బెంగళూరు: తుంటి గాయం నుంచి కోలుకుంటున్నానని... భారత టెన్నిస్ నంబర్వన్ ప్లేయర్ సుమిత్ నగాల్ తెలిపాడు. రెండు రోజుల్లో మొదలయ్యే డేవిస్కప్ టీమ్ టెన్నిస్ క్వాలిఫయర్స్ మ్యాచ్కు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఈనెల 7, 8 తేదీల్లో బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ ఆడనుంది.
ముఖాముఖి రికార్డులో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. గత ఏడాది తనకు అంతగా కలిసి రాలేదని, కొత్త ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రపంచ 281వ ర్యాంకర్ సుమిత్ తెలిపాడు. గత సంవత్సరం సుమిత్ రెండు ఏటీపీ టూర్ టోర్నీలలో ఆడగా... ఏడు చాలెంజర్ సిరీస్ టోర్నీల్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.
పృథ్వీకి రజతం
మోదీ నగర్ (ఉత్తరప్రదేశ్): జాతీయ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు రజత పతకం లభించింది. గురువారం జరిగిన పురుషుల యూత్ 56 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అప్పినేని పృథ్వీ రెండో స్థానంలో నిలిచాడు. పృథ్వీ మొత్తం 215 కేజీలు బరువెత్తి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్సీబీ) వెయిట్లిఫ్టర్ ధర్మజ్యోతి దేవ్ఘరియా 230 కేజీలు బరువెత్తి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అర్ష్లాన్ (ఉత్తరాఖండ్; 212 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు.


