ట్రాక్‌పై స్పీడ్‌, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా హోం సీజన్ ప్రారంభానికి ముందే తమ డిమాండ్లు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పిచ్‌లో టర్న్ ఉంటే వేగంతో ఎక్కువగా బౌన్స్ కూడా ఉం‍టుంది. ఎక్కువ అస్థిరమైన బౌన్స్ లేకుండా ఉండేలా క్యూరేటర్లు ప్రయత్నిస్తున్నారు" అని బీసీసీఐ అధికారి ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో పేర్కొన్నారు. కాగా తొలి టెస్టు జరిగిన ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. బౌల‌ర్ల‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇరు జ‌ట్లు బ్యాట‌ర్లు తేలిపోయారు. టెస్టు మొత్తంలో ఒక్క జ‌ట్టు కూడా 200 ప‌రుగుల స్కోర్ దాట‌లేక‌పోయింది. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ పిచ్ క్యూరేట‌ర్‌కు స‌పోర్ట్‌గా నిలిచాడు. ఆ పిచ్ పూర్తిగా తన అభ్యర్థన మేరకే తయారు చేశారని గంభీర్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి పిచ్‌ కారణం కాదని, బ్యాటింగ్‌ వైఫల్యమేనని గౌతీ పేర్కొన్నాడు.

Mushfiqur Rahim Creates History Becomes 1st Bangladesh Cricketer To6
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్‌ రహీమ్‌

సుదీర్ఘ కెరీర్‌లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన ముష్ఫికర్‌ రహీమ్‌ (Mushfiqur Rahim) అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఢాకా వేదికగా బుధవారం ఐర్లాండ్‌ (BAN vs IRE Test)తో మొదలైన టెస్టు మ్యాచ్‌ అతడి కెరీర్‌లో 100వది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్‌ ఆటగాడిగా ముష్ఫికర్‌ రహీమ్‌ గుర్తింపు పొందాడు.కాగా 18 ఏళ్ల 17 రోజుల వయసులో మొదటి టెస్టు ఆడిన ముష్ఫికర్‌ రహీమ్‌..‌ ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం (Lord's Stadium)లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తర్వాతి రోజుల్లో బంగ్లా తరఫున అత్యంత కీలక ఆటగాడిగా అతడు ఎదిగాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌గాటెస్టుల్లో పెద్ద స్థాయికి చేరలేకపోయిన తన టీమ్‌ వరుస పరాజయాల్లో భాగమైన రహీమ్‌...జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.సచిన్‌ టెండూల్కర్, ఇమ్రాన్‌ ఖాన్‌ తర్వాతవికెట్‌ కీపర్‌గా జట్టులోకి వచ్చినా... క్రమేణా తన బ్యాటింగ్‌కు మెరుగులు దిద్దుకొని కీపింగ్‌ వదిలేసి రెగ్యులర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌గా ముష్ఫికర్‌ రహీమ్‌ సత్తా చాటాడు. సచిన్‌ టెండూల్కర్, ఇమ్రాన్‌ ఖాన్‌ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్‌ ఉన్న (20 ఏళ్ల 5 నెలల 25 రోజులు) ఆటగాడిగా అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడం విశేషం. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ తరఫున 99 టెస్టుల్లో ముష్ఫికర్‌ రహీమ్‌ 38.02 సగటుతో 6351 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌కు 34 టెస్టుల్లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అతడు ...55 టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఐర్లాండ్‌రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సెల్హైట్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌.. ఐరిష్‌ జట్టును ఇన్నింగ్స్‌ మీద 47 పరుగుల తేడాతో ఓడించింది.ఇక బంగ్లా- ఐర్లాండ్‌ మధ్య బుధవారం ఢాకా వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్‌ 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.ఓపెనర్లలో మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ 34, షాద్‌మాన్‌ ఇస్లాం 35 పరుగులు చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ నజ్ముల్‌ హుసేన్‌ షాంటో (8) విఫలమయ్యాడు.వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొమినుల్‌ హక్‌ (17*)కు తోడుగా ముష్ఫికర్‌ రహీమ్‌ (3*) క్రీజులో ఉన్నాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ ఆండీ మెక్‌బ్రిన్‌ మూడు వికెట్లు కూల్చాడు. చదవండి: IPL 2026: రసెల్‌, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!

MS Dhoni still on field captain of CSK Gaikwad just on paper: Kaif7
IPL 2026: ‘అతడొక డమ్మీ కెప్టెన్‌.. చేసేదంతా వేరొకరు’

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2026 సీజన్‌ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్‌, రిలీజ్‌ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పాటలో పాల్గొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)నే తమ సారథిగా కొనసాగిస్తానని చెప్పడం విశేషం. రవీంద్ర జడేజాను ఇచ్చేసి.. రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న సంజూ శాంసన్‌ (Sanju Samson)కు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, యాజమాన్యం మాత్రం రుతు వైపే మొగ్గుచూపింది.ఇప్పుడే జట్టులో చేరిన సంజూ శాంసన్‌ను ప్రస్తుతానికి వైస్‌ కెప్టెన్‌గా నియమించాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడొక డమ్మీ కెప్టెన్‌.. రుతురాజ్‌ గైక్వాడ్‌ కేవలం పేపర్‌ మీద మాత్రమే సారథిగా కనిపిస్తాడని.. అతడొక డమ్మీ కెప్టెన్‌ అని అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్‌ ధోనినే మైదానం లోపల, వెలుపల నిజమైన సారథిగా వ్యవహరిస్తాడని కైఫ్‌ పేర్కొన్నాడు.‘‘ధోని బ్యాటింగ్‌ చేయడానికి తుదిజట్టులోకి రాడు. 20 ఓవర్ల పాటు వికెట్‌ కీపింగ్‌ చేయడానికి.. 20 ఓవర్ల పాటు కెప్టెన్సీ చేయడానికి మాత్రమే జట్టులో ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడాలో మైదానంలోనే మార్గదర్శనం చేస్తాడు.అంతా ధోని కనుసన్నల్లోనేగైక్వాడ్‌ను గైడ్‌ చేయడానికే ధోని మైదానంలో ఉంటాడు. మెంటార్‌గా, కెప్టెన్‌గా మాత్రమే ధోని మైదానంలో దిగుతాడు. పేపర్‌ మీద మాత్రం గైక్వాడ్‌ పేరు కెప్టెన్‌గా ఉంటుంది. అయితే, మైదానంలో, మైదానం వెలుపల అంతా ధోని కనుసన్నల్లోనే నడుస్తుంది.కాబట్టి ధోని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వస్తాడని అనుకోవడం పొరపాటే. తనకు తానుగా ధోని ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప.. అతడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చే అవకాశమే లేదు’’ అని కైఫ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ధోని వారసుడిగాకాగా చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ కెప్టెన్‌ ధోని. అయితే, 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ధోని ప్రకటించగా.. వరుస మ్యాచ్‌లలో ఓటమి నేపథ్యంలో జడ్డూ మధ్యలోనే వైదొలిగాడు. దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2024లో రుతురాజ్‌ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ 2025లో గాయం వల్ల రుతు కూడా మధ్యలోనే దూరం కాగా.. మళ్లీ ధోనినే సారథిగా వ్యవహరించాడు. చదవండి: IPL 2026: రసెల్‌, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!

Washington Sundar not a No.3 batter, India need to rethink his spot: Ganguly8
గంభీర్ ఆలోచించుకో.. మూడో స్థానానికి అతడు స‌రిపోడు: గంగూలీ

గౌహ‌తిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య రెండో టెస్టు శ‌నివారం(న‌వంబ‌ర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది. తొలి టెస్టులో చేసిన త‌ప్పిదాల‌ను గౌహ‌తిలో పునరావృతం చేయకూడదని భారత్ పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో టీమ్ మేనెజ్‌మెంట్‌కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సూచనలు చేశాడు. నంబర్ 3 స్ధానానికి వాషింగ్ట‌న్ సుంద‌ర్ స‌రిపోడని, టాప్ 5లో క‌చ్చితంగా స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండాల‌ని దాదా అభిప్రాయ‌ప‌డ్డాడు. కాగా కోల్‌క‌తా టెస్టులో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన సుంద‌ర్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి 60 ప‌రుగులు చేశాడు. వాస్త‌వానికి ఆ స్ధానం సాయి సుద‌ర్శ‌న్‌ది. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో నిరాశ‌ప‌రిచిన సుద‌ర్శ‌న్ స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం స‌త్తాచాటాడు.అయిన‌ప్ప‌టికి స‌ఫారీల‌తో తొలి టెస్టుకు సుద‌ర్శ‌న్‌ను టీమ్ మేనెజ్‌మెంట్ ప‌క్క‌న పెట్టింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్‌పై చాలా మంది మాజీలు విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాకుండా తొలి టెస్టులో న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో భార‌త్ బ‌రిలోకి దిగింది."వాషింగ్ట‌న్ సుంద‌ర్ అద్భుత‌మైన క్రికెటర్‌. అత‌డికి మంచి ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్‌లో మూడో నంబ‌ర్ స్ధానానికి అత‌డు స‌రిపోడు. గ‌తంలో చాలా మంది దిగ్గ‌జాలు ఆ స్ధానంలో బ్యాటింగ్ చేశారు. దీర్ఘ కాల ప్ర‌ణాళిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. టాప్‌-5లో కచ్చితంగా స్పెషలిస్టు బ్యాటర్లు ఉండాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ వంటి ‍కఠిన పరిస్ధితుల్లో కూడా బ్యాటింగ్ చేస్తే సత్తా ఉన్న ఆటగాళ్లకి టాప్-5లో చోటు ఇవ్వాలి. గౌతమ్ గంభీర్‌ దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. తొలి టెస్టులో వాషి కేవలం​ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. పిచ్‌పై టర్న్ వున్నప్పటికి ప్రధాన స్పిన్నర్లు ముగ్గురు జట్టులో ఉంటే సరిపోతుంది" అని ఇండియా టూడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.చదవండి: 'ద్రవిడ్‌నే ట్రోల్ చేశారు.. ఇప్పుడు గంభీర్ ఒక లెక్కా'

Gautam Gambhir finds support amid criticism9
'ద్రవిడ్‌నే ట్రోల్ చేశారు.. ఇప్పుడు గంభీర్ ఒక లెక్కా'

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం అందరని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. అంతేకాకుం‍డా ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది.ఇరు జట్లు కూడా ఒక్కసారి కూడా 200 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాయి. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచి బౌలర్లే ఆధిపత్యం చెలాయించారు. దీంతో పిచ్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఇటువంటి పిచ్‌లు టెస్టు క్రికెట్ నాశనం చేస్తున్నాయి అని మాజీలు మండిపడ్డారు. అయితే ఈడెన్ పిచ్‌ను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్ధించడం కొత్త వివాదానికి దారితీసింది.పిచ్‌లో భూతాలు లేవని, బ్యాటర్లు తప్పిదం వల్లే ఓడిపోయామని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలను అనిల్ కుంబ్లే, డెల్ స్టెయిన్ వంటి దిగ్గజాలు తప్పుబట్టారు. అస్సులు ఇటువంటి పిచ్‌ను తాము చూడలేదని వారు ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం గంభీర్‌కు మద్దతుగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఓటమికి గంభీర్‌ను బాధ్యుడిని చేయకూడదని ఊతప్ప అభిప్రాయపడ్డాడు."నేను గంభీర్‌ను డిఫెండ్ చేస్తున్నానని విమర్శిస్తున్నారు. కానీ మ్యాచ్ ఫలితాన్ని కోచ్‌తో ముడిపెట్టడం సరికాదు. ఎందుకంటే మైదానంలో కోచ్ వెళ్లి ఆడలేడు కాదా. గెలుపు ఓటములు సహజం. గతం‍లో రాహుల్ ద్రవిడ్‌ను కూడా ఈ విధంగానే విమర్శించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 25 వేల ప‌రుగులు చేసిన ద్ర‌విడ్‌ను ట్రోల్ చేసిన‌ప్పుడు.. గంభీర్ వారికి ఒక లెక్క‌ కాదు. గతంలో దేశ‌వాళీ టోర్నీలో పేల‌వ‌మైన పిచ్‌ల‌ను తయారు తయారుచేసినందుకు క్యూరేటర్లను బీసీసీఐ మంద‌లించింది. కానీ అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ విషయంలో​ మాత్రం అలా జరగడం లేదు. టర్నింగ్ ట్రాక్‌లను సిద్దం చేయ‌మ‌ని ఎవ‌రూ ప్రోత్స‌హించ‌రు. కానీ సహజంగా మూడో రోజు, నాలుగో రోజులలో ఎక్కువ టర్న్ ఉండే పిచ్‌లు ఉపఖండంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్పిన్‌ బాగా ఆడే ప్లేయర్లు తాయారు చేయాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. గత కొన్నేళ్ల నుంచి మనల్ని స్పిన్‌ సమస్య వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ సమస్యపై టీమ్‌ మెనెజ్‌మెంట్‌, సెలక్టర్లు దృష్టిసారించాలని ఊతప్ప పేర్కొన్నాడు.చదవండి: PAK vs ZIM: పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్‌

Ranji Trophy 2025-26: Karnataka beat Chandigarh10
రవిచంద్రన్‌ డబుల్‌ సెంచరీ.. కర్ణాటక ఘనవిజయం

రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో కర్ణాటక జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. చండీగఢ్‌తో మంగళవారం ముగిసిన పోరులో కర్ణాటక ఇన్నింగ్స్, 185 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్‌ స్కోరు 72/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన చండీగఢ్‌... 63.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మనన్‌ వోహ్రా (161 బంతుల్లో 106 నాటౌట్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేయగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ 7 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్న కర్ణాటక జట్టు... ప్రత్యరి్థని ఫాలోఆన్‌ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే వైఫల్యం కొనసాగించిన చండీగఢ్‌ 33.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. శివమ్‌ బాంబ్రీ (43) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్‌ మనన్‌ వోహ్రా (6) సహా మిగిలిన వాళ్లంతా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ 3, శిఖర్‌ శెట్టి 5 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ను 547/8 వద్ద డిక్లేర్‌ చేసింది. డబుల్‌ సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్‌ రవిచంద్రన్‌ స్మరణ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక 2 విజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. షాబాజ్‌ అహ్మద్‌ సెంచరీ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ (122 బంతుల్లో 101; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అస్సాంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో బెంగాల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109.1 ఓవర్లలో 442 పరుగులకు ఆలౌటైంది. సుమంత గుప్తా (97) మూడు పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు. టీమిండియా ప్లేయర్‌ మొహమ్మద్‌ షమీ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసింది. షమీ (2/29) వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి అస్సాంను కట్టడి చేశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న అస్సాం ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరు సమం చేసేందుకే ఇంకా 144 పరుగులు చేయాల్సి ఉంది. విహారి, విజయ్‌ విఫలం రంజీ ట్రోఫీలో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ఆటగాళ్లు హనుమ విహారి, విజయ్‌ శంకర్‌ మరోసారి విఫలమయ్యారు. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా రైల్వేస్‌తో జరిగిన పోరులో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో విహారి 42 బంతులాడి 6 పరుగులు చేయగా... విజయ్‌ శంకర్‌ (11) కూడా ఫ్రభావం చూపలేకపోయాడు. దీంతో త్రిపుర రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా రైల్వేస్‌ జట్టు ఇన్నింగ్స్‌ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులే చేయగా... రైల్వేస్‌ 446/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. రాజ్‌ చౌదరీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో గోవా పోరాడుతోంది. సౌరాష్ట్ర 585/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా... గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో కేరళ జట్టు 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్‌ కాగా... కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సచిన్‌ బేబీ (85 బ్యాటింగ్‌), బాబా అపరాజిత్‌ (89 బ్యాటింగ్‌) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో మ్యాచ్‌లో ముంబై జట్టు విజయానికి చేరువైంది. ముంబై 630/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా... పాండిచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. 570/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన రాజస్తాన్‌కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా జట్టు విజయానికి 203 పరుగుల దూరంలో ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 169 పరుగులు చేయగా... బరోడా 166 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 272 పరుగులు చేసి బరోడా ముందు 276 పరుగుల లక్ష్యం నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్‌ రింకూ సింగ్‌ (157 బంతుల్లో 98 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడటంతో ఉత్తర ప్రదేశ్‌ జట్టు 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు జట్టు 455 పరుగులకు ఆలౌట్‌ కాగా... ఉత్తరప్రదేశ్‌ ప్రస్తుతం 116 పరుగులు వెనుకబడి ఉంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement