బీమా అమ్మకం కాదు కస్టమర్ల నమ్మకం ముఖ్యం
డిపాజిట్ల సమీకరణ, రుణ వితరణ కీలకం
బ్యాంక్లకు ఆర్థిక మంత్రి సీతారామన్ హితవు
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ అసలు వ్యాపారం అయిన డిపాజిట్లు సమీకరించడం, రుణాలు ఇవ్వడం, తక్కువ వ్యయాలతో కూడిన కాసా డిపాజిట్లను పెంచుకోవడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అంతేకానీ, బ్యాంకుకు సంబంధం లేని బీమా, ఇతర ఉత్పత్తులను అనుచిత మార్గాల్లో విక్రయించే (మిస్ సెల్లింగ్) చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
‘‘బ్యాంక్లు తమ ప్రధాన వ్యాపార సూత్రాలను దృష్టిలో పెట్టుకోకుండా, వారి రుణ అవసరాలను అర్థం చేసుకోకుండా, వారితో సంబంధాలను బలోపేతం చేసుకోకుండా, ఇతర కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అవసరం లేకపోయినప్పటికీ బీమా పాలసీల విక్రయాలపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాయి. దీంతో రెండు స్కూళ్ల పరిధిలోకి (ఆర్బీఐ, ఐఆర్డీఏఐ నియంత్రణలు) వచ్చి చేరుతున్నాయి. కస్టమర్లకు అప్పటికే బీమా రక్షణ ఉన్నప్పటికీ, మళ్లీ కొనుగోలు చేయాలని బ్యాంక్లు అడుగుతున్నాయి.
బీమా ఐఆర్డీఏఐ పరిధిలోకి వస్తుందన్న ఉద్దేశంతో ఈ తప్పుడు విక్రయాలను ఆర్బీఐ పర్యవేక్షించడం లేదు. బ్యాంక్లు ఆర్బీఐ పరిధిలోకి వస్తాయని ఐఆర్డీఏఐ ఊరుకుంటోంది. ఈ పర్యవేక్షణ అంతరాల వల్ల కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’అని ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. మిస్ సెల్లింగ్పై ఆర్బీఐ ఫిబ్రవరి 11న ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేయడం గమనార్హం.
వీటి ప్రకారం కస్టమర్లకు అవసరం లేని ఉత్పత్తులను విక్రయించరాదు. అలా చేసినట్టు తేలితే కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా ఉత్పత్తి లేదా సేవను విక్రయించడం వల్ల కస్టమర్ నష్టపోయినట్టు తేలితే, ఆ మేరకు పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. మిస్సెల్లింగ్ ఆమోదయోగ్యం కాదంటూ ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేయడం పట్ల సంతోషంగా ఉందని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ లేదని సీతారామన్ అన్నారు.
బంగారం దిగుమతులపై కన్నేసి ఉంచాం..
బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని.. దీనిపై ప్రభుత్వం, ఆర్బీఐ కన్నేసి ఉంచినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంక్లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండడం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు బంగారం దిగుమతులు బిలియన్ డాలర్ల మేర పెరిగి 50 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. బంగారం భారతీయ కుటుంబాలకు ఎల్లప్పుడూ అనుకూల పెట్టుబడి సాధనంగా ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు. జనవరిలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరిగిపోవడాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సైతం ఈ సమావేశంలో భాగంగా మీడియాతో చెప్పారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్కే పరిమితం..
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో రూ.590 కోట్ల మోసపూరిత ఘటన వ్యవస్థాపరమైన సమస్య కాదన్నారు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా. పరిణామాలను గమనిస్తున్నట్టు చెప్పారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ చండీగఢ్ శాఖలో హరియాణా ప్రభుత్వ సంస్థల ఖాతాల నుంచి ఉద్యోగులు నిధులను దారి మళ్లించడం తెలిసిందే. 2024 బేస్ సంవత్సరం ఆధారంగా విడుదలయ్యే రిటైల్ ద్రవ్యోల్బణం.. కుటుంబాల వినియోగం తీరుతెన్నులను మరింత ప్రభావంతంగా ప్రతిఫలిస్తుందని మల్హోత్రా తెలిపారు.


