Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Suryakumar, Shubman Gill hurting India Ahead T20 worldcup 20261
‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

టీ20 వరల్డ్‌కప్‌-2026కు కౌంట్‌డౌన్ మొద‌లైంది. మ‌రో 55 రోజుల్లో భార‌త్‌, శ్రీలంక వేదిల‌క‌గా ఈ మెగా టోర్న‌మెంట్ షూరూ కానుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఇద్ద‌రు ప్లేయ‌ర్ల పేల‌వ ఫామ్‌ భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. అందులో ఒకరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా.. మరొకరు అతడి డిప్యూటీ శుభ్‌మన్ గిల్‌.టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వీరిద్ద‌రూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.సూర్యకు ఏమైంది..?ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా పేరున్న సూర్యకుమార్.. 2025లో మాత్రం ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఐపీఎల్‌-2025లో రాణించిన‌ప్ప‌టికి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్‌గా జ‌ట్టును విజ‌యప‌థంలో న‌డిపిస్తున్న‌ప్ప‌టికి వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా మాత్రం తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు.ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 18 అంత‌ర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 స‌గ‌టుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సంవత్సరం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడి టాప్ స్కోర్ 38 పరుగులగా ఉంది. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్య తన చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. తనపై తనకే నమ్మకం లేక ఒక మ్యాచ్‌లో మూడో స్ధానంలో.. మరో మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఒకప్పుడు సూర్య క్రీజులో ఉంటే బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడేవారు. కానీ ఇప్పుడు అతడి వీక్‌నెస్‌ను పసిగట్టిన బౌలర్లు.. అతడిని చాలా ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికాతో మూడు, న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లలో సూర్య తిరిగి తన ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. లేదంటే భారత్‌కు బ్యాటింగ్‌ కష్టాలు తప్పవు. ఈ సిరీస్‌లో తొలి టీ20లో కేవలం 12 పరుగులు చేసిన సూర్యకుమార్‌.. రెండో టీ20లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మూడో మ్యాచ్‌లోనైనా ఈ ముంబై ఆటగాడు తన బ్యాట్‌కు పనిచెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.గిల్ ఢమాల్‌..ఇక మొన్నటివర​కు టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో అస్సలు శుభ్‌మన్ గిల్ లేడు. టీ20ల్లో భారత జట్టు ఓపెనర్లగా సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ ఉండేవారు. కానీ ఆసియాకప్ 2025కు ముందు గిల్‌ను టీ20ల్లో అనూహ్యంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా అప్పటివరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి ఆ బాధ్యతలను గిల్‌కు బీసీసీఐ అప్పగించింది.అయితే ఆల్‌ఫార్మాట్‌గా గిల్‌కు పేరు ఉన్నప్పటికి.. తన టీ20 రీ ఎంట్రీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్‌, ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20ల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. రెండో టీ20ల కనీసం తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను తప్పించి మరి అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ అతడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాపరుస్తున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాబోయో మ్యాచ్‌లలోనైనా కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ ఇద్దరూ తమ ఫామ్‌ను అందుకుంటారో లేదో చూడాలి.చదవండి: IND Vs SA: అర్ష్‌దీప్‌ 13 బంతుల ఓవర్‌.. గంభీర్ రియాక్షన్‌ వైరల్‌

Gautam Gambhir Left Fuming As India Star Scripts Unwanted Record With Marathon Over2
అర్ష్‌దీప్‌ 13 బంతుల ఓవర్‌.. గంభీర్ రియాక్షన్‌ వైరల్‌

ముల్లాన్‌పూర్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో టీ20లో టీమిండియాకు ఘోర ప‌రాభవం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 51 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు అయింది. ముఖ్యంగా బౌలింగ్‌లో అయితే మెన్ ఇన్ బ్లూ పూర్తిగా తేలిపోయింది. ఒక్క వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌ప్ప మిగితా బౌల‌ర్లు అంద‌రూ అట్ట‌ర్‌ప్లాప్ అయ్యారు. స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ అయితే దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ప‌దేప‌దే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ స‌ఫారీ బ్యాట‌ర్ల‌కు టార్గెట్‌గా మారాడు. అస్స‌లు ఏ మాత్రం రిథ‌మ్‌లో కన్పించ‌లేదు.ఒక ఓవ‌ర్‌లో 13 బంతులుప్రోటీస్ ఇన్నింగ్స్ 11వ‌ ఓవ‌ర్ వేసిన అర్ష్‌దీప్ త‌న చెత్త‌ బౌలింగ్‌తో అంద‌రికి చిరాకు తెప్పించాడు. 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1.. ఆ ఓవ‌ర్‌లో అర్ష్‌దీప్ వేసిన బంతుల వ‌రుస ఇది. ఈ పంజాబీ పేస‌ర్ త‌న ఓవ‌ర్‌ను పూర్తిచేసేందుకు ఏకంగా 13 బంతులు వేయాల్సి వ‌చ్చింది. తొలి బంతిని డికాక్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదగా... మిగతా 5 లీగల్‌ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్‌లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. డగౌట్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సైతం అర్ష్‌దీప్‌పై సీరియ‌స్ అయ్యాడు. ఇదేమి బౌలింగ్ అన్న‌ట్లు రియాక్ష‌న్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.చెత్త రికార్డు..అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన ఆఫ్ఘనిస్తాన్ పేస‌ర్‌ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్‌దీప్ సమం చేశాడు. నవీన్ గత ఏడాది హరారేలో జింబాబ్వేపై ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. అయితే భార‌త్ త‌ర‌పున ఈ చెత్త ఫీట్ సాధించిన తొలి బౌల‌ర్ మాత్రం అర్ష్‌దీపే కావ‌డం గ‌మ‌నార్హం.Gautam Gambhir angry at Arshdeep as he bowled 7 wide bowls in an over 💀 pic.twitter.com/EqUa7nFqW5— ••TAUKIR•• (@iitaukir) December 11, 2025చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్‌

ICC Ceo hails success of World Test Championship3
'డబ్ల్యూటీసీ ఫైనల్స్.. మా అంచనాలను అందుకున్నాయి'

దుబాయ్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌ టెస్టు క్రికెట్‌లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయిలో ఉండాలని తాము ఆశించామని... మూడు ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా తమ అంచనాలను అందుకున్నాయని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సీఈఓ సంజోగ్‌ గుప్తా అభిప్రాయ పడ్డారు. 2025లో జరిగిన ఫైనల్స్‌ కోసం లార్డ్స్‌ స్టేడియం పూర్తిగా నిండిపోవడం ఐసీసీ చరిత్రలో నిలిచిపోయే క్షణమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ జరగ్గా... వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి."డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ అంటే మిగతా టెస్టుల తరహాలో కాదు. ఈ ఫార్మాట్‌లో రెండేళ్ల శ్రమ తర్వాత రెండు అత్యుత్తమ జట్లు తలపడే సందర్భం. టెస్టు క్రికెట్‌ విలువ ఏమిటో ఈ మ్యాచ్‌లు చూపించాయి. డబ్ల్యూటీసీ మొదలు పెట్టినప్పుడు మేం ఆశించిన స్పందన ఇక్కడ వచ్చింది. మా అంచనాలు ఫైనల్స్‌ అందుకున్నాయి. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ గానీ ఇంగ్లండ్‌ గానీ ఆడలేదు. అయినా సరే స్టేడియం నిండిపోయింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌పై అభిమానులు ఎంత ఆసక్తిని ప్రదర్శించారో ఇది చూపించింది. అన్నింటికి మించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరో ఆరు నెలల సమయం ఉన్నా కూడా ఎవరు ఫైనల్‌ చేరతారనే చర్చ అన్ని జట్లలో కనిపిస్తోంది. దీనికి అర్హత సాధించే క్రమంలో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల ప్రాధాన్యం ఎంతో పెరిగింది" అని సంజోగ్‌ వ్యాఖ్యానించారు.చదవండి: నేను.. అత‌డే ఈ ఓట‌మికి కార‌ణం! ప్ర‌తీసారి కూడా: సూర్యకుమార్‌

South Africa Creates History Becomes First Team In The World 4
చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. బుధవారం ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో భారత్‌ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌((46 బంతుల్లో 7 సిక్స్‌లు, 5 ఫోర్లతో 90) విధ్వంసం సృష్టించగా.. డొనవాన్‌ ఫెరీరా(16 బంతుల్లో 30), మిల్లర్‌(12 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బౌలర్ల దాటికి భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ బార్ట్‌మన్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. ఎంగిడీ, సిప్లమా, జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది.ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌..ఇక ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో టీమిండియాపై సఫారీలకు ఇది పదమూడో విజయం.ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ రెండు జట్లు భారత్‌పై ఇప్పటివరకు 12 సార్లు టీ20 విజయాలు నమోదు చేశాయి. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను సౌతాఫ్రికా అధిగమించింది.భారత్‌పై అత్యధిక టీ20 విజయాలు సాధించిన జట్లుదక్షిణాఫ్రికా-13ఆస్ట్రేలియా-12ఇంగ్లాండ్‌-12న్యూజిలాండ్-10వెస్టిండీస్10చదవండి: నేను.. అత‌డే ఈ ఓట‌మికి కార‌ణం! ప్ర‌తీసారి కూడా: సూర్యకుమార్‌

Suryakumar Yadav Reflects On His And Shubman Gills Failure5
నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్‌

ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ భారత్ పూర్తిగా తేలిపోయింది. 214 పరుగుల లక్ష్య చేధనలో 19.1 ఓవర్లలో 162 రన్స్‌కే టీమిండియా కుప్పకూలింది.భారత బ్యాటర్లలో తిలక్‌ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(5), శుభ్‌మన్‌ గిల్‌(0), అభిషేక్‌ శర్మ(17) వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. సఫారీ పేసర్‌ బార్ట్‌మాన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, జాన్సెన్‌, సిప్లమా తలా రెండు వికెట్లు సాధించారు.అంతకుముందు క్వింటన్‌ డికాక్‌(90) చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో ప్రోటీస్‌ సమం చేసింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యామని అతడు చెప్పుకొచ్చాడు.అభిషేక్ ఒక్కడే కాదు.."ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం మినహా ఏదీ మాకు అనుకూలించలేదు. టాస్ గెలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ తీసుకుని ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్ సమయానికి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే తొలుత బౌలింగ్ తీసుకున్నాము. కానీ ఆరంభంలోనే ఈ వికెట్‌పై ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ఆ తర్వాత ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో మా బౌలర్లు గ్రహించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది నేర్చుకునే ప్రక్రియ. మేము ఈ ఓట‌మి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము. తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం. మంచు ప్రభావం ఎక్కువ‌గా ఉంది. మా మొద‌టి ప్లాన్ విఫ‌ల‌మైన‌ప్పుడు.. వెంట‌నే మా సెకెండ్ ప్లాన్‌ను అమ‌లు చేయ‌లేక‌పోయాము. కానీ సౌతాఫ్రికా బౌల‌ర్లు మాత్రం రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ఉన్న‌ప్ప‌టికి ఎలా బౌలింగ్ చేయాలో మాకు చూపించారు. మా త‌దుప‌రి మ్యాచ్‌లో వారిని మేము అనుస‌రిస్తాము.బ్యాటింగ్‌లో నేను, శుభ్‌మన్ ఇంకొంచెం బాధ్యత తీసుకోవాల్సింది. అభిషేక్ అద్భుతంగా ఆడుతున్నాడు, కానీ ప్రతిసారీ అతనిపైనే ఆధారపడలేము. శుభ్‌మన్ తొలి బంతికే అవుటయ్యాడు. ఆ స‌మ‌యంలో నేను ఎక్కువ క్రీజులో ఉండి, ఛేజింగ్ బాధ్య‌త‌ను నా భుజాల‌పై వేసుకోవాల్సింది. ఇక అన్ని ఫార్మాట్ల‌లోనూ అక్ష‌ర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో అత‌డిని ప్ర‌మోట్ చేశాము. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో మా ప్లాన్ విజ‌య‌వంతం కాలేదు. ఈ ఓట‌మిని మేము జీర్ణించుకోలేక‌పోతున్నాము. అయిన‌ప్ప‌టికి మా త‌దుప‌రి మ్యాచ్‌లో గ‌ట్టిగా క‌మ్‌బ్యాక్ ఇస్తాం. ధర్మశాలలో కలుద్దాం" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేష‌న్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: యువ భారత్‌కు ఎదురుందా!

Sindhu to compete in Asian Team Badminton Championships6
ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు సింధు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు స్టార్‌ ఆటగాళ్లతో భారత్‌ సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) గురువారం ప్రకటించింది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీల్లో మహిళల విభాగంలో భారత జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌కాగా... పురుషుల విభాగంలో టీమిండియా రెండుసార్లు కాంస్య పతకాలు సాధించింది. ‘ర్యాంకింగ్, ప్రదర్శన, అనుభవం ఆధారంగా జట్లను ఎంపిక చేశాం. మహిళల జట్టును రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సింధు ముందుండి నడిపిస్తుంది’ అని ‘బాయ్‌’ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల జట్టులో భారత నంబర్‌వన్, ప్రపంచ 13వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌తోపాటు ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, రైజింగ్‌ స్టార్స్‌ ఆయుశ్‌ శెట్టి, హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లి ఉన్నారు. భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, రక్షిత శ్రీ, మాళవిక బన్సోద్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ప్రియా కొంజెంగ్‌బమ్, శ్రుతి మిశ్రా, తనీషా క్రాస్టో. భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్‌ మన్నేపల్లి, సాతి్వక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, సాయిప్రతీక్, హరిహరన్‌.

Under 19 Asia Cup cricket tournament from today7
యువ భారత్‌కు ఎదురుందా!

దుబాయ్‌: యువ ఆటగాళ్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసే మరో టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా నేటి నుంచి అండర్‌–19 ఆసియా కప్‌ వన్డే టోర్నమెంట్‌కు తెరలేవనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో నేడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తో యువ భారత జట్టు తలపడనుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌ సహా దేశవాళీ టోర్నీల్లో విధ్వంసక సెంచరీలతో ఇప్పటికే స్టార్‌గా ఎదిగిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో అండర్‌–19 ప్రపంచకప్‌ జరగనుండగా... దానికి ముందు ఈ టోర్నీ మన ప్లేయర్లకు రిహార్సల్‌గా ఉపయోగపడనుంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్‌ షేక్‌’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్‌ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్‌ స్టార్స్‌ ఆసియాకప్‌ టి20 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు పాకిస్తాన్‌ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ‘హ్యాండ్‌ షేక్‌పై ప్లేయర్లు ఏమీ చెప్పలేరు. టీమ్‌ మేనేజర్‌ ఆనంద్‌ దాతర్‌కు బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు అందుతాయి. ఒకవేళ కరచాలనం చేయకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని మ్యాచ్‌ రిఫరీకి ముందే తెలుపుతాం’ అని ఓ అధికారి తెలిపారు. క్రీడల్లో రాజకీయాలకు తావులేదని తెలిసినా... బోర్డు నిర్ణయం మేరకే నడుచుకుంటామని ఆయన అన్నారు. భారత్‌ బరిలోకి దిగుతున్న గ్రూప్‌ ‘ఎ’లోనే దాయాది పాకిస్తాన్‌ కూడా ఉండగా... ఇరు జట్ల మధ్య ఆదివారం మ్యాచ్‌ జరగనుంది. ఈ రెండు జట్లతో పాటు యూఏఈ, మలేసియా జట్లు కూడా గ్రూప్‌ ‘ఎ’లో ఉన్నాయి. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక జట్లు గ్రూప్‌ ‘బి’ నుంచి పోటీ పడుతున్నాయి. భారత్‌ బలంగా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున, దేశవాళీల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగే ఆయుశ్‌ మాత్రే యంగ్‌ ఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నీలో వరుస సెంచరీలతో చెలరేగిన మాత్రేపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మొత్తం టోర్నమెంట్‌కు ప్రధాన ఆకర్షణ అయిన వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సీనియర్‌ క్రికెట్‌లోనే తన దూకుడుతో ప్రకంపనలు సృష్టిస్తున్న వైభవ్‌... ముస్తాక్‌ అలీ టోర్నీలో శతకం బాదిన అతి పిన్నవయసు్కడిగా రికార్డు సృష్టించాడు. 15 మందితో కూడిన భారత జట్టులో ఈ ఇద్దరూ సీనియర్‌ స్థాయిలో వేర్వేరు ఫార్మాట్లలో కలిపి 30కి పైగా మ్యాచ్‌లు ఆడారు. వాటిలో 9 శతకాలు తమ పేరిట లిఖించుకున్నారు. ఈ నయా జనరేషన్‌ జోరును మిగిలిన జట్లు ఏమాత్రం అడ్డుకుంటాయో చూడాలి. వైస్‌ కెపె్టన్‌ విహాన్‌ మల్హోత్రా, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞ, హైదరాబాద్‌ ప్లేయర్‌ ఆరోన్‌ జార్జి కూడా బ్యాటింగ్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్థులే. ముఖ్యంగా ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌కు మినహా... ఇతర జట్లకు 50 ఓవర్ల ఆటలో పెద్దగా అనుభవం లేదు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమే. భారత అండర్‌–19 జట్టు: ఆయుశ్‌ మాత్రే (కెపె్టన్‌), విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞ కుండు, హర్‌వంశ్‌ సింగ్, యువరాజ్‌ గోహిల్, కనిష్క చౌహాన్, ఖిలాన్‌ పటేల్, నమన్‌ పుష్పక్, దీపేశ్, హెనిల్‌ పటేల్, కిషన్‌ కుమార్‌ సింగ్, ఉధవ్‌ మోహన్, ఆరోన్‌ జార్జి.

Olympic berth for Pro Hockey League winners8
ప్రొ హాకీ లీగ్‌ విజేతలకు ఒలింపిక్‌ బెర్త్‌

న్యూఢిల్లీ: 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే హాకీ జట్లను ఎంపిక చేసే ప్రక్రియను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గురువారం వెల్లడించింది. విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో 12 జట్ల చొప్పున పోటీ పడనుండగా... ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా పాల్గొననుంది. ఇక మిగిలిన 11 జట్లను ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్, ఐదు కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్‌ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ‘ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ 2025–26, 2026–27 సీజన్‌లలో విజేతగా నిలిచిన జట్లు విశ్వక్రీడలకు ఎంపికవుతాయి. ఒకవేళ రెండు సీజన్‌లలో ఒకే జట్టు విజేతగా నిలిస్తే... రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు కూడా విశ్వక్రీడలకు అర్హత పొందుతాయి. ఒకవేళ కాంటినెంటల్‌ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అప్పటికే ప్రొ లీగ్‌ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకుంటే... తదుపరి స్థానంలో ఉన్న జట్టుకు ఆ అవకాశం దక్కుతుంది’ అని ఎఫ్‌ఐహెచ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2028 ఆరంభంలో ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లను సైతం నిర్వహించనున్నారు. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొననున్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కూడా ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకుంటాయి.

Indian Womens Football League to start from 20th of this month9
గెట్‌.. సెట్‌... కిక్‌

న్యూఢిల్లీ: పురుషుల జట్లకు నిర్వహించే ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీపై ఒకవైపు సందిగ్ధత కొనసాగుతున్నా... మరోవైపు ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌ (ఐడబ్ల్యూఎల్‌) 2025–2026 సీజన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ తేదీలను అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రకటించింది. కోల్‌కతాలోని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఈనెల 20న ఈ లీగ్‌ మొదలవుతుంది. వచ్చే ఏడాది మే 10వ తేదీ వరకు జరిగే ఈ లీగ్‌లో 8 జట్లు పోటీపడుతున్నాయి. ఈస్ట్‌ బెంగాల్‌ ఎఫ్‌సీ (కోల్‌కతా), గర్వాల్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ (న్యూఢిల్లీ), గోకులం కేరళ ఎఫ్‌సీ (కోజికోడ్‌), కిక్‌స్టార్ట్‌ ఎఫ్‌సీ (బెంగళూరు), నీతా ఫుట్‌బాల్‌ అకాడమీ (కటక్‌), సెసా ఫుట్‌బాల్‌ అకాడమీ (సిర్కయిమ్, గోవా), సేతు ఎఫ్‌సీ (మదురై), శ్రీభూమి ఎఫ్‌సీ (కోల్‌కతా) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. తొలి మ్యాచ్‌లో సేతు ఫుట్‌బాల్‌ క్లబ్‌తో కిక్‌స్టార్ట్‌ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. తొలి అంచె డిసెంబర్‌ 20 నుంచి జనవరి 9వ తేదీ వరకు... రెండో అంచె ఏప్రిల్‌ 20 నుంచి మే 10వ తేదీ వరకు జరుగుతుంది. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. అత్యధిక పాయింట్లు సాధించిన జట్టుకు టైటిల్‌ లభిస్తుంది. లీగ్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఐడబ్ల్యూఎల్‌–2కు పడిపోతాయి. ఐడబ్ల్యూఎల్‌–2లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఐడబ్ల్యూఎల్‌కు ప్రమోట్‌ అవుతాయి. కోల్‌కతాకు చెందిన ఈస్ట్‌ బెంగాల్‌ ఎఫ్‌సీ జట్టు 2024–2025 ఐడబ్ల్యూఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్‌ ఈస్ట్‌ బెంగాల్‌కు తొలి టైటిల్‌ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల సౌమ్య గత ఐడబ్ల్యూఎల్‌ సీజన్‌లో 9 గోల్స్‌ సాధించి అత్యధిక గోల్స్‌ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచింది. గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుకు ఆడిన ఉగాండా ప్లేయర్‌ ఫాజిలా ఇక్వాపుట్‌ 24 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలువగా... ఈస్ట్‌ బెంగాల్‌ జట్టుకు చెందిన ఘనా ప్లేయర్‌ ఎల్షాదాయ్‌ అచీమ్‌పోంగ్‌ 10 గోల్స్‌తో రెండో స్థానంలో, సౌమ్య 9 గోల్స్‌తో మూడో స్థానంలో నిలిచారు.

New Zealand take first innings lead in second Test against West Indies10
న్యూజిలాండ్‌కు ఆధిక్యం

వెల్లింగ్టన్‌: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 24/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ చివరకు 74.4 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాన్‌ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కేన్‌ విలియమ్సన్‌ (37; 7 ఫోర్లు), డారిల్‌ మిచెల్‌ (25; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. విండీస్‌ బౌలర్ల ధాటికి కివీస్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా... మిచెల్‌ హే చివరి వరకు పోరాడి జట్టుకు 73 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందించాడు. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ బ్లెయిర్‌ టిక్నెర్‌ బ్యాటింగ్‌కు రాలేదు. కరీబియన్‌ బౌలర్లలో అండర్సన్‌ ఫిలిప్‌ 3, రోచ్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. జాన్‌ క్యాంప్‌బెల్‌ (14), అండర్సన్‌ ఫిలిప్‌ (0) అవుట్‌ కాగా... బ్రాండన్‌ కింగ్‌ (15 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), కవెమ్‌ హడ్జ్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విండీస్‌ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ, మిచెల్‌ రే చెరో వికెట్‌ పడగొట్టారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement