Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Nitish Kumar Reddy disrespected by Gautam Gambhir's team management1
నితీష్ నిజంగా ఆల్‌రౌండరేనా..?

నితీశ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెట‌ర్‌. బోర్డర్ గవాస్క‌ర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్‌.. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై స‌త్తాచాటాడు. ప్ర‌తిష్టాత్మ‌క మెల్‌బోర్న్ మైదానంలో సెంచ‌రీ చేసి ఆపై భార‌త జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా మారాడు. గ‌తేడాది టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి.. ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్‌లో వ‌న్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే అద్భుత‌మైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్న నితీశ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం స‌రిగ్గా ఉప‌యోగించుకోవడంలో విఫ‌ల‌మైంది.నితీశ్‌ రోల్‌ ఏంటి?హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ తీరును చూస్తుంటే నితీశ్ నిజంగా ఆల్‌రౌండరేనా సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. నితీశ్ ప్ర‌ధాన జ‌ట్టుకు ఎంపిక అవుతున్న‌ప్ప‌టికి తుది జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్కించుకోలేక‌పోతున్నాడు. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ నితీశ్ తిరిగి స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. అయితే ఈ సిరీస్‌లో నితీశ్‌తో కనీసం పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయించలేదు.ఆ త‌ర్వాత సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్ప‌టికి ఈడెన్ గార్డెన్స్ టెస్టు ముందు అత‌డిని జ‌ట్టు నుంచి రిలీజ్ చేశారు. అయితే కోల్‌క‌తా టెస్టులో భార‌త్ ఘోర ఓట‌మి పాల‌వ్వ‌డం, శుభ్‌మ‌న్ గిల్ గాయప‌డ‌డంతో అత‌డికి మ‌ళ్లీ పిలుపు నిచ్చారు.అయితే గౌహ‌తి వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు తుది జ‌ట్టులో నితీశ్‌కు చోటు ద‌క్కింది. కానీ ఈ మ్యాచ్‌లో కూడా నితీశ్‌కు ఎక్కువ ఓవ‌ర్లు బౌలింగ్ చేసే అవ‌కాశం ల‌భించ‌లేదు. రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి కేవ‌లం ప‌ది ఓవ‌ర్లు మాత్ర‌మే నితీశ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 150 ఓవ‌ర్లు పైగా బౌలింగ్ చేస్తే.. నితీశ్‌కు కేవ‌లం 6 ఓవ‌ర్లు ద‌క్కాయి. నితీశ్ త‌న మీడియం పేస్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్ట‌గ‌ల‌డు.ఇంతకుముందు ఆసీస్‌, ఇంగ్లండ్ టూర్‌ల‌లో బంతితో కూడా నితీశ్ స‌త్తాచాటాడు. కానీ స్వ‌దేశంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎందుకు బౌలింగ్ చేయించడం లేదో ఆర్ధం కావ‌డం లేదు. అదేవిధంగా ఆసీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 5 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు.దీంతో గంభీర్‌పై అశ్విన్‌, ఆకాష్ చోప్రా వంటి మాజీలు విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపించారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో అత‌డిని జ‌ట్టులోకి తీసుకున్న‌ప్పుడు ఎందుకు బౌలింగ్ చేయించ‌డం లేద‌ని అశ్విన్ ప్ర‌శ్నించాడు.నితీశ్‌కు నో ఛాన్స్‌సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు కూడా నితీశ్ ఎంపిక‌య్యాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవ‌కాశం రాలేదు. ప్ర‌ధాన ఆల్‌రౌండ‌ర్‌గా జ‌ట్టులోకి తీసుకుని అత‌డిని బెంచ్‌కే ప‌రిమితం చేయ‌డాన్ని చాలా మంది త‌ప్పుబ‌డుతున్నారు. అదేవిధంగా మొన్న‌టివ‌ర‌కు టీ20ల్లో భాగంగా ఉన్న నితీశ్‌ను పాండ్యా రావ‌డంతో జ‌ట్టు నుంచి త‌ప్పించారు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక భార‌త జ‌ట్టులో ఈ ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. దీనిబ‌ట్టి నితీశ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ణాళిక‌ల‌లో లేనిట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత న్యూజిలాండ్‌తో జ‌రిగే ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌లో కూడా నితీశ్ ఆడే సూచ‌న‌లు క‌న్పించ‌డం లేదు. దీంతో ఆరు నెల‌ల త‌ర్వాత శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు నితీశ్‌ తిరిగి భార‌త జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ సిరీస్ శ్రీలంకలో జ‌ర‌గ‌నుందున నితీశ్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో క‌చ్చితంగా చోటు ద‌క్కుతుందో లేదో తెలియ‌దు. ఉప‌ఖండ పిచ్‌లు ఎక్కువ స్పిన్‌కు అనుకూలించ‌నుంద‌న అక్ష‌ర్‌, కుల్దీప్‌, జ‌డేజాల‌తో భార‌త్ ఆడే ఛాన్స్ ఉంది.చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ

Australia go 2 up in the Ashes, defeat England by eight wickets in Brisbane2
యాషెస్‌ రెండో టెస్టు.. ఇంగ్లండ్‌పై ఆసీస్‌ గ్రాండ్‌ విక్టరీ

యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు రెండు వికెట్లు కోల్పోయి చేధించారు. ట్రావిస్ హెడ్ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచినప్పటికి.. జెక్ వెదర్‌ల్డ్ 17, స్టీవ్ స్మిత్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.అదరగొట్టిన రూట్‌..ఈ పింక్‌బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. వెటరన్ బ్యాటర్ (206 బంతుల్లో 138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ 76 పరుగులు చేశాడు. ఆఖరిలో జోఫ్రా ఆర్చర్( 38 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మరోసారి 6 వికెట్లతో సత్తాచాటాడు.అనంతరం ఇంగ్లీష్ జట్టుకు ఆసీస్ ధీటైన సమాధానమిచ్చింది. స్మిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. స్టార్ మిచెల్ స్టార్క్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెక్ వెదర్‌ల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65) పరుగులు, స్టీవ్ స్మిత్ (61), (అలెక్స్ క్యారీ 63) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ ఫెయిల్‌..ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తేలిపోయారు. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు కేవలం 241 పరుగులకే ఆలౌటైంది. జాక్ క్రాలీ(44), స్టోక్స్‌(50) రాణించినప్పటికి.. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో పర్యాటక జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.ఈ క్రమంలో ఆసీస్ ముందు కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ మైఖల్ నీసర్ ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ

Ganguly suggests Shubman Gill as Indias all-format captain3
సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ

భారత పురుషల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండేవిధంగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టీమిండియా సారథిగా శుభ్‌మన్ గిల్ ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ ఏడాది మేలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు జట్గు పగ్గాలను గిల్ చేపట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కు ముందు వన్డే జట్టు బాధ్యతలను కూడా గిల్‌కే బీసీసీఐ అప్పగించింది. అంతేకాకుండా టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా గిల్‌ను ఎంపిక చేశారు.దీంతో రాబోయో రోజుల్లో పొట్టి క్రికెట్‌లో కూడా గిల్‌ను సారథిగా నియమించే యోచనలో ఉన్నట్లు ఆర్ధమవుతోంది. అయితే టీ20 ప్రపంచకప్‌-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్ధానంలో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా లేదా జస్ప్రీత్‌ బుమ్రా ఎంపిక అవుతారని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం జట్టు బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. అయితే సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పు బట్టారు. కానీ సూర్య మాత్రం తన అద్భుత కెప్టెన్సీతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో భారత్ ఆడిన 22 మ్యాచ్‌లలో కేవలం రెండింట మాత్రమే ఓడిపోయింది.అయినప్పటికి టీ20ల్లో కూడా గిల్‌ను కెప్టెన్‌గా చేయాలని చాలా మంది బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు."సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శుభ్‌మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్‌గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. వెంటనే నేను అవునాని సమాధానమిచ్చాను. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి.శుభ్‌మన్ ఏ ఫార్మాట్‌లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు నెలల క్రితం అతడు ఇంగ్లండ్‌లో ఏమి చేశాడో మనమందరం చూశాము. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు" అని 'కెప్టెన్'స్ కామ్' పోడ్‌కాస్ట్‌లో దాదా పేర్కొన్నాడు.చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్‌.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?

Palaash Mucchal reacts after Smriti Mandhana calls off wedding4
మంధానతో పెళ్లి క్యాన్సిల్‌.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?

భారత స్టార్‌ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన తన పెళ్లి రద్దు అయినట్లు మంధాన సోషల్ మీడియాలో ప్రకటించింది."గత కొద్ది రోజులగా నా వ్యక్తిగతం జీవితంపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. వాటిపై స్పందించాల్సిన అవసరముంది. నా పెళ్లి రద్దైందని క్లారిటీ ఇస్తున్నా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. దయచేసి ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంటుంది. భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యమని" ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.ముచ్ఛల్ ఏమన్నాండంటే?ఇక స్మృతి మంధానాతో తన బంధం ముగిసిందని పలాష్ ముచ్ఛల్ సైతం ధ్రువీకరించాడు. తాము విడిపోవ‌డానికి సంబంధించిన నిరాధారమైన వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ముచ్ఛల్ తెలిపాడు."నా వ్యక్తిగత సంబంధం నుండి బయటకు వచ్చాను. నా జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. నిరాధారమైన వార్తలను ప్రజలు అంత సులభంగా నమ్మడం చూసి చాలా బాధగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్ట కాలం. కానీ ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటకు వస్తానన్న నమ్మకం ఉంది.ఆధారాల్లేని వదంతులను ప్రచారం చేసేముందు.. ఏది నిజం, ఏది అబద్దమని ఒక్కసారి ఆలోచించుకోవాలి. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నిరాధారమైన వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ముచ్ఛల్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.కాగా ముచ్చ‌ల్‌- స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రి గుండెపోటుకు గుర‌య్యాడు. అత‌డిని హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీంతో త‌న పెళ్లిని మంధాన వాయిదా వేసుకుంటున్న‌ట్లు ఆమె మేనేజర్ మీడియాతో తెలిపాడు. ఆ తర్వాత ముచ్చల్ కూడా అనారోగ్యంతో అస్పత్రిలో చేరాడు. అయితే మంధాన తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. దీంతో మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‍స్మృతి చేతికి నిశ్చితార్థం రింగ్ లేకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుంది. ఈ నేపథ్యంలోనే మంధాన, ముచ్చల్ ఇద్దరూ తాము విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.చదవండి: సూపర్‌ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్‌ కీలక నిర్ణయం

Smriti Mandhana confirms wedding with Palash Mucchal called off, requests privacy for both families5
ముచ్చల్‌తో వివాహం రద్దైంది.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మంధన

భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మంధన తన వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వివాహం రద్దైందని స్పష్టంగా తెలిపారు. పలాష్‌ ముచ్చల్‌ పేరు ప్రస్తావనకు రాకుండా విడుదల చేసిన పోస్ట్‌లో మంధన ఈ విధంగా రాసుకొచ్చారు.వివాహం రద్దుగత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. కానీ ఇప్పుడు మాట్లాడటం అవసరం. వివాహం రద్దైంది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను.🚨 A STATEMENT BY SMRITI MANDHANA 🚨 pic.twitter.com/HAoHLlSIHt— Johns. (@CricCrazyJohns) December 7, 2025ప్రైవసీ ఇవ్వండిఇదే పోస్ట్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ .. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. మేము మా స్థాయిలో ఈ విషయాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలనుకుంటున్నామని పేర్కొన్నారు.కెరీర్‌పై దృష్టిమంధన కెరీర్‌పై దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. నన్ను నడిపించే ఉన్నత లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడం. భారత జట్టుకు విజయాలు అందించడమే నా కర్తవ్యమని పేర్కొన్నారు.అభిమానులకు ధన్యవాదాలు మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చిందంటూ ప్రకటన ముగించారు.కాగా, స్మృతి మంధన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యే మంధన ముచ్చల్‌తో పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ, గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. చివరికి మంధన పెళ్లి రద్దైందంటూ బాంబు పేల్చింది. మంధన ఇటీవల భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.

Mumbai get Jaiswal boost in SMAT push6
సూపర్‌ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్‌ కీలక నిర్ణయం

దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్‌ సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ సీనియర్‌ అధికారి ఒకరు ధృవీకరించారు.జైస్వాల్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్‌లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్‌ల్లో 136.42 స్ట్రయిక్‌రేట్‌తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్‌కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్‌ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్‌ స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ కూడా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన హిట్‌మ్యాన్‌ ఈ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్‌ కానీ జైస్వాల్‌ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.ప్రస్తుతం ఎడిషన్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్‌ గ్రూప్‌-ఏలో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. ఈ జట్టుకు నాకౌట్‌ బెర్త్‌ ఇదివరకే ఖరారైంది. ఈ ఎడిషన్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్‌ ఠాకూర్‌ స్వయంగా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ను డిసెంబర్‌ 8న ఒడిషాతో ఆడనుంది.

Special Story on Team india opening berth in ODIs after Jaiswal super century against South africa7
జైస్వాల్‌ సూపర్‌ సెంచరీ.. గిల్‌ టెస్ట్‌లకు మాత్రమే పరిమితం కాక తప్పదా..?

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సూపర్‌ సెంచరీ చేసి టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడటంతో ఆ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసేందుకు జట్టులోకి వచ్చిన జైస్వాల్‌ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెప్టెన్‌నే పోటీదారుగా మారాడు. ఇప్పటికే జట్టు కూర్పు విషయంలో తలలు పట్టుకున్న భారత మేనేజ్‌మెంట్‌కు జైస్వాల్‌ మరో సమస్యగా మారాడు.గిల్‌ వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్దం కావట్లేదు. కెప్టెన్‌ కోసం​ జైస్వాల్‌ను తప్పిస్తారా లేక కెప్టెన్‌నే పక్కకు కూర్చోబెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గిల్‌ రూపేనా జైస్వాల్‌కు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. విజయవంతమైన రైట్‌ అండ్‌ లెఫ్ట్‌ కాంబినేషన్‌ ప్రకారం రోహిత్‌తో పాటు జైస్వాల్‌కు అవకామివ్వాలి. అయితే కెప్టెన్‌ అయిన కారణంగా మేనేజ్‌మెంట్‌ గిల్‌వైపే మొగ్గు చూపుతుంది.అలాగనీ గిల్‌ను అత్యుత్తమ వన్డే బ్యాటర్‌ కాదని అనలేం. గిల్‌ ఈ ఫార్మాట్‌లో చాలా అద్భుతంగా ఆడతాడు. అతనితో సమానంగా జైస్వాల్‌ కూడా ఆడతాడు. సాధారణంగా ఏ జట్టైన రైట్‌ అండ్‌ లెఫ్ట్‌ కాంబినేషన్ కోసం చూస్తుంది. ఈ కోటాలో జైస్వాల్‌కే అవకాశాలు రావాలి. కానీ కెప్టెన్‌ కావడంతో జైస్వాల్‌పై వివక్ష తప్పలేదు. పోనీ జైస్వాల్‌ను కానీ గిల్‌ను కానీ మిడిలార్డర్‌లో ఆడిద్దాదా అంటే, ఆ ఛాన్సే లేదు. మిడిలార్డర్‌లో బెర్త్‌ల కోసం ఇప్పటికే పదుల సంఖ్యలో పోటీ ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో జైస్వాల్‌ సెంచరీ చేసి మేనేజ్‌మెంట్‌ను ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి నెట్టాడు. పక్షపాతాలకు పోకుండా ఉంటే సెంచరీ చేశాడు కాబట్టి జైస్వాల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. జైస్వాల్‌ క్రమంగా రాణిస్తే మాత్రం గిల్‌ వన్డేల నుంచి బ్రేక్‌ తీసుకోవాలి. ‌రోహిత్‌ శర్మ రిటైరయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. రోహిత్‌ చూస్తే 2027 వరకు తగ్గేదేలేదంటున్నాడు. తదుపరి వన్డే సిరీస్‌ సమయానికి మేనేజ్‌మెంట్‌ ఏం చేస్తుందో చూడాలి.వన్డే ఫార్మాట్‌లో గిల్‌ ప్రస్తుత పరిస్థితి ఇది. ఈ పంజాబీ ‍కుర్రాడికి టీ20 ఫార్మాట్‌లోనూ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ఏదో, లాబీయింగ్‌ జరిగి వైస్‌ కెప్టెన్‌ అయ్యాడే కానీ ఈ ఫార్మాట్‌ జట్టులో స్థానానికి అతడు అర్హుడే కాదు. అతను ఆడితే ఓపెనర్‌గా ఆడాలి. లేదంటే లేదు. ఈ ఫార్మాట్‌లో గిల్‌కు అవకాశం ఇవ్వడం కోసం మేనేజ్‌మెంట్‌ ఇద్దరిని బలిపశువులను చేస్తుంది.ఈ ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ రిటైరయ్యాక ఓ ఓపెనింగ్‌ స్థానాన్ని అభిషేక్‌ శర్మ భర్తీ చేశాడు. గత కొద్ది కాలంగా మరో ఓపెనింగ్‌ బెర్త్‌కు సంజూ శాంసన్‌ న్యాయం​ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గిల్‌కు ఆఘమేఘాల మీద వైస్‌ కెప్టెన్సీ కట్టబెట్టి జట్టులో స్థానం కల్పిస్తున్నారు. దీని వల్ల సంజూ మిడిలార్డర్‌కు వెళ్లాల్సి వస్తుంది. వైస్‌ కెప్టెన్‌ కోటాలో గిల్‌కు ఓపెనింగ్‌ స్థానాన్ని కట్టబెట్టినా ఏమైనా న్యాయం చేయగలుగుతున్నాడా అంటే అదీ లేదు. వరుస అవకాశాలను వృధా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్‌ను టీ20 జట్టు నుంచి తప్పించాలని మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి ఎక్కువైంది. త్వరలో ఈ ఫార్మాట్‌లో అతను స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.వన్డేలు చూస్తే అలా. టీ20లు చూస్తే ఇలా. ఇక గిల్‌ స్థానం​ పదిలంగా ఉండేది టెస్ట్‌ల్లో మాత్రమే. ఈ ఫార్మాట్‌ నుంచి కూడా రోహిత్‌ రిటైర్‌ కావడంతో లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌లో గిల్‌-జైస్వాల్‌ టెన్షన్‌ లేకుండా ఆడుకుంటున్నారు. వన్డేల్లో జైస్వాల్‌.. టీ20ల్లో సంజూ (అవకాశాలు వచ్చి ఓపెనర్‌గా) క్రమంగా రాణిస్తూ ఉంటే గిల్‌ వన్డేల్లో కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు టీ20ల్లో స్థానం గల్లంతై, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

Salman Khan Kicks off Round 2 of Indian Supercross Racing League8
ఇండియన్‌ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ ఘనంగా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) సీజన్–2 రెండో రౌండ్‌ పోటీలు హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ మెగాస్టార్, ISRL బ్రాండ్ అంబాసడర్ సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరై వేదికను కదిలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ఈ వేడుకను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో బైకర్ల విన్యాసాలు చూసేందుకు 18,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో బాలయోగి స్టేడియం కిక్కిరిసిపోయింది. బైకర్ల వేగం, నైపుణ్యానికి రేసింగ్‌ అభిమానులు ముగ్దులయ్యారు. ఈ పోటీల్లో 450cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ బోర్డన్ (BB Racing) విజేతగా నిలిచారు. హోండా CRF 450 R బైకర్‌పై విజయం సాధించారు. 250cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన కాల్విన్ ఫోన్‌వియెల్ (Indewheelers Motorsports) యమహా YZ 250పై గెలిచారు. 250cc ఇండియా–ఆసియా మిక్స్ కేటగిరీ విభాగంలో ఇండోనేషియాకు చెందిన నకామి మకరిమ్ (Bigrock Motorsports SX) కవాసకి KX 250పై విజయం సాధించారు.టీమ్ గుజరాత్ ట్రైల్‌బ్లేజర్స్ రౌండ్–2లో ఓవరాల్‌ విక్టరీ సాధించింది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూఎస్‌ఏ, జర్మనీ, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి 36 మంది అంతర్జాతీయ రైడర్లు, 21 దేశాల ప్రతినిధులు పోటీపడ్డారు. భారత రైడర్లలో రుగ్వేద్ బార్గుజే, ఇక్షన్ షణ్‌భాగ్ ఆకట్టుకున్నారు. ఈ పోటీల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ప్రపంచ స్థాయి క్రీడా అవకాశాలు కల్పించడమే తెలంగాణ లక్ష్యమని అన్నారు. ISRL వంటి అంతర్జాతీయ ప్రమాణాల మోటార్‌స్పోర్ట్స్ లీగ్‌లు రాష్ట్రానికి ఉద్యోగాలు, టూరిజం, గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తాయని తెలిపారు.ఇదే సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఎనర్జీ అద్భుతం. భారత, విదేశీ రైడర్లు కలిసి పోటీపడటం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ISRL యువతకు అద్భుత వేదిక అని అన్నారు. ఎండీ మరియు ISRL కో ఫౌండర్‌ వీర్ పటేల్ మాట్లాడుతూ.. కిక్కిరిసిన స్టేడియం, నిరంతర హర్షధ్వానాలు భారత యువతలో మోటార్‌స్పోర్ట్స్ పై ఉన్న ఆసక్తిని సూచిస్తున్నాయని అన్నారు.ISRL గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21, 2025న కేరళలోని కోజికోడ్ EMS కార్పొరేషన్ స్టేడియంలో జరుగనుంది.

South Africa Captain Temba Bavuma Comments after losing the ODI series to team india9
తెలివిగా ఆడలేకపోయాం.. టీమిండియా నాణ్యత చూపించింది: బవుమా

విశాఖ వేదికగా భారత్‌తో నిన్న (డిసెంబర్‌ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కీలకమైన టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌లో తడబడిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరీస్‌లో తొలిసారి టాస్‌ గెలిచిన భారత్‌ పరిస్థితులను అద్భుతంగా సద్వినియోగం చేసుకొని సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో.. ఆతర్వాత బ్యాటింగ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. బౌలింగ్‌లో కుల్దీప్‌, ప్రసిద్ద్‌ కృష్ణ సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్‌ సూపర్‌ సెంచరీతో.. రోహిత్‌, కోహ్లి బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఈ గెలుపుతో భారత్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.మ్యాచ్‌ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా చేయాలని అనుకున్నాం. కానీ బోర్డుపై సరిపడా పరుగులు పెట్టలేకపోయాం. ఇన్నింగ్స్‌ మధ్యలో వికెట్లు బహుమతిగా ఇచ్చేయడం వల్ల ఒత్తిడి పెరిగింది. 50 ఓవర్ల మ్యాచ్‌లో ఆలౌట్‌ కావడం ఎప్పుడూ కష్టమే. డికాక్‌ అద్భుతంగా ఆడినా, ఇతర బ్యాటర్ల నుంచి అతని​కి సరైన సహకారం లభించలేదు. కీలక సమయాల్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అందువల్లే జట్టు కష్టాల్లో పడింది. వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్‌కు శుభారంభం లభించినా, ఆతర్వాత దారి తప్పాను. మొదటి రెండు వన్డేల్లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధైర్యం చూపాము. కానీ ఈ మ్యాచ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో వికెట్లు కోల్పోయాము. తొలుత బంతితో బాగా పోరాడాం. మొదటి స్పెల్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కానీ బోర్డుపై సరిపడా స్కోర్‌ లేకపోవడంతో భారత బ్యాటర్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మొత్తంగా భారత జట్టు తమ నాణ్యతను చూపించింది. మేము తెలివిగా ఆడలేకపోయాముం. ఈ సిరీస్‌లో చాలా పాఠాలు నేర్చుకున్నాము. జట్టుగా ఎదిగాము. మేము ఎప్పుడూ ప్రత్యర్థిపై దాడి చేయాలని మాట్లాడుకుంటాం. భారత్‌కి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా, వారిపై ఒత్తిడి పెట్టగలిగాం. పరిస్థితులను గుర్తించి మరింత తెలివిగా ఆడటం నేర్చుకోవాలి. పది బాక్సుల్లో ఆరు లేదా ఏడు టిక్ చేశామని అనుకుంటున్నానని బవుమా అన్నాడు.

Team India Captain KL Rahul Comments After winning the ODI series against South Africa10
సిరీస్‌ మొత్తంలో గర్వపడిన సందర్భం అదే: కేఎల్‌ రాహుల్‌

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్‌ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటింది. తొలుత బౌలర్లు.. ఆతర్వాత బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయాన్నందించారు.మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్పందిస్తూ ఇలా అన్నాడు. అతని మాటల్లో.. టాస్ గెలుపు చాలా కీలకం. టాస్‌ తప్ప ఈ మ్యాచ్‌ గెలుపులో నా పాత్ర ఏమీ లేదు. ఈ సిరీస్‌ మొత్తంలో గర్వపడిన సందర్భం టాస్ గెలిచినప్పుడే.తొలి రెండు వన్డేల్లో టాస్‌ ఓడటం వల్ల సెకెండ్‌ ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేయవల్సి వచ్చింది. మంచు కురిసే వేళల్లో అది బౌలర్లకు విషమ పరీక్ష. ఈ రోజు టాస్‌ గెలిచి బౌలర్లను ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాను.పిచ్‌ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. అయినా మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేసి వికెట్లు సాధించారు. ప్రసి​ద్ద్‌ తొలుత ఇబ్బంది పడినా, ఆతర్వాతి స్పెల్‌లో మ్యాచ్‌ గతినే మార్చేశాడు. ఆతర్వాత కుల్దీప్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. వారి తరఫున డికాక్‌ అద్భుతంగా ఆడాడు. అతడి వికెట్‌ చాలా కీలకం. సిరీస్‌ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒత్తిడిని బాగా హ్యాండిల్‌ చేశాం. సిరీస్‌ ఆధ్యాంతం సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్బుతంగా బ్యాటింగ్‌ చేశారు. మా బౌలర్లపై అధికమైన ఒత్తిడి ఉండింది. రెండో వన్డేలో అదృష్టం మా పక్షాన లేదు. అందుకే ఓడాం.కాగా, నిన్నటి వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసింది. ప్రసి​ద్ద్‌ కృష్ణ (9.5-0-66-4), కుల్దీప్‌ యాదవ్‌ (10-1-41-4) అద్భుతంగా బౌలింగ్‌ చేసి సౌతాఫ్రికాను 270 పరుగులకే పరిమితం చేశారు. డికాక్‌ (106) ఒక్కడే సెంచరీతో పోరాటం చేశాడు. బవుమా (48) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (116 నాటౌట్‌) సూపర్‌ సెంచరీతో.. రోహిత్‌ (75), కోహ్లి (65 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా భారత్‌ 39.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement