పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) తీరుపై ఆ దేశ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. PHF ప్రస్తుత యాజమాన్యంతో కలిసి తాము పనిచేయలేమని తేల్చిచెప్పాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తించి.. ఆఖరికి అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలేం జరిగిందంటే.. FIH Pro Leagueలో భాగంగా తమ మ్యాచ్లు ఆడేందుకు పాక్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, వారి వసతికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయడంలో PHF విఫలమైంది. కాన్బెర్రా వెళ్లేందుకు పాక్ జట్టు సిడ్నీ విమానాశ్రయంలో దాదాపు 13-14 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
అనంతరం హోటల్కు వెళ్లిన తర్వాత పాక్ హాకీ జట్టుకు మరో ఘోర అవమానం ఎదురైంది. వారి పేరిట అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో హోటల్ మేనేజ్మెంట్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో గంటల పాటు పాక్ హాకీ ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆసీస్ చేతిలో పాక్ ఓడిపోయింది. అనంతరం జర్మనీ చేతిలోనూ ఓటమిపాలైంది.
మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది
ఈ నేపథ్యంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ స్వదేశానికి వచ్చిన తర్వాత లాహోర్ ఎయిర్పోర్టులో మీడియాకు వెల్లడించాడు. ‘‘ప్రస్తుత హాకీ ఫెడరేషన్ యాజమాన్యంతో కలిసి మేము పనిచేయలేము.
మ్యాచ్ ఆడేందుకు వెళ్లే ముందు మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది. అలాంటపుడు మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించే సమయం మాకు ఎక్కడ ఉంటుంది?.. అసలు మ్యాచ్ ఆడతామో లేదో తెలియని పరిస్థితి. ఇక ఫలితం గురించి అడగటం ఎందుకు?
మాకు విదేశీ కోచ్ కావాలి
మేము పది రోజుల పాటు చీప్ ఏరియాలో ఉండాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని మా ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియాలో మాకు ఏం జరిగిందో అందరికీ తెలియాలి కాబట్టే నేను మాట్లాడుతున్నాను.
మాకు విదేశీ కోచ్ కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. యాజమాన్యం కూడా మంచిగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్ హాకీ ఫెడరేషన్కు ప్రాటన్-ఇన్-చీఫ్గా ప్రధాని షెబాజ్ షరీఫ్ ఉంటారు.
ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాము
ఈ నేపథ్యంలో పీఎస్బీ డైరెక్టర్- జరనల్ నూర్ సభా స్పందిస్తూ.. ఆటగాళ్ల ఆరోపణలపై విచారణ చేస్తున్నామని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పుకొచ్చాడు.
కాగా FIH Pro Leagueలో పాకిస్తాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఎనిమిది ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానం (తొమ్మిది)లో ఉంది. మరోవైపు.. బెల్జియం ఎనిమిదింట ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నాలుగింటికి నాలుగు ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.


