Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Salman Khan Kicks off Round 2 of Indian Supercross Racing League1
ఇండియన్‌ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ ఘనంగా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) సీజన్–2 రెండో రౌండ్‌ పోటీలు హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ మెగాస్టార్, ISRL బ్రాండ్ అంబాసడర్ సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరై వేదికను కదిలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ఈ వేడుకను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో బైకర్ల విన్యాసాలు చూసేందుకు 18,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో బాలయోగి స్టేడియం కిక్కిరిసిపోయింది. బైకర్ల వేగం, నైపుణ్యానికి రేసింగ్‌ అభిమానులు ముగ్దులయ్యారు. ఈ పోటీల్లో 450cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ బోర్డన్ (BB Racing) విజేతగా నిలిచారు. హోండా CRF 450 R బైకర్‌పై విజయం సాధించారు. 250cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన కాల్విన్ ఫోన్‌వియెల్ (Indewheelers Motorsports) యమహా YZ 250పై గెలిచారు. 250cc ఇండియా–ఆసియా మిక్స్ కేటగిరీ విభాగంలో ఇండోనేషియాకు చెందిన నకామి మకరిమ్ (Bigrock Motorsports SX) కవాసకి KX 250పై విజయం సాధించారు.టీమ్ గుజరాత్ ట్రైల్‌బ్లేజర్స్ రౌండ్–2లో ఓవరాల్‌ విక్టరీ సాధించింది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూఎస్‌ఏ, జర్మనీ, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి 36 మంది అంతర్జాతీయ రైడర్లు, 21 దేశాల ప్రతినిధులు పోటీపడ్డారు. భారత రైడర్లలో రుగ్వేద్ బార్గుజే, ఇక్షన్ షణ్‌భాగ్ ఆకట్టుకున్నారు. ఈ పోటీల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ప్రపంచ స్థాయి క్రీడా అవకాశాలు కల్పించడమే తెలంగాణ లక్ష్యమని అన్నారు. ISRL వంటి అంతర్జాతీయ ప్రమాణాల మోటార్‌స్పోర్ట్స్ లీగ్‌లు రాష్ట్రానికి ఉద్యోగాలు, టూరిజం, గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తాయని తెలిపారు.ఇదే సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఎనర్జీ అద్భుతం. భారత, విదేశీ రైడర్లు కలిసి పోటీపడటం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ISRL యువతకు అద్భుత వేదిక అని అన్నారు. ఎండీ మరియు ISRL కో ఫౌండర్‌ వీర్ పటేల్ మాట్లాడుతూ.. కిక్కిరిసిన స్టేడియం, నిరంతర హర్షధ్వానాలు భారత యువతలో మోటార్‌స్పోర్ట్స్ పై ఉన్న ఆసక్తిని సూచిస్తున్నాయని అన్నారు.ISRL గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21, 2025న కేరళలోని కోజికోడ్ EMS కార్పొరేషన్ స్టేడియంలో జరుగనుంది.

South Africa Captain Temba Bavuma Comments after losing the ODI series to team india2
తెలివిగా ఆడలేకపోయాం.. టీమిండియా నాణ్యత చూపించింది: బవుమా

విశాఖ వేదికగా భారత్‌తో నిన్న (డిసెంబర్‌ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కీలకమైన టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌లో తడబడిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరీస్‌లో తొలిసారి టాస్‌ గెలిచిన భారత్‌ పరిస్థితులను అద్భుతంగా సద్వినియోగం చేసుకొని సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో.. ఆతర్వాత బ్యాటింగ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. బౌలింగ్‌లో కుల్దీప్‌, ప్రసిద్ద్‌ కృష్ణ సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్‌ సూపర్‌ సెంచరీతో.. రోహిత్‌, కోహ్లి బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఈ గెలుపుతో భారత్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.మ్యాచ్‌ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా చేయాలని అనుకున్నాం. కానీ బోర్డుపై సరిపడా పరుగులు పెట్టలేకపోయాం. ఇన్నింగ్స్‌ మధ్యలో వికెట్లు బహుమతిగా ఇచ్చేయడం వల్ల ఒత్తిడి పెరిగింది. 50 ఓవర్ల మ్యాచ్‌లో ఆలౌట్‌ కావడం ఎప్పుడూ కష్టమే. డికాక్‌ అద్భుతంగా ఆడినా, ఇతర బ్యాటర్ల నుంచి అతని​కి సరైన సహకారం లభించలేదు. కీలక సమయాల్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అందువల్లే జట్టు కష్టాల్లో పడింది. వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్‌కు శుభారంభం లభించినా, ఆతర్వాత దారి తప్పాను. మొదటి రెండు వన్డేల్లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధైర్యం చూపాము. కానీ ఈ మ్యాచ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో వికెట్లు కోల్పోయాము. తొలుత బంతితో బాగా పోరాడాం. మొదటి స్పెల్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కానీ బోర్డుపై సరిపడా స్కోర్‌ లేకపోవడంతో భారత బ్యాటర్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మొత్తంగా భారత జట్టు తమ నాణ్యతను చూపించింది. మేము తెలివిగా ఆడలేకపోయాముం. ఈ సిరీస్‌లో చాలా పాఠాలు నేర్చుకున్నాము. జట్టుగా ఎదిగాము. మేము ఎప్పుడూ ప్రత్యర్థిపై దాడి చేయాలని మాట్లాడుకుంటాం. భారత్‌కి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా, వారిపై ఒత్తిడి పెట్టగలిగాం. పరిస్థితులను గుర్తించి మరింత తెలివిగా ఆడటం నేర్చుకోవాలి. పది బాక్సుల్లో ఆరు లేదా ఏడు టిక్ చేశామని అనుకుంటున్నానని బవుమా అన్నాడు.

Team India Captain KL Rahul Comments After winning the ODI series against South Africa3
సిరీస్‌ మొత్తంలో గర్వపడిన సందర్భం అదే: కేఎల్‌ రాహుల్‌

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్‌ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటింది. తొలుత బౌలర్లు.. ఆతర్వాత బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయాన్నందించారు.మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్పందిస్తూ ఇలా అన్నాడు. అతని మాటల్లో.. టాస్ గెలుపు చాలా కీలకం. టాస్‌ తప్ప ఈ మ్యాచ్‌ గెలుపులో నా పాత్ర ఏమీ లేదు. ఈ సిరీస్‌ మొత్తంలో గర్వపడిన సందర్భం టాస్ గెలిచినప్పుడే.తొలి రెండు వన్డేల్లో టాస్‌ ఓడటం వల్ల సెకెండ్‌ ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేయవల్సి వచ్చింది. మంచు కురిసే వేళల్లో అది బౌలర్లకు విషమ పరీక్ష. ఈ రోజు టాస్‌ గెలిచి బౌలర్లను ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాను.పిచ్‌ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. అయినా మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేసి వికెట్లు సాధించారు. ప్రసి​ద్ద్‌ తొలుత ఇబ్బంది పడినా, ఆతర్వాతి స్పెల్‌లో మ్యాచ్‌ గతినే మార్చేశాడు. ఆతర్వాత కుల్దీప్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. వారి తరఫున డికాక్‌ అద్భుతంగా ఆడాడు. అతడి వికెట్‌ చాలా కీలకం. సిరీస్‌ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒత్తిడిని బాగా హ్యాండిల్‌ చేశాం. సిరీస్‌ ఆధ్యాంతం సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్బుతంగా బ్యాటింగ్‌ చేశారు. మా బౌలర్లపై అధికమైన ఒత్తిడి ఉండింది. రెండో వన్డేలో అదృష్టం మా పక్షాన లేదు. అందుకే ఓడాం.కాగా, నిన్నటి వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసింది. ప్రసి​ద్ద్‌ కృష్ణ (9.5-0-66-4), కుల్దీప్‌ యాదవ్‌ (10-1-41-4) అద్భుతంగా బౌలింగ్‌ చేసి సౌతాఫ్రికాను 270 పరుగులకే పరిమితం చేశారు. డికాక్‌ (106) ఒక్కడే సెంచరీతో పోరాటం చేశాడు. బవుమా (48) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (116 నాటౌట్‌) సూపర్‌ సెంచరీతో.. రోహిత్‌ (75), కోహ్లి (65 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా భారత్‌ 39.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Virat Kohli surpasses Sachin Tendulkar in elite list with Player of the Series award against South Africa4
సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన విరాట్‌

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి (Virat kohli) ఖాతాలో మరో రికార్డు చేరింది. సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలవడంతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలిచిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో మరో దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డు బద్దలు కొట్టాడు. సచిన్‌ ఖాతాలో 19 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు ఉండగా.. విరాట్‌ ఖాతాలో 20వ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు చేరింది. ఈ విభాగంలో విరాట్‌, సచిన్‌ తర్వాతి స్థానాల్లో షకీబ్‌ అల్‌ హసన్‌ (17), జాక్‌ కల్లిస్‌ (14), సనత్‌ జయసూర్య (13), డేవిడ్‌ వార్నర్‌ (13) ఉన్నారు.జయసూర్య రికార్డు సమంప్రత్యేకించి వన్డే క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్‌కు వన్డేల్లో ఇది 11వ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు. ఈ అవార్డుతో విరాట్‌ సనత్‌ జయసూర్య రికార్డును సమం చేశాడు. జయసూర్య ఖాతాలోనూ 11 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలిచిన ఆటగాడిగా సచిన్‌ చలామణి అవుతున్నాడు.కాగా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో విరాట్‌ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు శతకాలు (135, 102) సహా చివరి మ్యాచ్‌లో అజేయమైన అర్ద సెంచరీ (65) చేశాడు. ఈ ప్రదర్శనలకు గానూ అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది. టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.జైస్వాల్‌ సూపర్‌ సెంచరీ.. సిరీస్‌ కైవసం​ చేసుకున్న భారత్‌విశాఖ వేదికగా నిన్న (డిసెంబర్‌ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. డికాక్‌ (106) సెంచరీ సాయంతో 270 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్‌ (116 నాటౌట్‌) సూపర్‌ సెంచరీ.. రోహిత్‌ (75), కోహ్లి (65 నాటౌట్‌) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ 39.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Australia near to consecutive second victory in Ashes 2025-265
ఓటమి అంచుల్లో ఇంగ్లండ్‌

బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌ వన్‌ సైడెడ్‌గా సాగుతోంది. మరోసారి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి టెస్ట్‌లో బంపర్‌ విక్టరీ సాధించిన ఆసీస్‌ మరోసారి అదే స్థాయి గెలుపు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లం​డ్‌ గట్టెక్కడం అసంభవం. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంగ్లండ్‌ ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. ఇన్నింగ్స్‌ పరాభవం తప్పించుకోవాలంటే ఇంగ్లండ్‌ మిగిలిన 4 వికెట్లు కోల్పోకముందే ఈ పరుగులు చేయాలి. బెన్‌ స్టోక్స్‌ (4), విల్‌ జాక్స్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, మైఖేల్‌ నెసర్‌, స్కాట్‌ బోలాండ్‌ తలో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బేశారు. ఇం​గ్లండ్‌ ఇన్నింగ్స్‌లో క్రాలే 44, డకెట్‌ 15, పోప్‌ 26, రూట్‌ 15, బ్రూక్‌ 15, జేమీ స్మిత్‌ 4 పరుగులు చేసి ఔటయ్యారు. వీరందరికీ మంచి ఆరంభమే లభించినప్పటికీ.. ఒక్కరు కూడా భారీ స్కోర్‌ చేయలేకపోయారు.అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. జట్టులో 11 మంది తలో చేయి వేసి ఈ స్కోర్‌ వచ్చేలా చేశారు. స్పెషలిస్ట్‌ బౌలర్‌ అయిన మిచెల్‌ స్టార్క్‌ (77) బ్యాట్‌తోనూ చెలరేగి టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం.స్టార్క్‌తో పాటు మరో నలుగురు కూడా అర్ద సెంచరీలు చేశారు. జేక్‌ వెదరాల్డ్‌ 72, లబూషేన్‌ 65, స్టీవ్‌ స్మిత్‌ 61, అలెక్స్‌ క్యారీ 63 పరుగులు చేశారు.ట్రవిస్‌ హెడ్‌ (33), గ్రీన్‌ (45) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఇంగ్లిస్‌ 23, నెసర్‌ 16, బోలాండ్‌ 21 (నాటౌట​్‌), డాగెట్‌ 13 పరుగులు చేశారు. ఇం​గ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్టోక్స్‌ 3, ఆర్చర్‌, అట్కిన్సన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు.తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో 334 పరుగులు చేసింది. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

Andhra beats Kerala in Syed Mushtaq Ali Trophy6
శ్రీకర్‌ భరత్‌ మెరుపులు

లక్నో: ఓపెనర్‌ శ్రీకర్‌ భరత్‌ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో... దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 7 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్‌ (56 బంతుల్లో 73 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో సత్తాచాటగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సామ్సన్‌ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. రోహన్‌ కున్నుమ్మల్‌ (2), మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ (6), క్రిష్ణ ప్రసాద్‌ (5), అబ్దుల్‌ బాసిత్‌ (2), సల్మాన్‌ నిజార్‌ (5), షర్ఫుద్దీన్‌ (3) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, సౌరభ్‌ కుమార్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 123 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భరత్‌ దంచేయగా... అశ్విన్‌ హెబ్బర్‌ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), పైల అవినాష్‌ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతడికి సహకరించారు. గ్రూప్‌ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర జట్టు ఐదు విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో సోమవారం విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. అభిషేక్‌ అదరహో..సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (34 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు; 2/8)... సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతు న్నాడు. ఫలితంగా ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు 73 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్‌ కెప్టెన్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అభిషేక్‌ దంచికొట్టగా... ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (28 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్‌ ధీర్‌ (22 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్‌ హాఫ్‌సెంచరీలు నమోదు చేసుకున్నారు. సర్వీసెస్‌ బౌలర్లలో అభిషేక్‌ తివారి, విశాల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో సర్వీసెస్‌ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ తివార టరి(30 బంతుల్లో 40; 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలినవాళ్లువిఫలమయ్యారు. బౌలింగ్‌లో అభిషేక్, సాన్‌వీర్‌ సింగ్, హర్‌ప్రీత్‌ బ్రార్‌ తలా 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో పాండిచ్చేరి 81 పరుగుల తేడాతో బెంగాల్‌పై, గుజరాత్‌ 1 వికెట్‌ తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై హర్యానా 8 పరుగుల తేడాతో బరోడాపై విజయాలు సాధించాయి.హైదరాబాద్‌ ‘టాప్‌’ షోబిహార్‌పై ఘనవిజయంకోల్‌కతా: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్‌ జట్టు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా... శనివారం జరిగిన పోరులో హైదరాబాద్‌ జట్టు 7 వికెట్ల తేడాతో బిహార్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బిహార్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. పియూశ్‌ సింగ్‌ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), బిపిన్‌ సౌరభ్‌ (19 బంతుల్లో 31 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ 3, చామా మిలింద్‌ రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 12.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌ (42 బంతుల్లో 67; 11 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రజ్ఞయ్‌ రెడ్డి (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తాచాటారు. గ్రూప్‌ ‘బి’లో హైదరాబాద్‌ 6 మ్యాచ్‌లాడి 5 విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Red Bull racer Max Verstappen took pole position7
వెర్‌స్టాపెన్‌కు ‘పోల్‌’

అబుదాబి: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ చివరి రేసులో రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. 24 రేసుల సీజన్‌లో అబుదాబీ గ్రాండ్‌ ప్రి చివరి రేసు కాగా... శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ రేసులో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ ల్యాప్‌ను 1 నిమిషం 22. 207 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌ ‘పోల్‌ పొజిషన్‌’ నుంచి ప్రారంభించనున్నాడు. మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్‌ 1 నిమిషం 22.408 సెకన్లు, ఆస్కార్‌ పియాస్ట్రి 1 నిమిషం 22.437 సెకన్లు వరుసగా రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నారు. 2015 నుంచి అబుదాబి సర్క్యూట్‌లో పోల్‌ పొజిషన్‌ సాధించిన డ్రైవరే... ప్రధాన రేసులో విజేతగా నిలుస్తూ వస్తున్నాడు. మరి ఈ సారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందా... లేక మెక్‌లారెన్‌ డ్రైవర్లు సత్తాచాటుతారా నేడు తేలనుంది.ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఎనిమిదో పోల్‌ పొజిషన్‌ కాగా... ఓవరాల్‌గా కెరీర్‌లో 48వది. ఈ రేస్‌తోనే డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ విజేత తేలనున్నారు. నోరిస్‌ 408 పాయింట్లతో రేసులో ముందుండగా... నాలుగుసార్లు చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పియాస్ట్రి 392 పాయింట్లతో మూడో ‘ప్లేస్‌’లో ఉన్నాడు. వెర్‌స్టాపెన్‌ రేసులో విజేతగా నిలిచినా... నోరిస్‌ ‘టాప్‌–3’లో చోటు దక్కించుకుంటే అతడికే డ్రైవర్స్‌ చాంపియన్‌íÙప్‌ టైటిల్‌ దక్కనుంది.

Young Indian shooter Suruchi Singh wins gold medal8
సురుచికి స్వర్ణం

దోహా: భారత యువ షూటర్‌ సురుచి సింగ్‌... అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) సీజన్‌ చివరి వరల్డ్‌కప్‌ ఫైనల్లో పసిడి పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో సురుచి 245.1 పాయింట్లతో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్‌ సైన్యం 243.3 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. ఒలింపిక్‌ పతక విజేత మనూ భాకర్‌ 179.2 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో సురుచి 586, మనూ భాకర్‌ 578, సైన్యం 573 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సామ్రాట్‌ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో సామ్రాట్‌ 221.5 పాయింట్లు సాధించాడు. తొలి రోజు పోటీల్లో భారత ఎయిర్‌ రైఫిల్‌ షూటర్లు నిరాశ పరిచారు. రుద్రాం„Š పాటిల్, అర్జున్‌ బబూతా వరుసగా నాలుగు, ఆరో స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఎలవెనిల్‌ వలరివన్‌ 9వ స్థానంతో సరిపెట్టుకుంది.

Wrestling league from January 15th9
జనవరి 15 నుంచి రెజ్లింగ్‌ లీగ్‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌) జరగనుంది. పోటీలన్నీ నోయిడాలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ శనివారం పేర్కొన్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననుండగా... ఒక్కో జట్టులో 9 మంది రెజ్లర్లు ఉంటారు. వీరిలో నలుగురు మహిళలు తప్పనిసరి. అన్నీ జట్లలో ఐదుగురు భారత రెజ్లర్లతో పాటు నలుగురు విదేశీ రెజ్లర్లకు అవకాశం కల్పించారు. వేలంలో 20 దేశాలకు చెందిన 300 మంది రెజ్లర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు సంజయ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇందులో ఒలింపిక్‌ పతక విజేతలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజేతలు, పలువురు అంతర్జాతీయ స్టార్లు ఉన్నట్లు సంజయ్‌ సింగ్‌ తెలిపారు.

India beat South Africa by 9 wickets in the final ODI10
విశాఖలో 'విజయ పతాక'

భారత టాపార్డర్‌ బ్యాటర్లు సిరీస్‌ గెలిపించారు. యశస్వి జైస్వాల్‌ అజేయ శతకంతో కదం తొక్కగా, సీనియర్‌ సూపర్‌ స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఫిఫ్టీలతో మెరిపించారు. అంతకుముందు పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ జోరందుకున్న సఫారీపై నిప్పులు చెరిగాడు. ఇతనికి తోడుగా కుల్దీప్‌ యాదవ్‌ తిప్పేశాడు. దీంతో పరుగుల పరంగా ఎటో వెళ్లాల్సిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా 48 ఓవర్లయినా పూర్తిగా ఆడలేక ఆలౌటైంది. అలా విశాఖలో టీమిండియా విజయ పతాకాన్ని ఎగురవేసింది.సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయి దిగాలు పడిన టీమిండియా తెలుగు నేలపై తెగ మురిసే విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన చివరి వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. మొదట సఫారీ జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్‌ డికాక్‌ (89 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. బవుమా (67 బంతుల్లో 48; 5 ఫోర్లు) రాణించాడు. ప్రసిధ్‌ కృష్ణ, కుల్దీప్‌ చెరో 4 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ 39.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’యశస్వి జైస్వాల్‌ (121 బంతుల్లో 116 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వన్డే సెంచరీ సాధించాడు. రోహిత్‌ (73 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’కోహ్లి (45 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. 9న కటక్‌లో జరిగే తొలి టి20తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ మొదలవుతుంది. ఆదుకున్న డికాక్‌20 ఓవర్లయిపోయాయి. దక్షిణాఫ్రికా జట్టు స్కోరేమో వంద దాటేసింది. ఇంకేం మరో పరుగుల విందు గ్యారంటీ అనిపించింది ఒక దశలో! ఇంతలో 21వ ఓవర్‌ ఆఖరి బంతికి కెప్టెన్‌ బవుమాను జడేజా అవుట్‌ చేశాడు. ఇదొక్కటి సఫారీ జోరును, స్కోరును వారి బ్యాటింగ్‌ తీరునే మార్చేసింది. అన్ని ఓవర్ల (50)ను ఆడకుండా చేసింది. బ్యాటర్లనంతా ఆలౌట్‌ చేసింది. ఇదంతా కూడా మరుసటి 27 ఓవర్లలోనే జరిగింది. 300 పైచిలుకు ఖాయమనుకున్న స్కోరు 270 పరుగుల వద్దే ఆగిపోయింది. 21వ ఓవర్‌ నుంచి 48 ఓవర్‌ ముగియక ముందే 156 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కూలడంతోనే సఫారీ అధోగతి పాలైంది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగగానే రికెల్టన్‌ (0) వికెట్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికాను డికాక్, కెప్టెన్‌ బవుమా నడిపించారు. ఇద్దరు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. బవుమాను అవుట్‌ చేసిన జడేజా అంతా మార్చేశాడు. తర్వాత వచ్చిన వారెవరూ ప్రసిధ్‌ పేస్‌ను, కుల్దీప్‌ స్పిన్‌ను ఎదుర్కోలేకపోయారు.జైస్వాల్‌ ధమాకాఈ సిరీస్‌లో వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు కలిసి అవలీలగా 600 పైచిలుకు స్కోర్లు చేయడం చూసిన మనకు ఈ స్కోరును చూస్తే ఏమంత కష్టసాధ్యం కాదని ఇట్టే తెలిసిపోతుంది. అందుకు తగ్గట్లే ఓపెనర్లు రోహిత్, జైస్వాల్‌ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టారు. 10.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. 20వ ఓవర్లో వందకు చేరింది. 25వ ఓవర్లోనే 150 పరుగులకు చేరడంతోనే గెలుపు పిలుపు వినిపించింది. ఈ క్రమంలో ముందుగా రోహిత్‌ 54 బంతుల్లో తర్వాత జైస్వాల్‌ 75 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. తొలివికెట్‌కు 155 పరుగులు జోడించాక రోహిత్‌ జోరుకు కేశవ్‌ మహరాజ్‌ కళ్లెం వేశాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి వచ్చి రావడంతోనే చేదంచేపనిలో పడ్డాడు. చూడచక్కని బౌండరీలు స్ట్రోక్‌ ప్లేతో జైస్వాల్‌ 111 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకోగా... కాసేపటికే కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. మనం టాస్‌ గెలిచామోచ్‌!విశాఖలో మ్యాచ్‌ మొదలయ్యే ముందు ‘టాస్‌ కా బాస్‌’.... మ్యాచ్‌ ముగిశాక ‘సిరీస్‌ కా బాస్‌’రెండు టీమిండియానే! కీలకమైన మ్యాచ్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టాస్‌ గెలిచాడు. వరుసగా 20 మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడిన భారత్‌ ఎట్టకేలకు 21వ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గింది. టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్‌ సుందర్‌ను పక్కనబెట్టి హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మకు తెలుగు గడ్డపై మ్యాచ్‌ ఆడే అవకాశం కల్పించారు.20,048‘హిట్‌మ్యాన్‌’రోహిత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో చేసిన పరుగులివి. టెస్టులు, వన్డేలు, టి20 ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేల పైచిలుకు పరుగులు చేశాడు.స్కోరు వివరాలుదక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) ప్రసిధ్‌ 106; రికెల్టన్‌ (సి) రాహుల్‌ (బి) అర్ష్ దీప్ 0; బవుమా (సి) కోహ్లి (బి) జడేజా 48; బ్రీట్‌కి (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్‌ 24; మార్క్‌రమ్‌ (సి) కోహ్లి (బి) ప్రసిధ్‌ 1; బ్రెవిస్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 29; యాన్సెన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 17; బాష్‌ (సి) అండ్‌ (బి) కుల్దీప్‌ 9; కేశవ్‌ నాటౌట్‌ 20; ఎన్‌గిడి (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 1; బార్ట్‌మన్‌ (బి) ప్రసిధ్‌ 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్‌) 270. వికెట్ల పతనం: 1–1, 2–114, 3–168, 4–170, 5–199, 6–234, 7–235, 8–252, 9–258, 10–270. బౌలింగ్‌: అర్ష్ దీప్ 8–1–36–1, హర్షిత్‌ 8–2–44–0, ప్రసిధ్‌ కృష్ణ 9.5–0–66–4, జడేజా 9–0–50–1, కుల్దీప్‌ 10–1–41–4, తిలక్‌ వర్మ 3–0–29–0. భారత్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ నాటౌట్‌ 116; రోహిత్‌ (సి) బ్రీట్‌కి (బి) కేశవ్‌ 75; కోహ్లి నాటౌట్‌ 65; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (39.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 271. వికెట్ల పతనం: 1–155. బౌలింగ్‌: యాన్సెన్‌ 8–1–39–0, ఎన్‌గిడి 6.5–0–56–0, కేశవ్‌ 10–0–44–1, బార్ట్‌మన్‌ 7–0–60–0, బాష్‌ 6–0–53–0, మార్క్‌రమ్‌ 2–0–17–0.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement