సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్‌ | Jammu Kashmir Cricket Team Scripts Ranji Trophy 2025-26 History Beat Bengal And Enter 1st Ever Final, Read Story Inside | Sakshi
Sakshi News home page

సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్‌

Feb 18 2026 12:23 PM | Updated on Feb 18 2026 12:55 PM

Jammu Kashmir Script Ranji Trophy History Beat Bengal Enter 1st Ever Final

జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో బెంగాల్‌ను మట్టికరిపించి తమ క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్‌లో భాగంగా బెంగాల్‌- జమ్మూ కశ్మీర్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ మొదలైంది. బెంగాల్‌లోని కళ్యాణి వేదికగా టాస్‌ గెలిచిన కశ్మీర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఘరామి సెంచరీ
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దగిన బెంగాల్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌట్‌ అయింది. సుదీప్‌ కుమార్‌ ఘరామి (146) సెంచరీ సాధించి టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. కశ్మీర్‌ బౌలర్లలో పేస్‌ సంచలన ఆకిబ్‌ నబీ ఐదు వికెట్లతో చెలరేగగా.. సునిల్‌ కుమార్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. యుధ్‌వీర్‌ సింగ్‌ చరఖ్‌, అబిద్‌ ముస్తాక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం జమ్మూ కశ్మీర్‌ బ్యాటింగ్‌కు దిగి 302 పరుగులకు ఆలౌట్‌ అయింది. అబ్దుల్‌ సమద్‌ 82 పరుగులతో రాణించగా.. కెప్టెన్‌ పారసస్‌‌​ డోగ్రా (58), ఆకిబ్‌ నబీ (42) కూడా మెరుగైన స్కోర్లు సాధించారు. బెంగాల్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ ఎనిమిది వికెట్లు కూల్చగా.. ముకేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

చెలరేగిన కశ్మీర్‌ బౌలర్లు
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బెంగాల్‌కు కశ్మీర్‌ బౌలర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు. పటిష్ట బెంగాల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేస్తూ 99 పరుగులకే కుప్పకూల్చారు. టాపార్డర్‌లో కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ఐదు పరుగేల చేయగా.. సుదీప్‌ ఛటర్జీ, సుదీప్‌ కుమార్‌ ఘరామి డకౌట్‌ అయ్యారు. ఓపెనర్ల వికెట్లతో పాటు సూరజ్‌ (14), షాకిర్‌ హబీబ్‌ గాంధీ (10) వికెట్లను ఆకిబ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

మిగిలిన వారిలో సునిల్‌ కుమార్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. యుధ్‌వీర్‌ రెండు వికెట్లు దక్కించకున్నాడు. ఈ క్రమంలో బెంగాల్‌ విధించిన 126 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కశ్మీర్‌నాలుగో రోజు ఆటలో పూర్తి చేసింది. ఓపెనర్లు శుభం ఖజూరియా (1), యావర్‌ హసన్‌ (6, కెప్టెన్‌ డోగ్రా (9) విఫలమైనా.. శుభం పందిర్‌ (27), వన్షజ్‌ శర్మ (43 నాటౌట్‌), అబ్దుల్‌ సమద్‌ (30 నాటౌట్‌) పనిపూర్తి చేశారు. 

తొలిసారి రంజీ ఫైనల్‌లో
లక్ష్య ఛేదనలో నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసిన జమ్మూ కశ్మీర్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా తొమ్మిది వికెట్లు తీసిన ఆకిబ్‌ నబీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు.

చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement