టీ20 ప్రపంచ కప్ 2026ను నేపాల్ అద్భుతమైన విజయంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా మంగళవారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన గ్రూపు-సి మ్యాచ్లో స్కాట్లాండ్పై 7 వికెట్ల తేడాతో నేపాల్ గెలుపొందింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో నేపాల్కు ఇదే తొలి విజయం.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాటిష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్కాట్లాండ్ జట్టుకు ఓపెనర్ మైఖేల్ జోన్స్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతను 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు జార్జ్ మున్సే (27), బ్రాండన్ మెక్ముల్లెన్ (25) రాణించారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 3 వికెట్లు పడగొట్టగా, నందన్ యాదవ్ 2 వికెట్లు సాధించాడు.
అనంతరం లక్ష్య చేధనలో నేపాల్కు ఓపెనర్లు కుశాల్ భుర్టెల్(43), ఆసిఫ్ షేక్ (33) మంచి అరంభం ఇచ్చారు. అయితే మిడిల్ ఓవర్లలో నేపాల్ వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో స్టార్ ఆల్ రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీపేంద్ర సింగ్ కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు చేసి నేపాల్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. అతడితో పాటు గుల్షాన్ జా కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.


