భారత మహిళల హాకీ జట్టు కోచ్ మరీన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా భారత మహిళల హాకీ జట్టు సాధన కొనసాగుతోందని జట్టు హెడ్ కోచ్ జోయర్డ్ మరీన్ అన్నాడు. అతడి నేతృత్వంలో 2020 టోక్యో ఒలింపిక్స్లో మన జట్టు అత్యుత్తమంగా నాలుగో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు టాప్–3లో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మరీన్ వెల్లడించాడు. 2017 నుంచి 2021 వరకు భారత మహిళల జట్టుకు కోచ్గా వ్యవహరించిన అతడు... తిరిగి ఈ ఏడాది ఆరంభంలో ఆ బాధ్యతలు చేపట్టాడు. అతడి శిక్షణలో ఇటీవల నేషన్స్ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టు వచ్చే సీజన్లో ప్రొ లీగ్కు అర్హత సాధించింది.
ఈ నేపథ్యంలో మరీన్ మాట్లాడుతూ... ‘మా అతిపెద్ద లక్ష్యం 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకం నెగ్గడం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం లాంటి ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే ముందు బేస్ క్యాంప్కు చేరుకోవాలి. ఉన్నత లక్ష్యాలను అందుకోవాలంటే చిన్న చిన్న గమ్యాలను నిర్దేశించుకొని వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలి. ప్రస్తుతం మా జట్టు అదే పనిలో ఉంది. మంచి శిక్షణ బృందాన్ని సమకూర్చడం... సరైన ఆటగాళ్లను ఎంపిక చేయడం... ప్రతిభావంతులను గుర్తించడం... సీనియర్, జూనియర్లను సరిగ్గా వినియోగించుకోవడం ఇవన్నీ అందులో భాగమే.
భారత మహిళల హాకీలో అత్యున్నతమైన ఒలింపిక్ పతకాన్ని సాధించేందుకు ప్లేయర్లలో మానసిక స్థయిర్యం, ప్రేరణ నింపుతున్నాం. ఎవరెస్ట్, కిలిమంజారో వంటి శిఖరాలను అధిరోహించిన పర్వాతారోహకుడు హేమంత్ గుప్తాతో ప్లేయర్లకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి వారిలో స్ఫూర్తి నింపాం. జట్టుగా కలిసి పనిచేస్తే వచ్చే ఫలితాలను వివరించాం. క్రమశిక్షణ, నిరంతర సాధనతో ఎలాంటి లక్ష్యాలనైనా అందుకోవచ్చు’ అని వివరించారు. వ్యక్తిగత లక్ష్యాలను పక్కపెట్టి... జట్టుగా ముందుకు సాగినప్పుడే పెద్ద టోర్నీల్లో విజయాలు సాధించగలమని మరీన్ వెల్లడించాడు.


