టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఇప్పటికే ఏడు జట్లు సూపర్-8 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సూపర్-8లో అడుగుపెట్టగా.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి.
పోటీలో అమెరికా, పాక్
ఇక గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య భారత్ హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకోగా.. ఇదే గ్రూపు నుంచి రెండో బెర్తు కోసం అమెరికా, పాకిస్తాన్ పోటీలో ఉన్నాయి. గ్రూప్-ఎ టాపర్ టీమిండియా ఖాతాలో ఆరు పాయింట్లు ఉండగా.. నెట్రన్రేటు (+3.050).
రెండో స్థానంలో ఉన్న అమెరికా నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుని రెండు గెలిచి 4 పాయింట్లతో ఉంది. నెట్రన్రేటు (+0.787). ఇక నమీబియా ఆడిన మూడింటికి మూడు ఓడి ఎలిమినేట్ కాగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లు సాధించిది. అమెరికాతో సమానంగా పాయింట్లు ఉన్నా నెట్రన్రేటు (-0.403) పరంగా వెనుకబడి ప్రస్తుతానికి మూడో స్థానంలో నిలిచింది.
వర్షం పడితే..
ఈ క్రమంలో గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ బుధవారం నమీబియాతో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.
పల్లెకెలెలో వాన వల్ల జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో జింబాబ్వే సూపర్-8కు చేరగా.. ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇక పాక్- నమీబియా మ్యాచ్కు కూడా వాన ముప్పు పొంచి ఉంది.
ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో బుధవారం వర్షం పడేందుకు 67 శాతం అవకాశాలు ఉన్నాయి. రాత్రికి 55 శాతం వాన పడే అవకాశాలు తగ్గినా.. పాక్- నమీబియా మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకే మొదలుకావాల్సి ఉంది.
సంతోషంలో పాక్ జట్టు అభిమానులు
ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ గనుక రద్దైతే పాకిస్తాన్కు పండుగే. వాన వల్ల మ్యాచ్ సాగకపోతే పాక్, నమీబియాలకు చెరో పాయింట్ వస్తుంది. తద్వారా పాక్ ఖాతాలోని పాయింట్ల సంఖ్య ఐదుకు చేరి.. సూపర్-8కు నేరుగా అర్హత సాధిస్తుంది. దీంతో అమెరికా నిష్క్రమించాల్సి ఉంటుంది.
ఒకవేళ మ్యాచ్ జరిగినా పాక్ నమీబియాపై తప్పక గెలవాలి. నమీబియా పసికూనే అయినా పాక్ నిలకడలేమితనం ఆ జట్టు అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. అయితే, మ్యాచ్కు వాన ముప్పు ఉందని తెలిసి వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.


