భారత మహిళల హాకీ జట్టు క్వాలిఫయర్స్కు సై
నేడు ఉరుగ్వేతో తొలిపోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్ బెర్తే లక్ష్యంగా క్వాలిఫయర్స్ బరిలోకి దిగుతోంది. నేడు తొలి పోరులో భారత జట్టు ఉరుగ్వేతో తలపడుతుంది. గచ్చిబౌలి హాకీ టర్ఫ్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు బెర్త్ల కోసం మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య భారత్తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియాలు క్వాలిఫయర్స్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి.
8 జట్లను రెండు పూల్స్గా విభజించారు. పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు పూల్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ మార్చి 13న... మూడో స్థానం కోసం మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ మార్చి 14న జరుగుతాయి.
ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. తొలి రోజు ఆదివారం ఇంగ్లండ్తో ఇటలీ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి); కొరియాతో ఆస్ట్రియా(మధ్యాహ్నం గం. 3 నుంచి); స్కాట్లాండ్స్తో వేల్స్ (సాయంత్రం గం. 5:15 నుంచి) కూడా తలపడతాయి.


