కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఉత్తరాఖండ్ పాలిట శాపంగా మారింది. ప్రత్యర్థి జట్టులో మేటి బ్యాటర్లు ఉన్న సంగతి విస్మరించి... తొలుత బౌలింగ్ ఎంచుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. రంజీ ఫైనల్ 2025-26 ఫైనల్ చేరే అవకాశం దాదాపుగా ఉత్తరాఖండ్ చేజారినట్లే!
లక్నో వేదికగా రంజీ తొలి సెమీస్ మ్యాచ్లో కర్ణాటక- ఉత్తరాఖండ్ మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చండేలా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కర్ణాటక అదరగొట్టింది.
కర్ణాటక బ్యాటర్ల అద్భుత ప్రదర్శన
కర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (232) డబుల్ సెంచరీ... కేఎల్ రాహుల్ (141) సెంచరీ... రవిచంద్రన్ స్మరణ్ (135) సెంచరీ... కరుణ్ నాయర్ (60), కృతిక్ కృష్ణ (60), విద్యాధర్ పాటిల్ అర్ధ సెంచరీలు సాధించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 736 పరుగులు సాధించి ఆలౌటైంది.
ఓవర్నైట్ స్కోరు 689/6తో మంగళవారం నాటి మూడో రోజు ఆట కొనసాగించిన కర్ణాటక మరో 47 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ సెంచరీ హీరో స్మరణ్ తన వ్యక్తిగత స్కోరుకు మరో 14 పరుగులు జోడించి 135 పరుగులకు అవుటయ్యాడు.
విద్యాధర్ (54) అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్య రావత్ 154 పరుగులిచ్చి 4 వికెట్లు, మయాంక్ మిశ్రా 173 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అభయ్ నేగి, అవనీశ్, లక్ష్యలకు ఒక్కో వికెట్ దక్కింది.
588 పరుగులు
ఇక కర్ణాటక నమోదు చేసిన భారీ స్కోరుకు జవాబుగా... మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించి, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదిస్తేనే ఉత్తరాఖండ్ జట్టుకు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందాలంటే మరో 588 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్లో మాజీ చాంపియన్ కర్ణాటక గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


